రాజ్యసభలో తమ అవసరం భాజపాకు ఉంటుందనే భావన వైకాపాకు ఉండవచ్చు గాక.. ఆ సభలో వారి బలం ముందు ముందు పెరగవచ్చు గాక.. కానీ.. భారతీయ జనతా పార్టీకి, పవన్ కల్యాణ్ స్నేహాన్ని వదులుకునే ఉద్దేశమే లేనట్లుగా కనిపిస్తోంది. ఎన్డీయే కూటమిలోకి వైకాపా చేరవచ్చునని ఆ పార్టీనేతలు లీకులు ఇవ్వడం, దాని పర్యవసానంగా అదే జరిగితే.. తాను ఆ జట్టునుంచి బయటకు వస్తానని పవన్ కల్యాణ్ హూంకరించడం నేపథ్యంలో.. భాజపా అగ్ర నేతలు.. వేర్వేరు సందర్భాల్లో ఈ విషయంలో చర్చోపచర్చలకు తెరదించడానికి ప్రయత్నించారు. పవన్ తోనే తమ బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బిజెపి నేతలు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్రంలో వైసీపీ భాగస్వామ్యం అయ్యే అవకాశం లేదని తేల్చి పారేస్తున్నారు. ప్రధాని మోదీతో జగన్ కలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో వైసిపి త్వరలో చేరుతుందని జాతీయస్థాయిలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టింది. ప్రధాన ప్రతిపక్షం తేదేపా ఈ విషయంలో క్లారిటీ వచ్చేవరకు స్పందించ కూడదని నిర్ణయించుకుంది.
బిజెపి నేతలు మాత్రం అధిష్టానవర్గం పెద్దల నుంచి వచ్చే సంకేతాల కోసం ఎదురుచూశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంలో వైసిపి చేరే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇది కేవలం వైసిపి నేతల ప్రచారమే అని కొట్టి పారేశారు.ఒకవేళ నిజంగా అదే జరిగితే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటామని తేల్చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బిజెపి అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. ఈ అంశంపై బిజెపి మహిళా మోర్చా జాతీయ ఇన్చార్జ్ పురందేశ్వరి ఆదివారం స్పందించారు. తాము రాజకీయంగా పవన్ కళ్యాణ్ తో నే కలసి పని చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలో వైసీపీ చేరే అవకాశమే లేదని పేర్కొన్నారు. బిజెపి అగ్రనేతలు నుంచి సమాచారం లేనిదే పురందేశ్వరి ఈ విధంగా మాట్లాడి ఉండరని స్పష్టం అవుతోంది. దీంతో ప్రస్తుతానికి బిజెపి, వైసిపి కలసి పనిచేసే అవకాశం లేదని తేలిపోయింది.
మరోవైపు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దేవధర్.. విశాఖలో జగన్ సర్కారు మీద విరుచుకుపడ్డారు. వీరి మధ్య పొత్తు అసలు సాధ్యమేనా? అనిపించే రీతిలో జగన్ గురించి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడని, అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. పవన్ తో అనుబంధాన్ని మరోసారి సమర్థించారు. ఆయన విమర్శల్లోని తీవ్రత చూస్తే.. అసలు జగన్ ఆలోచనకు కేంద్రం మద్దతు దక్కడం కూడా అనుమానమే అనిపిస్తుంది.
మరో వైపు వైసీపీలో సైతం జాతీయస్థాయిలో జరుగుతున్న ప్రచారంపై కలకలం రేపిన విషయం తెలిసిందే. బొత్స తన మాటల్ని వెనక్కుతీసుకున్నారు. బొత్స మాటల ద్వారా జరిగిన నష్టాన్ని పూరించడానికి.. ఇతర మంత్రులు కొందరు.. రకరకాల సమర్థింపులతో తమ వంతు ప్రయత్నించడం విశేషం.
.

Discussion about this post