ద్వేషం, అసూయ, కుళ్ళు, కుతంత్రం వంటి ప్రతికూల ధోరణలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రతి శాఖకు, సంస్థకు ప్రజా సంబంధాల అధికారి (పీ ఆర్ ఓ) అత్యవసరమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి అన్నారు.
పీఆర్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ పీఆర్ మేనేజర్ అవార్డును నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ (పీఆర్) గా సేవలందిస్తున్న డా. హర్ష భార్గవి కి, జ్యురీ ప్రశంస అవార్డును దక్షిణ మధ్య రైల్వే పీ ఆర్ ఓ రాజేష్ కల్యాణ కు ప్రదానం చేసిన అనంతరం డా. రమణాచారి ప్రసంగించారు. డాక్టర్ సీవీఎన్ పీఆర్ ఫౌండేషన్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీ ఆర్ ఎస్ ఐ) హైదరాబాద్ చాఫ్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పీ ఆర్, కార్పొరేట్ కమ్యూనికేషన్ వృత్తి నిపుణులు, జర్నలిజం బోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
“పీఆర్ లేకపోతే కారు చీకట్లో కొట్టుకుపోవాల్సి వస్తుంది. సత్యంపై వెలుగును ప్రసరింపజేసే ప్రక్రియే పీఆర్. సరైన సమాచారాన్ని అందించే యంత్రాంగం లేకపోతే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు,” అని డా. రమణాచారి చెప్పారు. విదేశాంగ శాఖలో స్టేట్స్ డివిజన్ లో ఓ ఎస్ డీ గా పనిచేస్తున్న అంబాసిడర్ సీ రాజశేఖర్, ఐటీ నిపుణుడు హేమంత్ సత్యనారాయణ, పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు అజిత్ పాఠక్, ఉపాధ్యక్షుడు (సౌత్) యు ఎస్ శర్మ, పీ ఆర్ వాయిస్ ఎడిటర్ వై. బాబ్జీ, సీవీఎన్ పీఆర్ ఫౌండేషన్ బాధ్యులు సీ. రవీందర్ రెడ్డి, సీ రమాదేవి, పీ ఆర్ ఎస్ ఐ హైదరాబాద్ చాఫ్టర్ ఛైర్మన్ డా. ఎస్.రాము, కార్యదర్శి కె. యాదగిరి పాల్గొని ప్రసంగించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ పీఆర్ అధ్యాపకులకు, విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వల్ల కమ్యూనికేషన్, పీ ఆర్ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి హేమంత్ సత్యనారాయణ ప్రసంగించగా, విదేశీ సంబంధాల్లో పాజిటివ్ పీఆర్ సాధించే సత్ఫలితాల గురించి అంబాసిడర్ రాజశేఖర్ వివరించారు. “భారత ప్రభుత్వం అణు పరీక్షలు నిర్వహించిన సమయంలో జపాన్ ప్రభుత్వం, ప్రజలు భారత్ మీద తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. అప్పుడు చాలా వ్యూహాత్మకంగా నిర్వహించిన ప్రజా సంబంధాల కసరత్తు ద్వారా వారిని ప్రభావితం చేయగలిగాం,” అని అంబాసిడర్ చెప్పారు.
పీ ఆర్ ఎస్ ఐ హైదరాబాద్ చాఫ్టర్, డా. రమణాచారి చేసిన అభ్యర్ధన మేరకు ఆగస్టు 6 ను దేశ వ్యాప్తంగా జాతీయ పీఆర్ ఎడ్యుకేషన్ డే గా నిర్వహిచనున్నట్లు డా.అజిత్ పాఠక్ ప్రకటించారు. ఆ అవార్డు ప్రదానోత్సవంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పీ ఆర్, కమ్యూనికేషన్ నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discussion about this post