విశాఖ రైల్వేజోనుకు అధికారిక ప్రకటన కూడా జరిగింది. ఒక ఆఫీసు కూడా ఏర్పాటు అయిందన్నారు. ప్రత్యేకంగా అధికారిని కూడా నియమించారనీ అన్నారు. ఇదంతా చాన్నాళ్ల కిందటే వార్తల్లో మెరిసి, మరుగున పడిపోయిన సంగతి. తాజాగా ఏం జరిగింది?
కేంద్ర ప్రభుత్వం తరఫున రైల్వేశాఖ మంత్రి అధికారికంగా పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. దేశంలో ఉన్న 17 రైల్వేజోనులు సరిపోతాయని, కొత్త రైల్వేజోను ప్రారంభించే ప్రతిపాదన, ఆలోచన ఏదీ ప్రభుత్వం చేయడం లేదని వెల్లడించారు. మరి ఇప్పటికే ఏర్పాటు కసరత్తు కూడా మొదలైందని అంటున్న విశాఖ రైల్వే జోను ను ఏ తుంగలో తొక్కినట్టు!
మంత్రిగారి ప్రకటన నిజమైతే.. నరేంద్ర మోడీ పాలనలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం చేయడంలో కేంద్రప్రభుత్వం మరో సరికొత్త వంచనాశిల్పానికి పాల్పడినట్టు లెక్క. కేంద్రం నిస్సిగ్గుగా మాట తప్పినట్టు లెక్క. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయడానికి తాము కంకణబద్ధులమై పనిచేస్తున్నామని నరేంద్రమోడీ మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నట్టు లెక్క.
పోరాటం లేకుండా ఏదీ రాదు..
తెలుగు ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. కేంద్రం మన రాష్ట్రం పట్ల వివక్షపూరిత, అప్రకటిత కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నప్పుడు.. పోరాడడం మినహా మనకు మరొక మార్గాంతరం లేదు. కేంద్రం వారి జేబులోంచి, వారి స్వార్జనను మనకు ముష్టిగా వేయడం లేదనే సంగతి మనందరం గుర్తు పెట్టుకోవాలి. వారు ఇచ్చే ప్రతిరూపాయి.. పన్నులుగా మననుంచి వసూలు చేసిన మొత్తాల్లో ‘పరిమితమైన’ వాటా మాత్రమే. అలాగే ప్రత్యేక హోదా గానీ, విశాఖ రైల్వేజోను గానీ.. ఏ పరిస్థితుల్లోనూ మనకు వారి దయతో సిద్ధించవలసినవి కాదు.
రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆ చట్టం మనకు అందించిన హక్కులు. చట్టంలో ఉన్నవాటిని కూడా సాధించుకోలేకపోతే.. మనం నిర్వీర్యులంగా తతిమ్మా దేశం ఎదుట నవ్వులపాలు అవుతాం. కేంద్రంలోని నరేంద్రమోడీతో సత్సంబంధాలు, సానుకూల ఏర్పాటు కోరుకుంటున్న రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు.. మనం సాధించుకోదగ్గ హక్కులకు తొలి గొడ్డలి పెట్టు! హక్కుల పట్ల ప్రజల్లోని కోరిక, వారిలోని పోరాటాన్ని చంపేస్తున్నది ఈ పార్టీలే.
విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత.. తొలి అయిదేళ్లూ ప్రత్యేకహోదా విషయంలో చాలా పరిణామాలు, నాటకాలు నడిచాయి. తెలుగుదేశం తొలుత దానిని అటకెక్కించి ద్రోహం చేసింది. పదవీకాలం ముగిసిపోయే సమయంలో ధర్మపోరాట దీక్షల పేరిట మొక్కుబడి తంతులను నిర్వహించి అభాసుపాలయింది. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతున్నట్లు కనిపించి, రాజీనామాల పేరిట త్యాగాలకు తెగబడినట్లు తమ నిర్వ్యాపారత్వానికి ఒక రంగు పులిమి.. మొత్తానికి అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక హోదా గురించి తమకు తప్ప మరెవ్వరికీ ఇసుమంత పట్టింపులేదని చాటుకుంది.
తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారు కూడా ఆ హోదా గురించిన ప్రస్తావనను శిథిలం చేసేశారు. ఢిల్లీ యాత్రల సందర్భంలో ప్రెస్ రిలీజ్ లో డిఫాల్ట్ గా ఉండే ఒక బుల్లెట్ పాయింట్ గా తప్ప.. ప్రత్యేక హోదా డిమాండ్ కు ఎలాంటి విలువ లేకుండా చేసేశారు. కేంద్రం ఎదుట సాగిలపడే ధోరణి ఉందనే విమర్శలను మూటగట్టుకున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో మన పార్టీల మధ్య అనైక్యత, చేతగానితనం, ప్రజల్లో కొరవడిన పోరాటస్ఫూర్తి ఇవన్నీ కలిసి.. కేంద్ర ప్రభుత్వం ఎదుట మనల్ని చులకన చేశాయి. అందుకే ఇప్పుడు మరింత ధైర్యంగా, పొగరుగా కొత్త వంచనకు కూడా తెగబడింది. విశాఖ రైల్వేజోను ఆశలు కూడా అడియాసలయ్యేలా ఒక ప్రకటన చేసింది. ఎంపీలు రెండో రోజు కూడా రైల్వేజోన్ అనేదం అయోమయ అవస్థలో ఉన్నదని పార్లమెంటులో చిలక పలుకులు పలుకుతున్నారు.
తర్వాతి దశలో కేంద్రం నెమ్మదిగా ఆ జోనును విస్మరించినా దిక్కులేకుండా పోతుందేమో అనిపించేలా ఉంది. సత్వరమే జోన్ ప్రారంభించాలనే ఒకటిరెండు రాజకీయ, ఆపద్ధర్మ స్వరాలకు కేంద్రం ఎదుట విలువ లేదు.
ఆ స్ఫూర్తితో పోరాడితేనే ఫలితం..
సరిగ్గా ఈ సమయంలోనే ప్రజలు స్పందించాలి. కేంద్రంతో తమ వ్యక్తిగత అవసరాలను ముడిపెట్టుకుని ఊరేగే రాజకీయ పార్టీలతో వల్ల కాదు. ప్రజలే పూనుకోవాలి.
ఈ విషయంలో పంజాబ్ రైతులను చూసినప్పుడు ముచ్చటేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. మూడు వ్యవసాయ చట్టాలు అనేవి యావత్ దేశానికి సంబంధించినవి. కానీ.. యావతదేశం వారి వెంట నిలబడలేదు. అందరూ తమతో కలిసి రావాలని వారు కూడా కోరుకోలేదు. ఏడాది పాటు సుదీర్ఘమైన పోరాటం సాగించారు. మడమ తిప్పని పోరాటం అంటే నిర్వచనం ఏమిటో చూపించారు. కేంద్రంలోని నిరంకుశ శక్తిగా ఎదుగుతున్నారనే ప్రత్యర్థుల విమర్శలకు ఆస్కారం కల్పిస్తున్న మోడీ మెడలు వంచారు. చట్టాలు రద్దు చేయించారు. దేశంలోని అన్నదాతలకు మేలు చేశారు. రద్దు అనంతరం ప్రభుత్వం ఎన్ని సన్నాయి నొక్కులైనా నొక్కవచ్చు గాక.. కానీ వాస్తవం ఏమిటంటే.. తిరుగులేని ప్రజాగ్రహం, వారి పట్టుదల, పోరాటం ముందు.. ఎంత కొమ్ములు తిరిగిన ప్రభుత్వం అయినా.. దిగి రావాల్సిందే.
కళ్ల ముందు ఈ తార్కాణం కనిపిస్తూ ఉండగా కూడా.. మనం మేలుకోకపోతే ఎలాగ? పోరాటం అంటే ఏదో ఒక పార్టీ జెండా కింద సాగే డ్రామా కాదని గుర్తించకపోతే ఎలాగ? పార్టీ జెండాల అవసరం లేకుండా.. జనం కదం కదిపితే.. కేంద్రం ఉక్కిరి బిక్కిరి కావడం మినహా వారికి మరో గత్యంతరం లేదని అర్థం చేసుకోకోపోతే ఎలాగ?
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ప్రజలు కలవాలి. ఇప్పటికిప్పుడు రైల్వేజోను కోసం ప్రజల ఐక్య కార్యాచరణ ఏర్పడాలి. కేంద్రం మళ్లీ తమ పార్లమెంటు ప్రకటనను సరిదిద్దుకుంటూ.. దేశంలో పద్దెనిమిదవ రైల్వేజోనుగా.. వాల్తేరు డివిజన్ తో కూడిన విశాఖ జోన్ ఏర్పడబోతున్నదని ప్రకటించేలా ఒత్తిడి తేవాలి. రాజకీయ పార్టీలు సహకరించినా లేకున్నా.. ఈ పోరాటం సాగాలి. సహకరించే పార్టీలు మాత్రమే.. మొక్కుబడిగా ఒకరోజు పరామర్శ, పాల్గొనడం లా కాకుండా.. తమ పార్టీ జెండా పక్కన పెట్టి.. ఉద్యమ జెండాను మాత్రమే పట్టుకుని పార్టీలు కూడా ఈ పోరాటానికి సహకరించాలి. అలా చేస్తే జోన్ సాధించడం పెద్ద విషయం కాదు. కేవలం గళమెత్తితే సరిపోదు.. కదం తొక్కగలమని కదనం సాగించగలమని చూపించాలి.
రైల్వే జోన్ సాధించడం అనేది చిన్న లక్ష్యం మాత్రమే అని నిర్దేశించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం మెడలు వంచి సాధించాల్సిన అసలు లక్ష్యం ప్రత్యేకహోదా. ఆ దిశగా పోరాటం సాగాలి. పంజాబ్ రైతులు ఈ దేశానికి అందించిన స్ఫూర్తిని వృథా పోనివ్వకూడదు. ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అనే నిత్య చైతన్యదాయక స్ఫూర్తి మంత్రాన్ని మరోసారి మననం చేసుకోవాలి. పోరాడకుండా విశాఖ ఉక్కు కూడా మనకు రాలేదు. ఇవాళ అదే ఉక్కు పరాధీనం అవుతున్నప్పుడు మరో పోరాటం సాగుతోంది. ఇంతకు మించిన స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు సాగాలి.
కళ్లెదుట వ్యవసాయచట్టాల భరతం పట్టిన ప్రజా విజయాలు కనిపిస్తున్నాయి. కేంద్రానికి ఊపిరి ఆడనివ్వని పోరాటం.. మడమ తిప్పని పోరాటం.. సహనంతో కూడిన రాజీ మాయోపాయాలకు లొంగని పోరాటం.. తప్పకుండా విజయం సాధిస్తుంది.
.కృష్ణమోహన్ దాసరి
డాలస్, యూఎస్ఏ

.
Discussion about this post