‘చదవడం’ అనేది ఒక మంచి అలవాటు. వ్యక్తిత్వాలను తీర్చిదిద్దగల అలవాటు. ఆసక్తులను బట్టి వివిధ పుస్తకాలను చదవడం అనేది.. ఎవ్వరినైనా సరే పరిణతి గల వ్యక్తులుగా తయారుచేస్తుంది. కానీ.. ఇవాళ్టి సమాజంలో ‘చదవడం’ అనే అలవాటు పూర్తిగా చచ్చిపోతోంది. ఆన్ లైన్ సోషల్ మీడియా, అనేక రకాల వినోద మాధ్యమాలు వెరసి.. సమాజంలో ‘చదవడం’ అనే అలవాటును పూర్తిగా చంపేస్తున్నాయి.
ఈ తరంలో ‘చదివే’ అలవాటు పోతున్నదనే భయమే మనకు కలుగుతోంది. కానీ.. భవిష్యత్ తరాలను ఊహించుకుంటే.. అసలు రేపటి పౌరులకు ‘చదవడం’ నామమాత్రంగానైనా చేతనవుతుందా అనే పెద్దభయం పుడుతుంది.
ఇలాంటి సమస్యకు తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఆవిష్కరించింది. ‘రీడ్’ అనే పేరుతో కేవలం పిల్లలను చదివించడం కోసమే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తోంది.
కేవలం పిల్లలు చదవడం కోసం సర్కారు బడుల్లో ఒక పీరియడ్ ను కేటాయించనున్నారు. ఆ సమయంలో పాఠశాలలోని పిల్లలందరికీ రకరకాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు. వారు ఆయా పుస్తకాలను చదువుకోవచ్చు. ఈ విద్యాసంవత్సరం ముగిసే వరకు వందరోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈలోగా.. పిల్లలందరూ తాము చదువుతున్న పుస్తకాలను ధారాళంగా చదివేసేలా తయారు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం.
ఒక పీరియడ్ ను పూర్తిగా చదవడానికి మాత్రమే కేటాయించి.. పాఠ్యపుస్తకాలతో పాటు పాఠ్యేతర పుస్తకాలను, వార్తాపత్రికలను కూడా చదివేలా అలవాటు చేయాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. పిల్లల్లో చదివే అలవాటును పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. పిల్లలు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు వాతావరణం ఏర్పాటు చేయాలని, అందుకు ఉపాధ్యాయులే వారితో మాట్లాడి పూనిక వహించాలని కూడా నిర్దేశిస్తున్నారు.
ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా వారితో పుస్తకాలు చదివించడం అనేది ఏమాత్రం ఆచరణలోకి వస్తుందో చెప్పలేం గానీ.. స్కూళ్లలో కేవలం చదవడానికి ఒక పీరియడ్ కేటాయించడం, అందులో పాఠ్యేతర సృజనాత్మక పుస్తకాలను కూడా చదివించడం అనేది భేషైన ఆలోచన.
ఈనెల 21వ తేదీన మాతృభాషా దినోత్సవానికి ముడిపెట్టి కేసీఆర్ సర్కారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది. అలాగే ఈనెల 14 నుంచి 21 వరకు గ్రంథాలయ వారోత్సవాలను కూడా ప్రతి పాఠశాలలో నిర్వహించే ఏర్పాటు చేస్తున్నది. మొత్తానికి భావితరాల్లో కూడా తెలుగు భాష సజీవంగా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం భేషుగ్గానే కనిపిస్తోంది.
.

Discussion about this post