ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడంతో పాటు ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ద్వారా మరింత మెరుగ్గా జీవితాన్ని సాగించవచ్చని టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి తెలిపారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టిటిడి ఉద్యోగులకు జీవనశైలి రుగ్మతలు, వ్యాధులు అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగిన అవగాహన సదస్సు సోమవారం ముగిసింది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈఓ మాట్లాడుతూ అన్నమయ్య ఒక సంకీర్తనలో పేర్కొన్న విధంగా పుట్టడం, మరణించడం ఖాయమని, కావున ఉన్న జీవితాన్ని శ్రీవారిని స్మరించుకుంటూ ఇతరులకు సహాయపడుతూ గడపాలని కోరారు. టిటిడి యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఇలాంటి అవగాహన సదస్సులు భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం దాదాపు రెండు వేల మంది పురుష ఉద్యోగులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని, మిగిలిన ఉద్యోగులకు త్వరలో మరో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
ఇంత గొప్ప కార్యక్రమానికి అవకాశం కల్పించిన టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మూడు రోజులు పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతికి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు, సహకరించిన సీనియర్ అధికారులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు ఇతర అన్ని విభాగాల వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
టాటా క్యాన్సర్ ఆసుపత్రి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మన శరీరంలో ఒక క్రమ పద్ధతిలో ఉన్న కణాల్లో మార్పులు జరిగి అస్తవ్యస్తంగా మారడాన్నే క్యాన్సర్ అంటారని చెప్పారు. పురుషుల్లో ప్రధానంగా నోరు, గొంతు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం, మూత్రాశయం, కిడ్నీలు, ప్రోస్టేట్, మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఆల్కహాల్, పొగాకుకు దూరంగా ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా క్యాన్సర్ ను దాదాపు దూరం చేయవచ్చని చెప్పారు.
శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే అవయవ దానం పునర్జన్మనిస్తుందని చెప్పారు. ఆరోగ్యవంతులుగా ఉండి ఏదైనా కారణంగా బ్రెయిన్ డెడ్ అయినవారు గుండె, కిడ్నీలు, కార్నియా దానం చేయవచ్చన్నారు. ఇటీవల తమ ఆసుపత్రిలో 15 ఏళ్ల బాలుడికి బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ గుండెను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా అమర్చినట్టు తెలిపారు. అవయవ దానం పైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. దీనిపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. ఏపీ జీవన్ దాన్ అనే ప్రభుత్వ సంస్థ ద్వారా అవయవదానానికి నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో ఒక సంవత్సరం వ్యవధిలోనే వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లను నిర్వహించామని తెలిపారు. నిరుపేద కుటుంబాల వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నామని, ఈ ఆస్పత్రి గురించిన సమాచారాన్ని అందరికీ తెలియజేయాలని కోరారు.
తిరుపతికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కృష్ణప్రశాంతి మాట్లాడుతూ మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లతో మంచి ఆరోగ్యం అలవడుతుందని, తద్వారా మంచి కుటుంబం, మంచి సమాజం ఏర్పడతాయని చెప్పారు. వ్యాధులు వచ్చినంత మాత్రాన భయపడిపోవాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉంటూ మంచి చికిత్స తీసుకోవడం ద్వారా నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చని తెలియజేశారు.
తిరుపతికి చెందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ శ్రీమతి దీప్తి మాట్లాడుతూ 80 శాతం ఆరోగ్య సమస్యలకు ఒత్తిడే ప్రధాన కారణమని, మానసిక ప్రశాంతత అత్యంత ముఖ్యమని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ముద్ర గల ఆహార ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలని సూచించారు. మొబైల్స్ ను వీలైనంతగా దూరంగా ఉంచి, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చన్నారు.
ఆకట్టుకున్న డా.తిరుచ్చి శంకరన్ మృదంగ విన్యాసం
ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రఖ్యాత మృదంగ వాద్య విద్వాంసులు, కెనడాలోని టొరెంటోలో గల యార్క్ విశ్వవిద్యాలయం ఆచార్యులు డా.తిరుచ్చి శంకరన్(81) మృదంగ లయ విన్యాసం టిటిడి ఉద్యోగులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శంకరన్ మాట్లాడుతూ మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి మ్యూజిక్ థెరపీ ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. లయ విన్యాసాన్ని వినడం ద్వారా మతిమరుపు దూరం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, ఇఇలు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ నరసింహమూర్తి, శ్రీ శ్రీహరి, డెప్యూటీ ఈఓ శ్రీ గోవిందరాజన్, డిఈఓ శ్రీ భాస్కర్ రెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్, 1500 మందికి పైగా పురుష ఉద్యోగులు పాల్గొన్నారు.
.

Discussion about this post