(వలిపి శ్రీరాములు, ఆదర్శిని ప్రతినిధి)
‘‘శివయ్య సేవ చేయాలనేది నా జీవితాశయం. నిజంగా నా కల నెరవేరింది. ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. శివయ్యకు పాదాక్రాంతుడినై సేవ చేసుకుంటా. ఎవరూ ఊహించని విధంగా ఆలయం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. అనుబంధ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా.’’
‘‘నాకు ఈ పదవి రావాలని శ్రీకాళహస్తి వాసులు ఎంతో మంది కోరుకున్నారు. వారందరి ఆశీస్సులతోనే నాకు శివయ్యకు సేవ చేసుకునే భాగ్యం దక్కింది. వారి నమ్మకం వమ్ము చేయకుండా శ్రీకాళహస్తీశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా. భక్తుల కోసం 100 కాటేజీలు నిర్మించాలని నా కోరిక. అందరి సహకారంతో ప్రస్తుత ‘మండలి’కి ఆలయ చరిత్రలో ప్రత్యేక స్థానం కల్పించడమే నా ఆశయం.’’ అంటున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు. ధర్మకర్తల మండలి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత ‘ఆదర్శిని’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
? ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి దక్కడం ఎలా భావిస్తున్నారు
! నా కల నెరవేరింది. ఇది నా జీవిత ఆశయం. వైసీపీ అధికారంలోకి వచ్చాక ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి నాకు వస్తుందనే నమ్మకం పెరిగింది. శ్రీకాళహస్తిలో ఎక్కువ మంది ఇదే కోరుకున్నారు. వారందరి ఆశీర్వాదం నాకు వరమైంది. వైసీపీ అధిష్టానం… శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ఆశీస్సులతో శివయ్యకు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది.
? ఆలయ అభివృద్ధికి ఎలాంటి సంస్కరణలు చేపడతారు
! శ్రీకాళహస్తి వాసులు పూజల కోసం ప్రధాన ఆలయంతో పాటు.. అనుబంధ ఆలయాలకు ఎక్కువ వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాను. ఇలా చేయడం వలన శ్రీకాళహస్తి వాసుల కోరిక నెరవేర్చినట్లు అవుతుంది. మొదట విడతగా శ్రీప్రసన్న వరదరాజస్వామి ఆలయం అభివృద్ధి పనులకు ఈ నెల 25వ తేదీ నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఆలయ ప్రాంగణంలో రెండు నూతన ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేస్తాం. ఆలయం చుట్టూ 12 అడుగుల ఎత్తుతో ప్రహారీ నిర్మిస్తాం. ఆలయంలోకి ప్రవేశించే రెండు మార్గాల్లో రెండు ఆర్చిలు ఏర్పాటు చేస్తాం. వరదరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణ మండపం తొలగించి… దాని స్థానంలో ఓపెన్ ఆడిటోరియం నిర్మిస్తాం. ఇందులో నిత్యం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇదే తరహాలో మిగిలిన అనుబంధ ఆలయాలనూ అభివృద్ధి చేస్తాం.
? ముక్కంటి ఆలయ మాస్టర్ ప్లాన్ ఏం చేస్తారు
! శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ పనులు ఉగాది పండుగ తరువాత ప్రారంభిస్తాం. భూసేకరణకు సంబంధించి ఇక ఒక వ్యక్తికి పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తామనే నమ్మకం ఉంది. రూ.500 కోట్లతో మాస్టర్ ప్లాన్ పనులు చేయాలని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి భావిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం నుంచి రూ.300 కోట్లు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి రూ.200 కోట్లు తీసుకునే విధంగా చర్చలు జరుగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ పనులు పూర్తయిన తరువాత టీటీడీ నిధులు విడతల వారీగా మళ్లీ వారికి చెల్లిస్తాం. రూ.300 కోట్లు మాత్రం ప్రభుత్వం (ముక్కంటి ఆలయం) భరించాలని కోరుతున్నాం. ఇందుకు ప్రభుత్వం, టీటీడీ సానుకూలంగా స్పందిస్తాయని భావిస్తున్నాను.
? శివం – శివం పనులు ఎంత వరకు వచ్చాయి
! తొట్టంబేడు మండలంలోని అర్ధనారీశ్వర ఆలయం నుంచి శ్రీకాళహస్తి పట్టణం సన్నిధివీధిలో గల జలవినాయక స్వామి ఆలయం వరకు (శివం –శివం) రోడ్డు నిర్మిస్తాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.16కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ పనులు వీలైనంత త్వరగా ప్రారంభిస్తాం. భక్తకన్నప్ప కొండపై ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలను కూడా ఉగాది తరువాత ఆవిష్కరిస్తాం.
? ముక్కంటి ఆలయంలో దళారీ వ్యవస్థను అరికడతారా
! ముక్కంటి ఆలయంలో దళారీ వ్యవస్థను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నేను బాధ్యతలు తీసుకున్న వెంటనే దళారీ వ్యవస్థపై నిఘా ఉంచాం. ఇప్పటికే 30శాతం వరకు దళారులను అరికట్టాం. రాబోయే కాలంలో ఆలయంలో దళారీ వ్యవస్థ లేకుండా చేస్తాం. ఆలయ అధికారులకు కూడా ఇదే చెప్పా. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. దళారీ వ్యవస్థను అరికడితే సామాన్య భక్తులకు సులభ దర్శనం జరుగుతుంది.
? గిరి ప్రదక్షిణ దారి మెరుగు పరుస్తారా
! ముక్కంటి భక్తులు కైలాస గిరి ప్రదక్షిణ ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే కైలాస గిరులు చుట్టూ సిమెంటు రోడ్డు నిర్మిస్తున్నాం. ఈ దారి వెంబడి సుమారు 15వేల మొక్కలు నాటాలన్నదే నా కోరిక. ఇందుకు దాతల సహకారం తీసుకుంటాం. ఒక్కో దాత 100మొక్కలు, మెష్ ఇస్తే.. వాటికి నీరు పోసి సంరక్షించుకునే బాధ్యత ఆలయం తీసుకుంటుంది. గిరి ప్రదక్షిణ రోడ్డు వెంబడి మొక్కలు పెంచడం వలన భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడెతుంది. భక్తులకు సౌకర్యంగా కూడా ఉంటుంది. అదేవిధంగా భరద్వాజ తీర్థంలో కూడా మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
? విరాళాలపై దృష్టి సారిస్తారా
! శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఇటీవల కాలంలో విరాళాలు బాగా తగ్గాయి. ఇందుకు గల కారణాలను అన్వేషించి.. భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. విరాళాలు ఇవ్వాలని దాతలకు మనసులో ఉన్నప్పటికీ.. అది ఎవరికి ఇవ్వాలో తెలియక మిన్నకుండి పోతున్నారు. కొంతమంది భక్తులు ఈ సమస్యను నా దృష్టికి కూడా తీసుకువచ్చారు. ఇకపై అలా జరగకుండా విరాళాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. విరాళాలు వచ్చినపుడే ఆలయం అభివృద్ధి చెందుతుంది. విరాళాల ద్వారా అన్నదానం, గోశాల డిపాజిట్లు కూడా పెంచుతాం. గోశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాం.
? భక్తులకు ఎలాంటి వసతులు కల్పిస్తారు
! శ్రీకాళహస్తి క్షేత్రం ప్రపంచ ఖ్యాతి గాంచింది. శివ, పార్వతుల దర్శనం కోసం దేశ, విదేశాలకు చెందిన భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం 100 కాటీజీలు నిర్మించాలన్నదే నా కోరిక. ఇందుకు దాతల సహకారం తీసుకుంటాం. కాటేజీలు నిర్మించడం వలన సామాన్య భక్తులకు వసతి ఏర్పాటు చేయవచ్చు. అంతేగాకుండా కాటేజీల ద్వారా కొంతమందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నందున కాటేజీలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగ పడతాయి.
? సామాన్య భక్తులకు మీరు అందించే సేవలు
! శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలన్నదే నా ఆశయం. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తికి వస్తుంటారు. అలాంటి వారికి సులభ దర్శనం చేయించాలి. అపుడే భక్తులు తృప్తి చెందుతారు. దళారీ వ్యవస్థ కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. ఇకపై ఆ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులకు ఇచ్చే ఉచిత ప్రసాదం కూడా పెంచుతాం. భక్తులకు మెరుగైన సేవలు అందించి ఆలయం మరింత అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటాం.
.

Discussion about this post