తిరుమల శ్రీవారి ఆలయంలో మండలాభిషేకం సందర్భంగా బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే. ఈ కార్యక్రమం జరిగిన తరువాత 48వ రోజు మండలాభిషేకం నిర్వహించారు. సాధారణంగా ఆలయాల్లో మహాసంప్రోక్షణ లాంటి కార్యక్రమాలు నిర్వహించినపుడు మండలాభిషేకం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ నిర్వహించారు. ఇందులో భాగంగా సర్వాలంకార భూషితులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిశేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు. శేషవాహనం దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
.
Discussion about this post