తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులు సీఐ అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు 26మంది తెలుగుదేశం పార్టీ నేతలపై శనివారం రాత్రి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని చూపారు. ఇక ఏ2గా రంగినేని చెంచయ్యనాయుడు, ఏ3గా రావిళ్ల మునిరాజా నాయుడు, ఏ4గా కాసరం రమేష్, ఏ5గా చక్రాల ఉష, ఏ6గా సుబ్బయ్య, ఏ7గా కుమారి, ఏ8గా రాజేష్, ఏ9గా రవీంద్రరెడ్డి, ఏ10గా బషీర్ తో పాటు శ్రీనివాసులు, మిన్నల్ రవి, సన్నీ డియోల్, కోబాక లక్ష్మణ్, బాలాజీ రెడ్డి, కంఠా రమేష్, బాలాజీ, ఎ:ఎంవాడ గోపి, వజ్రం కిషోర్, గోపి, చుక్కల రమేష్, జనసేన నేత కొట్టే సాయి, బాబు నాయుడు, చెంచయ్యనాయుడు, శ్రీనివాసులు నాయుడు, క్రిష్ణమనాయుడుపై ఈ కేసు నమోదు చేశారు.
కొస మెరుపు ఏమిటంటే ఇందులో కొంతమంది ఎస్సీ, ఎస్టీ నేతలపై కూడా అట్రాసిటీ కేసు పెట్టడం. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు ఇటీవల జగనాసుర వధ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరులో కూడా ఈ నిరసన కార్యక్రమం చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి గ్రామీణ సీఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో కమ్మకొత్తూరుకు వెళ్లి నిరసన తెలిపిన గ్రామీణులపై కేసులు పెడతామంటూ బెదిరించారు. ఇదే గ్రామంలో చెంచయ్యనాయుడు అనే వృద్ధుని పోలీసులు చితక బాదారు. ఇలా చేయడంతో ఆయన పోలీసులను నిలదీశారు. తనపై పోలీసులు దాడి చేసిన విషయాన్ని చెంచయ్యనాయుడు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఐ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. చెంచయ్య నాయుడును ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ఇందుకు ఆగ్రహించిన సీఐ అజయ్ కుమార్ టీడీపీ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు.
దీంతో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ శ్రేణులతో కలసి శనివారం శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. సీఐ అజయ్ కుమార్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా నేపథ్యంలో తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి జోక్యం చేసుకున్నారు. సీఐ అజయ్ కుమార్ తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీ హామీతో టీడీపీ శ్రేణులు ధర్నా విరమించారు. అయితే పోలీసులు సీఐ అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, విధులకు ఆటంకం కలిగించారని తదితర సెక్షన్ల కింద శ్రీకాళహస్తి రెండవ పోలీసు స్టేషన్ సీఐ మల్లిఖార్జున కేసు నమోదు చేశారు.
ఒకేసారి 26మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అన్యాయంగా కమ్మకొత్తూరు వాసులను చితక బాదిన సీఐ అజయ్ కుమార్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి… న్యాయం కోసం శాంతియుతంగా నిరసస తెలిపిన తమపై అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.
.

Discussion about this post