కీలకమైన నాయకులు.. పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతే.. ఎంత నష్టం వాటిల్లుతుందో.. వాళ్లు పార్టీలోనే ఉంటూ.. క్రియాశూన్యంగా, స్తబ్ధంగా, సైలెంట్ గా ఉండిపోయినా కూడా పార్టీకి అంతే నష్టం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అలాంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం లోని కీలక నాయకుల్లో ఒకరు. పార్టీకి ఆర్థిక వనరుల పరంగా కూడా వెన్నుదన్నుగా నిలవగల స్థాయి నాయకుడు. అలాంటి కేశినేని నాని వచ్చే ఎన్నికల సమయానికి తాను ఎంపీగా పోటీ చేయనని ప్రకటించడం తెలుగుదేశం అభిమానులను విస్మయ పరుస్తోంది. తాను పార్టీలోనే ఉంటానని, కానీ తానుగానీ, తన కూతురు గానీ.. ఎన్నికల్లో పోటీచేయబోమని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ఈ విషయం పార్టీలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
కేశినేని నాని పార్టీలో సీనియర్ నాయకుడు. 2014లో తొలిసారిగా ఎంపీగా పోటీచేసిన కేశినేని నాని.. చాలా హైడ్రామా నడుమ పార్టీ టికెట్ తన సొంతం చేసుకున్నారు. అప్పట్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని, పార్టీ విజయానికి సహకరించిన పవన్ కల్యాణ్ ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ.. చంద్రబాబునాయుడు చివరి వరకు కూడా పవన్ కల్యాణ్ ఒత్తిడికి తలొగ్గడానికి మొగ్గినప్పటికీ.. కేశినేని నాని ఒక రకంగా పోరాడి మరీ, సవాళ్లు విసిరి మరీ.. తనకు అభ్యర్థిత్వం దక్కించుకున్నాడు. అప్పట్లో పవన్ కల్యాణ్ పొట్లూరి వి ప్రసాద్ కోసం తెలుగుదేశం టిక్కెట్ అడిగారు.
ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన, ఆర్థికంగా కూడా బలమైన ప్రత్యర్థి కోనేరు ప్రసాద్ ను ఓడించి నాని పార్లమెంటులో అడుగుపెట్టారు. అప్పట్లో ఆయన 75 వేల మెజారిటీతో గెలిచారు.
2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి హవా ప్రబలంగా ఉన్నప్పటికీ.. విజయవాడ ఎంపీసీటు పరిధిలో అనేక ఎమ్మెల్యే స్థానాలను కూడా పార్టీ కోల్పోయినప్పటికీ.. ఎంపీగా మాత్రం కేశినేని నాని గెలిచారు. జగన్ హవాను తట్టుకుని 8700 ఓట్ల మెజారిటీ సాధించారు. అప్పటినుంచి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. రాజకీయంగా నెట్టుకొస్తున్నారు.
తాజాగా ఆయన ఒక రకమైన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పార్టీలోనే ఉంటాను గానీ.. ఎన్నికల్లో మాత్రం దిగను అంటే అది దాదాపు రిటైర్మెంట్ లాంటిదే అని అంతా అంటున్నారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పార్టీని వీడిపోతున్న తరుణంలో.. తెలుగుదేశం అధినేత.. విజయవాడ వంటి కీలక ఎంపీ సీటు కోసం కొత్త వారిని వెతుక్కోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది కరమే.
కొన్ని రోజుల కిందటే.. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పిన కేశినేని నాని ఇలా అప్రకటింత సన్యాసం పుచ్చుకోవడానికి కారణం.. చంద్రబాబు మీద అసంతృప్తే అనే మాట వినిపిస్తోంది. స్థానిక పార్టీ నాయకులు తన మీద విమర్శలు చేస్తున్నా.. పార్టీ అధిష్ఠానం సైలెంట్ గా ఉంటోందని, ఈ వైఖరితో ఆయన కొంతకాలంగా మనస్తాపంగా, పార్టీకి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఆయన కూతురు ఇప్పటికే టాటా ట్రస్ట్ కు వెళ్లిపోయిందని, ఇక ఆయన కూడా రాజకీయంగా సైలెంట్ గా మారడానికి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
.
Discussion about this post