చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,027 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ ఒక్కరోజులోనే 471 మందికి కొవిడ్ సోకింది. అంటే జిల్లాలో నమోదైన కేసుల్లో తిరుపతిలోనే సగం ఉండటం గమనార్హం.
శ్రీవారి పాదాల చెంత కేసులు పెరిగి పోతుండటంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు నగర పరిధిలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకూ పెరిగి పోతున్నాయి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 27.21 శాతం ఉంది. దీనిని బట్టి చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చిత్తూరు జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల మధ్య 24గంటల వ్యవధిలో 1,027 మందికి కొవిడ్ సోకినట్లు వైద్యశాఖ నిర్ధారించింది. ఇటీవల కాలంలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తాజా కేసులతో కలిపి జిల్లాలో క్రియాశీలక (యాక్టివ్) కేసుల సంఖ్య 4,075కు చేరింది.
నగర, పట్టణ ప్రాంతాల్లో పరిశీలిస్తే…. తిరుపతిలో 364, చిత్తూరులో 124, మదనపల్లెలో 45, శ్రీకాళహస్తిలో 13, పుంగనూరులో 12, పుత్తూరులో 8, పలమనేరులో 2, నగరిలో 1 వంతున కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో 2,091 మందికి పరీక్షలు నిర్వహించగా…. అందులో 569 మందికి కరోనా సోకినట్లు తేలింది.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే… తిరుపతి రూరల్ లో 107, రేణిగుంట 25, పీలేరు 22, కుప్పం 21, చంద్రగిరి 20, మదనపల్లె 17, పూతలపట్టు 16, గంగాధర నెల్లూరు 12, బి.కొత్తకోట 10, చిన్నగొట్టిగల్లు, సదుంలో 9 వంతున, కురబలకోట, పులిచెర్ల, రొంపిచెర్లలో 8వంతున, చిత్తూరు, కేవీపల్లె, నాగలాపురం, నారాయణవనంలో 7వంతున, గుడుపల్లె, పాకాల, పెనుమూరు, రామకుప్పం, సోమల, ఏర్పేడులో 6వంతున, కలికిరి, పుత్తూరు, తంబళ్లపల్లె, వి.కోటలో 5వంతున, పెద్దతిప్పసముద్రం, పెద్దపంజాణి, పిచ్చాటూరు, శ్రీకాళహస్తి, వాల్మీకిపురం, యాదమరిలో 4వంతున కేసులు బయటపడ్డాయి.
ఐరాల, కార్వేటినగరం, ములకలచెరువు, నగరి, నిమ్మనపల్లె, నిండ్ర, పలమనేరు, పుంగనూరు, తవణంపల్లె, వడమాలపేట, వరదయ్యపాళెంలో 3వంతున, బైరెడ్డిపల్లె, గుర్రంకొండ, పెద్దమండ్యం, రామ చంద్రాపురం, తొట్టంబేడులో 2 వంతున, బంగారుపాళెం, చౌడేపల్లె, గంగవరం, గుడిపాల, కేవీబీపురం, పాలసముద్రం, రామసముద్రం, శాంతిపురం, వెదురుకుప్పం, యర్రావారిపాళెంలో 1వంతున తాజాగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
గత 24గంటల వ్యవధిలో కేవలం బుచ్చినాయుడుకండ్రిగ, సత్యవేడు, శ్రీరంగరాజపురం, విజయపురం మండలాల్లో మాత్రమే కేసులు నమోదు కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 10.75 శాతంగా ఉంది.
పండుగ పైనా ప్రభావం
కరోనా విజృంభిస్తుండటంతో ఆ ప్రభావం సంక్రాంతి పండుగ పైనా పడింది. సంక్రాంతి అంటే పట్టణాలు, పల్లెల్లో ఎంతో హడావుడి, సందడి ఉండేది. సంబరాలు కూడా బాగా చేసుకునే వారు. అయితే కొవిడ్ మూడవ దశ ప్రారంభం కావడం… కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పండుగ వాతావరణం చాలా వరకు తగ్గి పోయింది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య కూడా గతంతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గింది.
Discussion about this post