రాయలసీమ రెడ్డి సామాజిక వర్గీయులే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోటను కుల్చేస్తారని రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ విషయం రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి స్వయంగా చెప్పారని తెలిపారు.
సోమవారం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎం జ్ఞానేంద్ర రెడ్డి ఎర్పాటు చేసిన ఆత్మీయ సభలో అయన పరోక్షంగా ఈ విషయం వెల్లడించారని చెప్పారు. రెడ్లు ఒకరితో ఒకరు కొట్టుకుని తిరిగి చంద్రబాబును గెలిపిస్తారని స్వామి చెప్పడం వెనుక దాగివున్న అర్ధం ఇదేనన్నారు.
నిజానికి రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే రెడ్డి సామాజిక వర్గీయులు జగన్ రెడ్డిని గెలిపించి తప్పుచేసామని గ్రహించారని ఆయన తెలిపారు. తమ లాంటి దూరదృష్టి కలిగిన రెడ్లు ముందుగానే చంద్రబాబుకు అండగా నిలిచామని చెప్పారు.
కడప జిల్లాలో బలమైన వర్గం వున్న మాజీ మంత్రి డీ ఎల్ రవీంద్రా రెడ్డి ఇటీవల జగన్ అరాచకాలపై ధ్వజమెత్తిన విషయం గమనించాలని చెప్పారు. కర్నూలు జిల్లాలో మాజీ సీఎం కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అనంతపురంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి నేతృత్వంలో రెడ్డి సామాజిక వర్గీయులు ఏకం అవుతునన్నారని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అమరనాధ రెడ్డితో పాటు తామంతా జగన్ వ్యతిరేకులను సమీకరిస్తున్నామని తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన అనేక మంది రెడ్డి సామాజిక వర్గీయులు చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు.
ఇదిలా ఉండగా దళితులు, మైనారిటీలు, బీసీ సామాజిక వర్గీయులు జగన్ ను నమ్మి మోసపోయామని వాపోతున్నారని ఆయన బావమరిది బ్రదర్ అనిల్ చెప్పడం గమనార్హం అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడుతామని పేర్కొన్నారని తెలిపారు.
ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే జగన్ రెడ్డికి ఇక రాజకీయ భవిష్యత్తు వుండదని తేలిపోయిందని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
.

Discussion about this post