చంద్రబాబునాయుడు జోలెపట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా.. విరాళాలు సేకరించారు. ఒకప్పట్లో స్వాతంత్రోద్యమానికి ప్రజలు సహకరించినట్లుగా ఆయా కార్యక్రమాలకు వచ్చిన వారు డబ్బులు మాత్రమే కాకుండా.. తమ చెవిదుద్దులు, చేతి గాజులు కూడా వలిచి వారికి సమర్పించుకున్నారు. ఇంతకూ ఈ విరాళాల సేకరణ ఎందుకు? అమరావతి నుంచి రాజధాని తరలిపోకూడదని కోరుతూ… పోరాడుతున్న వారి జేఏసీకి నిధులకోసం!
‘‘నా జీవితంలో మొట్టమొదటి సారి జోలెపట్టాను’’ అని చంద్రబాబునాయుడు చెప్పుకున్నారు. అదే నిజమైతే గనుక.. ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే. 70 ఏళ్ల వయస్సు, నలభయ్యేళ్ల రాజకీయానుభవం ఉన్న నాయకుడు ఇప్పటిదాకా జోలెపట్టే సందర్భం రాలేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే పార్టీకి సేకరించే విరాళాలు గానీ, ఎన్నికల సందర్భంలో సేకరించే విరాళాలు గానీ, అమరావతి ప్రకటించినప్పుడు ప్రజలందరినుంచి సేకరించిన విరాళాలుగానీ.. ‘జోలెపట్టడం’ అనే కేటగిరీకిందకు రావని ఆయన అనుకుంటుండవచ్చు. కేవలం పంచె కొసలు ముడివేసి భుజానికి తగిలించుకుని.. అడిగితే మాత్రమే జోలె పట్టడం అని.. ఆయన అనుకుని ఉండవచ్చు.
ఏదైతేనేం చంద్రబాబుతో తొలిసారిగా జోలెపట్టించిన ఘనత బందరుకు దక్కింది. అయిదే ఆయన జోలెపట్టడం కొంత ఆలస్యం అయిందేమో అనిపిస్తోంది. ఈ పని చేయవలసిన సమయంలో చేసి ఉంటే గనుక… ఇవాళ ఈ అవసరం కోసం జోలె పట్టే పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
రాజధాని ప్రకటించిన తర్వాత.. స్థలాలు సేకరించిన తర్వాత కూడా చంద్రబాబు చాన్నాళ్లు అధికారంలోనే ఉన్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతి తెలుగువాడూ ఒక ఇటుకు ఇవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. అందుకోసం ఒక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేశారు. ఒక మోస్తరుగానే నిధులు వచ్చాయి. రాజధాని కోసం విరాళాలు ఇచ్చిన ఆ ప్రజల స్ఫూర్తిని నిరూపించేందుకు అయినా.. ఆ సొమ్ములతో కొన్ని గట్టి నిర్మాణాలు పూర్తిచేసి ఉంటే చాలా బాగుండేది. అదే మూడ్ ను ఇంకాస్త గట్టిగా ప్రయత్నాలు చేసి.. ముమ్మరంగా ప్రచారం చేసి.. విరాళాలను పోగేసి ఉండినా సరిపోయేది. రాజధాని ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు పూర్తయి ఉండేవి. అలాంటి శ్రద్ధ అప్పుడు పుట్టలేదు.
ఒక అద్భుతమైన రాజధానిని చంద్రబాబు కలగన్నారనడంలో సందేహం లేదు. కానీ, ఆ క్రమంలో నిర్మాణాలను మించిపోయేంత స్థాయిలో నిధుల దుబారా జరిగింది. ఒక లెక్కా పక్కా లేకుండా.. యూనివర్సిటీలకు రెండేసి వందల ఎకరాల భూములను కట్టబెట్టడమూ జరిగింది. పెద్ద సంస్థలను అమరావతికి తీసుకురావడంలో ఆయన సమర్థత గుర్తించదగినదే. అయితే నిధులు, ప్రభుత్వపరంగా అనుమతులు, సదుపాయాలతో వారిని ఆకర్షించి ఉంటే.. ఆయన ప్రతిభ మరింత బయటికొచ్చేది. అలాకాకుండా.. భూపందేరాలను నమ్ముకుని, భారీగా భూములను అతి చవగ్గా కట్టబెట్టడం ద్వారా.. ఆయన సంస్థలను ఇటువైపు రప్పించారు. దీనికి ఆయన సీనియారిటీగానీ, సమర్థతగాని అవసరం లేదు.
అదే క్రమంలో.. భూములను పంచిన స్థాయిలో.. ఉదారంగా ఉండే వారినుంచి నిధులను సమీకరించలేకపోయారు. వచ్చిన నిధులతో పనులు పూర్తి చేయలేకపోయారు. ఇలాంటి వైఫల్యాలన్నీ కలిసి.. జగన్మోహన రెడ్డికి అవకాశం ఇచ్చాయి. ఆయన ఖర్చు తక్కువతో సాకారం కాగల మరొక కల గన్నారు. అందుకోసం రాజధానిని విశాఖకు తీసుకువెళుతున్నారు.
జోలెపట్టవలసిన సమయంలో.. పట్టవలసిన అవసరానికి.. అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ పనిచేయలేదు. ఇప్పుడు జోలె పట్టవలసి వచ్చిందని ఆయన కుమిలిపోతున్నారు. ఇంతకూ ఆయన ఇప్పుడైనా జోలెపడుతున్నది.. పోరాటం కోసమే తప్ప రాజధానికోసం కాదు. పోరాడుతున్న రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులందరూ.. జోలె ద్వారా వచ్చే డబ్బులతో టెంట్లు వేసుకుని ధర్నాలు చేయవలసినంత దీనస్థితిలో ఉన్నారేమో క్షేత్రస్థాయి వాస్తవాలు మనకు తెలియదు.
ఒకవేళ వారు సంపన్నులే అయినా.. తతిమ్మా ప్రజల సంఘీభావ నిరూపణకు ఇలా జోలెపట్టడం ఒక మార్గం కావొచ్చు. అదే గనుక నిజమైతే.. అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంఘీభావం రాబడితే దానికి విలువ ఉండదు. తెలుగుదేశం అనేది రాష్ట్రవ్యాప్తంగా బలం ఉన్న పార్టీనే గనుక.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో… అమరావతి వాసుల పోరాటాలకోసం జోలెపట్టి నిధులు సేకరించగలిగితే.. అది అమరావతి రాజధానికోసం రాష్ట్రప్రజల మద్దతును ఘనంగా కూడగట్టినట్టు అవుతుంది.
.

Discussion about this post