భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు చేపట్టిన రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కు లభిస్తున్న ప్రజా స్పందన చూసిన అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి.
కేసీఆర్ ప్ర భుత్వ పాలనలో లోపాలు ఎత్తిచూపుతూ, అవినీతి-అక్రమాలను బట్టబయలు చేస్తూ ఉత్సాహంగా దూసుకుపోతున్న కమల దళాల ధాటికి బెంబేలెత్తిన అధికారపార్టీ ఏప్రిల్ 27 న వ్యవస్థాపక దినోత్సవం పేరిట హంగామాకు తెరలేపింది. ఈ సందర్భంగా- 21 ప్రశ్నలను సమాధానాలివ్వండని సంజయ్ గారు విడుదల చేసిన ప్రకటనకు సమాధానమివ్వకుండా ‘ కేసీఆర్ పాలన అహో.. ఓహో’ అంటూ తీర్మానాల పేరిట పచ్చి అబద్ధాలు ప్రచారం చేసింది.
ప్రతి తీర్మానంలో కేంద్ర ప్రభుత్వంపై ఏదో ఒక విమర్శతో బురదజల్లడానికి తెరాస ఎక్కడలేని ఉత్సాహం కనబరిచింది. అననుకూల పరిస్థితులు ఎదురయినప్పుడు ఇతరులపై బండలు వేసి బతకడం కేసీఆర్ మార్క్ రాజకీయమే కదా! మూడోవారం యాత్ర హైలెట్ ఏమిటంటే, ‘బంగారు తెలంగాణ’ లో వలసలు ఆగిపోయాయన్న ప్రభుత్వ ప్రచార పటాటోపాన్ని సంజయ్ గారు పొట్ట చేతబట్టుకుని స్థానికులు ముంబయి వెళ్తున్న బస్సు సాక్షిగా తుస్సుమనిపించడం.
పార్టీ ఎం.ఎల్.ఏ లు రాజా సింగ్, రఘునందన్ రావు గార్లు పాల్గొని ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, దమననీతిని దుయ్యబట్టారు. అద్భుతమైన ప్రజాస్పందనే కొండంత బలంగా సంజయ్ గారు మండే ఎండను లెక్కచేయకుండా, విశ్రాంతి అవసరమన్న వైద్యుల సూచన కాదని దూసుకుపోతున్నారు. యాత్ర మూడో వారం ముఖ్యాంశాలు సమాహారం ఇదీ:
15వ రోజు (గురువారం, ఏప్రిల్ 28)
మక్తల్ నియోజక వర్గంలోని ఓబులాపురం వద్ద మూడో వారం మొదటిరోజు యాత్ర ప్రారంభమైంది. అమీన్పూర్ మీదుగా కొనసాగిన యాత్రలో ఏ ఊరికెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలికి అశీర్వదించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పాలనపై పోరాటానికి తాము సిద్ధమని ప్రకటిస్తూ మద్దతు పలికారు. సంజయ్ గారు మక్తల్ లోని నేరేడు పీఠం శ్రీ శ్రీ పంచసిద్ది లింగేశ్వర స్వామి ఆశీర్వాదం పొందారు. ఓబులాపూర్ దళితవాడలో వృద్దురాలితో అయన మాట్లాడారు.
పాద యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సంజయ్ గారు దీనికి ఒకరోజు ముందు హైదరాబాద్ లో అట్టహాసంగా తెరాస నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవం గురించి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ద్రోహులతో తెరాస ప్లీనరీ జరుపుకుందని ధ్వజమెత్తారు. ఇంత కాలం ప్రజలకు ఏమి చేశాం, ఏమి సాధించాం, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు పరిచామనే అంశాలు టీఆర్ ఎస్ ప్లీనరీలో చర్చకే రాలేదన్నారు. దీన్నిబట్టి చూస్తే ఆ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని తేలిపోయిందన్నారు. బీజేపీ పై విమర్శలు చేయడానికే ప్లీనరీ పెట్టుకున్నట్లుందన్నారు.
2014లో దేశం ఆర్దిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ప్రపంచం ముందు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు కృషి చేస్తుంటే గిట్టక లేనిపోని ఆరోణలు చేస్తున్నారని వివరించారు. పాలమూరులో వలసలు నిలిచిపోయాయన్న కేసీఆర్ ప్రభుత్వానికి నారాయణపేటకు వస్తే వలసలు చూపిస్తానని సవాల్ విసిరారు. తెరాస అసమర్ధ పాలనతో రాష్ట్రం 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకూరుకుపోయిందన్నారు.
16 రోజు (శుక్రవారం, ఏప్రిల్ 29)
నారాయణపేట శాసనసభ నియోజక వర్గంలోని పగిడిమర్రి గ్రామం నుండి పదహారో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు, పార్టీ శాసన సభా పక్ష నేత రాజాసింగ్ గారు తదితరులు ఇందులో పాల్గొన్నారు. సాయంత్రం నారాయణపేట కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ-పాలమూరు పచ్చబడిందనే తెరాస నేతల ప్రచారంలో వాస్తవం లేదని సంజయ్ గారు అన్నారు. అలాగే, పాలమూరులో వలసలు ఆగలేదన్నారు.
ప్రజాసంగ్రామ యాత్ర 3వవారం దృశ్యాలు ఈ వీడియోలో చూడండి
పాదయాత్ర లంచ్ శిబిరం వద్దకు రాగానే అక్కడి నుండి ముంబై వెళుతున్న బస్సును బండి సంజయ్ గమనించారు. ఆ బస్సెక్కి అందులోని ప్రయాణీకులను ఎక్కడికి వెళుతున్నారంటూ ఆరా తీశారు. వారంతా తాము ఉపాధి కోసం ముంబై వెళుతున్నామని జవాబిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ….పాలమూరు ఎక్కడ పచ్చబడిందో చెప్పాలని పాలకులను డిమాండ్ చేశారు. వలసలను ఎందుకు ఆపలేక పోతున్నారని ప్రశ్నించారు. ప్రచార ఆర్బాటం తప్ప ప్రభుత్వం చేసిందేమి లేదని తన పాదయాత్రలో గుర్తించానన్నారు. సీఎం కేసీఆర్ మానవత్వం లేని మృగం అని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగు నీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా 69 జీవోను అమలు చేసి నారాయణపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో పంచులు విసిరి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఒక మత వర్గం కొమ్ముకాయడం పై ఉన్న శ్రద్ధ పాలనపై లేదన్నారు.
17వ రోజు (శనివారం, ఏప్రిల్ 30)
బివండి కాలనీలో బీజేపీ జెండాను ఆవిష్కరించడంతో పదిహేడో రోజు పాద యాత్ర ప్రారంభమైంది. సింగారం గేటు మీదుగా యాత్ర సాగిపోయింది. జాజపూర్ గ్రామంలో సంజయ్ గారు చేనేత కార్మికులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గడ్డమీది అప్పంపల్లి మీదుగా సాయంత్రం చిన్న జెట్రం గ్రామానికి యాత్ర చేరుకుంది. చిన్న జెట్రం గ్రామంలో బండి సంజయ్ టీ కొట్టు వద్దకు వెళ్లగానే వచ్చిన రైతులతో కాసేపు ‘ఛాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతు రుణమాఫీ కాలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జాడే లేదని, తాగునీరు, సాగునీరు ఊసే ఎరుగమని, కాలువ నిర్మాణం జరగలేదని, ఆసుపత్రి లేదని రైతులు ఏకరవు పెట్టారు.
69 జీవోను అమలు చేసి తమ ప్రాంతానికి సాగునీరిచ్చి ఆదుకోవాలని కోరారు. దీంతోపాటు దారి పొడవునా ఎక్కడ రైతులు కన్పించినా 69 జీవో ను అమలు చేస్తే నారాయణపేటతోపాటు మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకూ సాగు నీరందుతుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల కష్టాలు తీరుతాయని సంజయ్ గారు హామీ ఇచ్చారు.
“కేసీఆర్, ఇక నీ పప్పులు ఉడకవ్. పేదలకు నీ మోసాలన్నీ అర్ధమైనయ్. నీపై తిరగబడేందుకు సిద్దంగా ఉన్నరు,” అని ఆయన అన్నారు. బీజేపీకి అధికారమిస్తే చేనేత క్లస్టర్ ను ఏర్పాటు చేస్తామని జాజాపూర్ ‘చేనేత సదస్సు’లో సంజయ్ గారు అన్నారు.
18వ రోజు (ఆదివారం, మే 1)
కొల్లంపల్లి గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణతో 18వ రోజు యాత్ర ప్రారంభమైంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి. వివేక్ గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు పాదయాత్రలో పాల్గొన్నారు.
కొల్లంపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశారని వివేక్ గారు ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబమైందన్నారు. “ప్రజలకు ఇండ్లు లేవు, విద్య లేదు, వైద్యం అందడం లేదు. ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ అమలు చేయడం లేదు,” అని అయన అన్నారు.
కొల్లంపల్లిలోసంజయ్ గారిని బీసీ మేదరి మహేంద్ర సంఘం నాయకులు కలుసుకొని తమ సమస్యలను విన్నవించారు. బీసీ మేదరి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు వినతి పత్రం అందచేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో మేదరి సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ మేదరి కులస్థులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని సంజయ్ గారు హామీ ఇచ్చారు.
పాదయాత్రలో పాల్గొన్న నాయకులకు దారి పొడవునా వ్యవసాయ కార్మికులు, మహిళలు, బస్సు ప్రయాణికులు కరచలనం చేస్తూ ఉత్సాహ పరిచారు. అన్ని వర్గాలను ఆదుకొనే విధంగా బీజేపీ కార్యాచరణ ఉంటుందని సంజయ్ గారు హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక కేసీఆర్ పాలనకు ప్రజలు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం బీజేపీకి ఇవ్వాలని కోరారు.
ధన్వాడలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- “టీఆర్ఎస్ నేతలారా.. మీ ప్రభుత్వం ఉండేది ఇక కొద్దిరోజులే,” అని సంజయ్ గారు అన్నారు. అధికారంలోకి రాగానే కోయిల్ సాగర్ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదనీ, టీఆర్ఎస్ నేతలు గ్రామాల్లోకి వస్తే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు.
అగ్రవర్ణ పేదలకు కూడా ఈబీసీ రిజర్వేషన్లు 10 శాతం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని డాక్టర్ లక్ష్మణ్ గారు అన్నారు. కేసీఆర్ పాలనలో కులవృత్తులు దెబ్బతిన్నాయని, చేనేత కార్మికుల మగ్గాలు మూగబోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన కింద అద్భుత పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ముద్ర లోన్లను ఇస్తున్న ఘనత కేంద్రానిదేనని గుర్తు చేశారు. పేదల రాజ్యం రావాలంటే బిజెపి రావాలి అని అరుణ గారు అన్నారు.
19వ రోజు (సోమవారం, మే 2)
రామకిష్టయ్య పల్లి గ్రామం నుంచి 19వ రోజు యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్ గారు, నందీశ్వర్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నాం వరకు పాద యాత్ర కిష్టాపూర్ సమీపానికి చేరుకున్నాక గ్రామస్తులను ఉద్దేశించి సంజయ్ గారు మాట్లాడారు.
పాదయాత్ర గోతురు, చిన్న రాజ్మూర్ , అజిలాపూర్ స్టేజీ గ్రామాల మీదుగా రాత్రికి అజిలాపూర్ గ్రామానికి చేరుకుంది. సాయంత్రం జరిగిన సభలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఇన్ఛార్జి నాగూరావు నామోజీ గారు, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు పాల్గొన్నారు.
ధన్వాడ మండలం మణిపూర్ తండాలో సంజయ్ గారిని దాదాపు 300 మంది ఉపాధిహామీ కూలీలు కలుసుకుని తమ సమస్యలను వివరించారు. ఉపాధి కూలీల సొమ్ము తినే వాళ్ల లెక్క తేలుస్తామని అయన హెచ్చరించారు. ఉపాధి నిధులను ఆపుతోంది కేసీఆరే అనీ, అదనంగా 50 రోజుల ఉపాధిహామీ పనిదినాలు పెంచాలని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఉపాధి కూలీ బకాయిలన్నీ ఇప్పిస్తానన్నారు. గోటూర్ గ్రామంలో జరిగిన బహిరంగ సభతో నారాయణపేట నియోజక వర్గంలో పాదయాత్ర ముగిసింది. దేవకద్ర నియోజక వర్గంలోని చిన రాజ్మూర్ గ్రామంలో పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు గారు, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్ గారు, నందీశ్వర్ గౌడ్ గారు , బొడిగే శోభ గారు తో కలిసి సంజయ్ గారు పాదయాత్ర సాగించారు. నియోజక వర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎదురొచ్చి వారికి కాగడాలతో అపూర్వ స్వాగతం పలికారు. స్దానికులు బోనాలతో, మంగళ హారతులతో, బంజారా నృత్యాలతో స్వాగతం పలికారు.
20వ రోజు (మంగళవారం, మే 3)
రాజమూరు చౌరస్తాలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో 20వ రోజు యాత్ర ప్రారంభమైంది. నాగారం చౌరస్తా వద్ద గిరిజనులతో సంజయ్ గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బలుసుపల్లి వద్ద బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత బలుసుపల్లి మీదుగా పాద యాత్ర దేవరకద్ర పట్టణానికి చేరుకుంది. స్ధానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ గారితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ గారు తదితరులు మాట్లాడారు.
నాగారం స్టేజ్ వద్ద ధాన్యం కుప్పలను నాయకులు పరిశీలించారు. కల్లాల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు రైతులు మిల్లర్లకు క్వింటాలుకు 1300 రూపాయలకే విక్రయించుకున్నారని వాపోయారు. ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇస్తూ- కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే.. రైతులు పండించిన వడ్లన్నీ కొనేలా చేస్తామని సంజయ్ గారు హామీ ఇచ్చారు. ఇకపై ఎవరూ వడ్లను దళారులకు, మిల్లర్లకు తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని సూచించారు.
పాలమూరు నుంచి వలసలు లేవని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సంజయ్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. పాలమూరు నుంచి ముంబాయి, సూరత్, భీవండిలకు వలస వెళుతున్నారని వివరించారు. గ్రూప్-1 పరీక్షలను ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. గ్రామాల్లో నర్సరీలు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, రోడ్లు, తదితర అభివృద్ది పనులన్నీ కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని వివరించారు.
ఎమ్మెల్యే రఘునందన రావు మాట్లాడుతూ- గత 20 రోజులుగా పాలమూరు జిల్లాలో మండుటెండలో కూడా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేందుకు పక్కా ప్రణాళికతో, మంచి లక్ష్యంతో పాదయాత్ర జరుగుతున్నదని, ఇందులో ప్రజలనుంచి వచ్చే సమస్యలను తెలుసుకుని, వాటినే మ్యానిఫెస్టోలో పెట్టాలని పార్టీ భావిస్తున్నదని చెప్పారు.
21వ రోజు (బుధవారం, మే 4)
పాదయాత్ర 21 వ రోజున మన్యం కొండకు చేరుకున్న వెంటనే సంజయ్ గారు వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ లను దర్శించుకున్నారు. గ్రామ గ్రామాన మేళ తాళాలు, డప్పు వాయిద్యలు, యువత చిందులతో ఉత్సాహంగా యాత్ర సాగిపోయింది. కోడూరు చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తూ- జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కెసిఆర్ మాటలు మాటలుగానే ఉండిపోయాయని దుయ్యబట్టారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని అన్నారు.
“ఆర్దీఎస్ సమస్య అలానే ఉంది. దళితులకు 3 ఎకరాలు లేవు, దళితబంధు లేనే లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక పోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా రైతాంగం నష్టపోయింది. రైతులను రాజులను చేయాలన్న ఉద్దేశంతో మోదీ మద్దతు ధర పెంచుతూ వస్తున్నారు. దానికి భిన్నంగా దేశంలో ఎక్కడా లేనటువంటి సమస్యను తెలంగాణలో కేసీఆర్ సృష్టిస్తున్నాడు” అని సంజయ్ గారు ధ్వజమెత్తారు.
“పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమంటే తగ్గించడు. ఎక్కడ డీజిల్ ధర తక్కువ ఉంటే.. అక్కడే తీసుకోమని ఆర్టీసీ కే ఆదేశాలు ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయని ఆర్టిసి ఇచ్చిన లేఖతో స్పష్టమైంది. ఆర్టీసీ కార్మికులకు హ్యాట్సాఫ్… మీరు వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేసినందుకు,” అన్నారాయన. రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెట్టి కలిసి రైతన్నలను ఆదుకుందామని అన్నారు.
“క్యాబినెట్ లో ఎక్కడ ఉద్యమకారులు ఉన్నారు? కేసీఆర్ కు ఎడమ, కుడి వైపు బల్లాలు, బరిసెలు పట్టుకుని తంతం అని అప్పట్లో అన్నవాళ్లే ఉన్నారు. నిజమైన ఉద్యమకారులు తెరమరుగయ్యారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీని చంకలో వేసుకుని తిరుగుతాడు కేసీఆర్. కేసీఆర్ తీరుతో ఉద్యమకారులు ఆత్మలు ఘోషిస్తున్నాయి. తెలంగాణ తల్లిని బంధవిముక్తిరాలిని చేస్తాం… ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నా, నీతి నిజాయితీతో కూడిన పాలన అందించేది బీజేపీనే. తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, టిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పాలన అందిస్తాం,” అని అన్నారు.
22 వ రోజు (మే 5) పాదయాత్ర లో భాగంగా మహబూబ్ నగర్ లో జరిగే బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా పాల్గొనబోతుండడంతో నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపించింది.
.. పోరెడ్డి కిషోర్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ

.

Discussion about this post