శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ నేతృత్వంలో రాష్ట్రంలో 1,072 ఆలయాల నిర్మాణానికి టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి ఆమోదం తెలిపింది. త్వరలో భారీ ఎత్తున కల్యాణమస్తు సామూహిక వివాహాలు, దేశవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని తీర్మానించింది.
తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం సాయంత్రం టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది.
రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టి, బిసి, మత్స్యకార గ్రామాల్లో ఒక్కో ఆలయం రూ.10 లక్షల వ్యయంతో ఏడాదిలోపు 1,072 ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని తీర్మానించారు. ప్రతిమాసం దేశంలోని ప్రధాన కేంద్రాల్లో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 23న కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్లోను, మే 8న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలోను స్వామివారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించారు.
అలాగే, మే నెలలో ఢిల్లీలోను, జూన్లో హైదరాబాద్లోను, జూన్ 23 నుంచి జులై 4 వరకు అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సమాయత్తం కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గోదావరి జిల్లాల్లో కూడా త్వరలో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడినందువల్ల సామూహిక వివాహాల నిర్వహణ కోసం పండిత మండలిని ఏర్పాటుచేశారు. మండలి నిర్ణయించే పవిత్ర ముహూర్తాల్లో జిల్లా యంత్రాంగాల సహకారంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు.
తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో ప్రతినెలా ఒక యజ్ఞం నిర్వహించాలని, మే నెలలో తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని తీర్మానించారు. ఎస్సి, ఎస్టి, మత్స్యకార గ్రామాల్లో నిర్మించిన ఆలయాల్లో అర్చకులుగా పనిచేసేందుకు ముందుకొచ్చే వారికి దేవాదాయ శాఖ సహకారంతో తిరుపతిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
గుడికో గోమాత కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు దేశంలోని 141 ఆలయాలకు ఉచితంగా గోవు, దూడ అందించారని, ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని టిటిడి, దేవాదాయ శాఖ భూముల్లో గో ఆధారిత వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని, వారు పండించిన ఉత్పత్తులను తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్డిపిపి విభాగానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి అల్లూరి మల్లీశ్వరి వర్చువల్గాను, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి, ఏఈవో శ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు.
.

Discussion about this post