స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో అప్పటి హీరోల జీవితకథలు అనేకం సినిమాలుగా రూపొందాయి. అయితే మెగాస్టార్.. తాను సినిమాగా చేయదలచుకున్నట్టుగా వార్తలు వినిపించిన రియల్ హీరో ఒకరున్నారు. ఆయనే ఉధం సింగ్.
1919 ఏప్రిల్ 13న అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వం భారతీయులను అణచివేయడానికి రూపొందించి అమలుపరచిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా పలువురు రాజకీయ నాయకులు తన గళాన్ని వినిపించారు. దీంతో సత్యపాల్, సైపుద్దీన్ కిచ్లూ వంటి ప్రముఖ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. దీన్ని నిరసిస్తూ ప్రముఖ రాజకీయ నాయకులు ప్రజలనుద్దేశించి ప్రసంగించసాగారు.
ఈ సమావేశం పంజాబ్ లోని అమృత్ సర్ లోగల సిక్కుదేవాలయం పక్కనే వున్న జలియన్ వాలాబాగ్ వద్ద ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాంతం చుట్టూ ఇరుకైన సందులతో కూడివుంటుంది. అలాంటి ప్రాంతంలో సమావేశాన్ని నిర్వీర్యం చేయడానికి అప్పటి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్ట్ డయ్యర్ సమావేశంలో వున్న భారతీయులపై కాల్పులకు ఆదేశాలు జారీచేశారు.
ఈ దుర్ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 379మంది మరణించగా, 200 మంది గాయపడ్డారు. అయితే ఈ లెక్కలు సరికావు అనే వాదనలు కూడా వినిపిస్తాయి. ఎందుకంటే అక్కడే వున్న ఒక బావి నుండి సుమారుగా 120 శవాలను బయటికి తీసినట్టు చెబుతారు. అప్పటి అంచనాల ప్రకారం తోటలో సమావేశమై వున్న నిరాయుధులైన భారతీయులపై డయ్యర తన సైన్యంతో విచక్షణారహితంగా పది నిముషాల పాటు కాల్పులు జరిపించాడు.
మొత్తంగా 1650 రౌండ్ల కాల్పులు జరిగాయి. సుమారు వెయ్యి మంది మరణించగా, మరో రెండు వేలమంది దాకా గాయపడి వుంటారని సమాచారం. అయితే ఇది జరిగిన తర్వాత మరో ఏడాదికి డయ్యర్ కు అనారోగ్యం కారణంగా అతడిని ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు కలిగిన ఓడలో లండన్ కు పంపించి వేశారు. తర్వాత అతను అప్పట్లో చాలా సమర్ధవంతంగా ఉద్యమాన్ని అణచివేశారని బ్రిటీష్ అధికారులు ప్రశంసించారు.
అయితే అప్పట్లో ఈ దుర్ఘటన వల్ల తడిసిన భరతమాత ఎంతగానో తల్లడిల్లింది. ఇదే వ్యధను అనుభవించిన ఓ ఇరవైఏళ్ కుర్రవాడు ఎలాగైనా ఈ దురాగతానికి కారకుడైన వాడిని తన చేతులారా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సుమారు 21 ఏళ్ల పాటు ఎదురుచూశాడు.
ఉద్దమ్ సింగ్ 1899 డిసెంబర్ 26న పంజాబ్ లోని సంగూర్ జిల్లా సునం తెహసీల్ కు చెందిన కలన్ గ్రామంలో జన్మించాడు. ఇతడు పుట్టిన తర్వాత తన చుట్టూ వున్న పరిస్థితులను, తన దేశ ప్రజలు బ్రిటిష్ వారి పాలనలో అనుభవిస్తున్న దారిద్ర్యాన్ని, కష్టాలను చూస్తూ గడిపాడు. జలియన్ వాలాబాగ్ దురంతంలో వేలమంది ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన ఉద్దమ్ సింగ్ ఎలాగైనా జనరల్ డయ్యర్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఇరవై ఒక సంవత్సరాల పాటు ఎదురుచూశాడు.
లండన్ వెళ్లి అక్కడ విశ్రాంత జీవనాన్ని గడుపుతున్న జనరల్ డయ్యర్ ను కాక్సటన్ హాల్ లో ఉద్దమ్ సింగ్ కాల్చి చంపాడు. అనంతరం ఎదో ధైర్యంగా లొంగిపోయాడు. తన నేర విచారణ సమయంలో ఉద్దమ్ సింగ్ తాను ఈ హత్యను చేసినట్టు, ఎందుకంటే జనరల్ డయ్యర్ పై తనకు పగ ఉందని, తన దేశ ప్రజల ఆత్మను అతడు భంగపరిచాడని, అందుకోసం అతన్ని హత్య చేయాలనుకున్నానని, ఇందుకోసం తాను 21 ఏళ్లపాటు ఎదురుచూశానని చెప్పుకున్నాడు. తాను ఈ హత్య చేసినందుకు ఎంతమాత్రం పశ్చాత్తాప పడడంలేదని, తాను ఎంతో సంతోషంగా వున్నానని, తాను తన దేశంకోసం మరణిస్తున్నానని ఎంతో సగర్వంగా చెప్పుకున్నాడు.
పుట్టుకతో సిక్కు అయిన ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా మార్చుకున్నాడు. భారతదేశం పలు మతాలకు ఆలవాలమైంది. ఇందులో ముఖ్యంగా హిందూ, ముస్లిం, సిక్కుమతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ తన పేరును ఇలా మార్చకున్నట్టు చెబుతాడు. అందుకే ఉద్దమ్ సింగ్ త్యాగానికి, దేశభక్తికీ మెచ్చుకుంటూ ఇతడిని షహీద్ – ఎ-అజం (వీరులలో అగ్రగణ్యుడు)గా వ్యవహరిస్తారు. అలాంటి ఉద్దమ్ సింగ్ జయంతి ఈరోజు. చరిత్రలో ఎందరో వీరులు … అందరికీ వందనాలు. అయితే మరుగున పడిపోయిన ఇలాంటి వీరుడి గురించి మనలో చాలామందికి తెలియదు. మనవాళ్ల గురించి కొంతైనా తెలుసుకుందా. వారి త్యాగానికి తలవంచి నమస్కరిద్దాం.
.

Discussion about this post