‘ఆదిపురుష్’ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్లో యానిమేషన్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, అధ్వానంగా ఉన్నాయని అనేకమంది ట్రోల్ చేస్తున్నారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీటికి మతపరమైన రంగులు పులమడం కూడా జరుగుతోంది.
మత విశ్వాసాలకు భిన్నంగా, అనుకూలంగా ఉండడం గురించి కూడా చర్చలు లేవనెత్తుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా… ‘‘వందల కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నారు, అది తప్పయితే వాళ్లే అనుభవిస్తారు, కానీ ట్రోల్స్ ద్వారా వారి స్వేచ్ఛను హరించడం కరెక్ట్ కాదు’’ అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెలవిస్తున్నారు. ఇదే ఇప్పుడు కీలకమైన చర్చనీయాంశం.
ఎందుకంటే అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఒక రూపం ట్రోల్స్. అంతే తప్ప ట్రోల్స్ ద్వారా ఎవరి స్వేచ్ఛ అయినా ఎందుకు హరింపబడుతుంది? ఎవరి వ్యక్తిగత విషయాలలోకైనా తలదూర్చి వారి వ్యక్తిగత వ్యవహారాలను రచ్చకీడ్చి భ్రష్టుపట్టిస్తే అలాంటి ట్రోల్స్ ద్వారా మాత్రమే స్వేచ్ఛ హరించినట్లు అవుతుంది. అలాంటి పనులు.. ట్రోల్స్ రూపంలో మాత్రమే కాదు.. ప్రెస్ మీట్ పెట్టి అభిప్రాయాల రూపంలో చెప్పినా కూడా తప్పే. వ్యక్తిగత వ్యవహారాలలోకి చొరబడడం ఏ రూపంలో జరిగినా దానిని ఖండించాల్సిందే. అయితే ‘ఆదిపురుష్’ టీజర్కి సంబంధించి రాంగోపాల్ వర్మ ట్రోలర్స్ను తప్పు అనడం చిత్రంగా కనిపిస్తోంది.
ఎందుకంటే ఆయన కూడా సైఫ్ అలీ ఖాన్ పాత్ర తనకు నచ్చలేదని.. ఏదో యానిమేషన్ సినిమా చూస్తున్నట్లుగా ఉన్నదని, టీజర్ తనకు నచ్చలేదని అన్నారు! ఇదే తరహాలో ఎవరికి తోచిన భావాలను వాళ్ళు వ్యక్తీకరించడంలో తప్పులేదు! టీజర్ అనేదే పూర్తి నిడివి సినిమా చూసే మోజు కల్పించడానికి రిలీజ్ చేసే వ్యవహారం. ఇదే టీజర్ అద్భుతంగా ఉండి.. ‘ఇది అద్భుతం’ అని అందరూ అని ఉంటే అది కూడా వద్దని సినిమా మేకర్స్ అంటారా? టీజర్ మీద అసలు ఎవరూ అభిప్రాయాలే వ్యక్తం చేయకూడదా?
ఈ లెక్కన సినిమాల మీద రివ్యూ చెప్పడం కూడా తప్పే అని అనుకోవాల్సి ఉంటుంది. ‘వందల కోట్లు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు.. సినిమా బాగా లేకపోతే వాళ్లే పోతారు.. మీరు రివ్యూ రాయడం ఎందుకు?’ అని అడిగినట్లుగా ఉంది వ్యవహారం! ట్రోల్స్ అనేది అభిప్రాయ వ్యక్తీకరణ. ‘అది నాకు నచ్చలేదు’ అని చెప్పడం కూడా తప్పే అంటే ఎలా? మామూలుగా తన వ్యవహారాలు తప్ప మరేమీ పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ ట్రోలర్స్ ను కార్నర్ చేస్తూ తప్పు పట్టడమే తమాషా!
https://www.youtube.com/watch?v=ScCt7Lnz3mU
.
Discussion about this post