శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ ఆగడాలను అడ్డుకుని… తెలుగుదేశం పార్టీ బలపరిచే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కంచర్ల శ్రీకాంత్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎల్ సీ రమణారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుందామని ఆ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపు నిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో గురువారం మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న శాసనమండలి ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడాలని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు.
స్థానిక ఎన్నికల్లో ఎలా రౌడీయిజం చేశారో… అదే తరహాలో రౌడీయిజం చేసి శాసనమండలిలో వైసీపీ బలపరిచే అభ్యర్థులకు ఓట్లు వేసుకోవడానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆరోపించారు. తమకు తాజాగా అందిన సమాచారం ప్రకారం పట్టభద్రులు, ఉపాధ్యాయులకు ఓటుకు రూ.5వేలు వంతున పంపిణీ చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇది చాలా దారుణమన్నారు. అంగట్లో సరుకులు కొనుగోలు చేసుకునే విధంగా ఓట్లు కొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
శాసనమండలి ఎన్నికల కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొత్తం 12 బూతులు ఏర్పాటు చేశారని… ఈ బూతుల వద్ద తన అనుచరులను ఉంచి గొడవలు చేయించడానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీకాళహస్తిలో రెండు, ఏర్పేడులో ఒకటి, రేణిగుంటలో ఒకటి వంతున అతి సమస్యాత్మక పోలింగ్ బూతులను తాము గుర్తించామని… ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ పోలింగ్ బూతులపై తాము ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ బూతుల వద్ద ముందు జాగ్రత్త చర్యగా తాము కూడా నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తామని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చెప్పారు. గొడవలు సృష్టిస్తే ఓటర్లు రాకుండా అడ్డుకుని… ఏకపక్షంగా దొంగ ఓట్లు వేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో బియ్యపు మధు ఇలా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో 11,020మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకున్నారని… వీరందరూ బాగా ఆలోచించి ఏ అభ్యర్థి మంచి వారైతే వారికి ఓటు వేయాలని ఆయన కోరారు.
వైసీపీకి ఓటు వేసిన వారు రెండవ ప్రాధాన్యత ఓటుగా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, ఎల్ సీ రమణారెడ్డికి వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక 2019 ఎన్నికల సమయంలో ప్రతి యేటా జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామని చెప్పి… మాట తప్పిన జగన్ విషయం పట్టభద్రులు గుర్తించాలన్నారు. గడచిన నాలుగేళ్లలో పట్టభద్రులు, ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా మాట్లాడలేని దుస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ… శాసనమండలి ఎన్నికల్లో దొంగ ఓట్లతో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారన్నారు. ఇందుకు తిరుపతి నగరంలో బయట పడుతున్న దొంగ ఓటర్లే సాక్ష్యమన్నారు. తిరుపతిలో ఒకే వ్యక్తి పేరున 11ఓట్లు నమోదు చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తిరుపతిలోనే మహిళ పేరున 18ఓట్లు నమోదు చేశారన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తిరుపతిలో ఎలా దొంగ ఓట్లు వేశారో… ఈ శాసనమండలి ఎన్నికల్లో కూడా అలాగే చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ దొంగ ఓట్లు నమోదుపై తిరుపతి ఎన్నికల ఇన్ ఛార్జి రామానాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా… అకనాలెడ్జ్ మెంటు ఇవ్వకుండా చాలా సేపు వేధించారన్నారు.
టీడీపీ నేతలు అందరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి సిద్ధమవడంతో అపుడు అకనాలెడ్జ్ ఇచ్చారని ఆమె చెప్పారు. దొంగ ఓట్లపై తాము పోరాటం చేస్తామని పనబాక లక్ష్మి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను జగన్ ప్రభుత్వం వేధించినట్లు ఏ ప్రభుత్వం వేధించలేదన్నారు. వేధింపులకు గురైన వారందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ఆమె కోరారు. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ బలపరిచే కంచర్ల శ్రీకాంత్, ఎల్ సీ రమణారెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పనబాక లక్ష్మి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో టీడీపీ నేతలు నియోజకవర్గ పరిశీలకులు ఏడుకొండలు, చెంచయ్య నాయుడు, దశరథాచారి, మిన్నల్ రవి, సుబ్బయ్య, షాకీర్ అల్లీ, ప్రతాప్ రెడ్డి, ప్రతాప్, కిట్టు, వినయ్, సన్నీ, రామకృష్ణ, కరీం, కృష్ణమనాయుడు, మణి, హేమంత్ ,బుజ్జి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post