మహానటి సినిమా వచ్చాకా వైజయంతి బ్యానర్ మళ్ళీ అందరి దృష్టిలోకి వచ్చింది. కొత్త తరహా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు అశ్విని దత్ గారి అమ్మాయిలు. దర్శకుడు హను రాఘవపూడి విభిన్నమైన సినిమాతో వచ్చాడు.
కథాపరంగా సీతారామం చాలా రొటీన్ సబ్జెక్ట్. రామం అనే మిలిటరీ లో పనిచేసే వ్యక్తికి, నూర్జహాన్ అనే రాజకుమారి కి మధ్య ప్రేమ కథ ఇది. బోర్డర్లో మొదలై, పాకిస్తాన్, లండన్ లు వెళ్ళి, హైదరాబాద్ చేరుకుంటుంది. చివరకు దేశ భక్తి, జీహాదీ తీవ్రవాదం, చరిత్ర, హిందూ – ముస్లిం సంఘర్షణ.. ఇలా చాలా అంశాలు కథలో చేర్చారు. విషాదం గా ముగిసే ఈ సినిమాలో పాత్రలు చాలా ఎక్కువ. ఫ్లాష్ బ్యాక్ లు ఎక్కువ. మణిరత్నం సినిమాలు చూసి ప్రభావితం అయిన చాలా మంది దర్శకులు వచ్చారు. అందులో హను రాఘవపూడి ఒకరు.
సినిమాను 1960లలో మొదలు పెట్టారు. ఇరవై ఏళ్ల తర్వాత ముగించారు. నిజానికి జీహాదీ తీవ్రవాదం అప్పటికి ఇంకా మొదలు కాలేదు. మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి సమయంలో జరిగిన కథ. నిజానికి అప్పటికి కోవర్ట్ ఆపరేషన్స్ మొదలు కాలేదు. పాకిస్తాన్ వైపు నుంచి కథ చెప్పే ప్రయత్నం వల్ల కన్ఫ్యూజన్ వచ్చింది. ఇంకో పక్క హీరో అస్తమానూ తను అనాధ అనడం సినిమా మూడ్ను పాడుచేసింది.
సినిమా మొదటి అరగంటలో కథను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు బోరు కొట్టిస్తాయి. అయితే దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని కళాత్మకంగా తీర్చి దిద్దాడు. మంచి నటులను ఎన్నుకున్నాడు. రామం, సీత మధ్య ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. వెన్నెల కిషోర్ కామెడీ బావుంది. కానీ సినిమా నిడివి ఎక్కువ. చాలా శ్రద్ధగా తీశారు. అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు.
ఫోటోగ్రాఫర్ వినోద్ విజువల్స్ గొప్పగా వున్నాయి. విశాల్ సంగీతం బావుంది. అన్ని డిపార్ట్మెంట్ లు బాగా పనిచేసాయి. చాలా ఖర్చు పెట్టారు.
నటీనటుల విషయానికి వస్తే అందరూ బాగా నటించారు. దుల్కర్ సల్మాన్, మృణాళిని టాకుర్ చాలా బాగా నటించారు. సచిన్ కెడ్కర్, ప్రకాష్ రాజ్, సుమంత్, రస్మిక, వెన్నెల కిషోర్ , తరుణ్ భాస్కర్ అందరూ బాగా నటించారు.
కథ లో సంక్లిష్టత ఎక్కువ. మణిరత్నం లా సింపుల్గా, బలంగా కథ రాసుకోవడం కనపడదు ఈ సినిమాలో. ఫ్లాష్ బ్యాక్ లు ఎక్కువగా వుండటం వల్ల మెలోడ్రామా పండలేదు. పాత్రలు ఎక్కువగా వుండటం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ప్రేమ, త్యాగం అనే మేజిక్ లు , మంచి నటులు ఉన్నా, భారీగా ఖర్చు పెట్టినా, లక్ష్యానికి చేరకుండా ఆగిపోయింది !
.. రాజేంద్రప్రసాద్ రెడ్డి

.

Discussion about this post