తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పగ్గాలను పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొన్ని షరతులతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు అప్పగించారు. మూడు మాసాలు ఆయనకు గడువు ఇచ్చారు. అంతలోపు శంకర్ తన తీరు మార్చుకోక పోతే… ‘మార్పు’ తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా హెచ్చరించారు. నియోజకవర్గ బాధ్యతలు కావాలంటే తప్పని సరిగా బెంగళూరు వదలి ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా శంకర్ కు నిబంధన విధించారు.
ఇందుకు ఆయన అంగీకరించడంతో టీడీపీ అధిష్టానం శంకర్ యాదవ్ కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. మంగళగిరి లో చంద్రబాబు సమక్షంలో గురువారం జరిగిన తంబళ్లపల్లె నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శంకర్ కు బాధ్యతల పట్ల ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఆయన అనుచరులు మాత్రం ఆనంద పడుతున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గం ఒకపుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తంబళ్లపల్లె టీఎన్ కుటుంబం, కలిచెర్ల ప్రభాకర రెడ్డి కుటుంబాలు అక్కడ తిరుగులేని ఆధిపత్యం చెలాయించేవి. అక్కడ వారు చెప్పిందే శిలాశాసనం. అయితే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఆ రెండు కుటుంబాల ఆధిపత్యానికి గండి పడింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ములకలచెరువు మండలం గూడుపల్లెకు చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఏవీ ఉమాశంకరరెడ్డిని బరిలో దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
అయినా అప్పటి టీడీపీ అధినేత నందమూరి తారక రామారావు ఉమాశంకరరెడ్ఢికి శాసనమండలి సభ్యత్వం ఇచ్చారు. రామారావుకు ఉమాశంకరరెఢ్డికి మధ్య చాలా సన్నిహిత సంబధాలు ఉండటమే ఇందుకు కారణం. ఉమాశంకరరెఢ్డి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తంబళ్లపల్లె నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనతికాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు పొందడంతో పాటు… పేదలకు ఆపద్భాంధవునిగా మారాడు.
ఇది ఓర్వలేని ప్రత్యర్థి వర్గం 1984 డిసెంబరు 25న ఉమాశంకరరెడ్డిని అత్యంత కిరాతకంగా చంపింది. కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఎన్ టీఆర్ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా తంబళ్లపల్లె, ములకలచెరువు మండలాల సరిహద్దుల్లో చిన్నేరు సమీపంలో ప్రత్యర్థులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉమాశంకరరెడ్డి అంతిమయాత్రలో రామారావు స్వయంగా పాల్గొని.. పాడె కూడా మోసారు. దీనిని బట్టి వారిరద్దరి మధ్య ఎంత సన్నిహిత సంబంధం ఉండేదో అర్థమవుతుంది.
ఉమాశంకరరెడ్డి మరణం తరువాత టీడీపీ పగ్గాలు ఆయన సతీమణి ఏవీ లక్ష్మీదేవమ్మకు అప్పగించారు. లక్ష్మీదేవమ్మ కూడా తన భర్త బాటలోనే పయనించి.. నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. 1985, 1994లో రెండు పర్యాయాలు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పొత్తుల కారణంగా తంబళ్లపల్లె సీటును బీజేపీకి కేటాయించారు. మొదటిసారి ఆమె మౌనం పాటించినా.. కార్యకర్తల కోసం ఆమె రెండవ సారి అధిష్టానంపై తిరుగుబాటు చేసింది. టీడీపికి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి త్రిముఖ పోటీలో 25వేలు పై చిలుకు ఓట్లు ఆమె సంపాందించారు.
ఏ ఏరాజకీయ పార్టీలోకి వెళ్లకుండా కొంతకాలం తటస్థంగా ఉండిపోయారు. అయితే టీడీపీ అధిష్టానం మళ్లీ లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించింది. ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో లక్ష్మీదేవమ్మ పెద్దకుమారుడు ఏవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే కొన్ని కారణాలతో ప్రవీణ్ కుమార్ రెఢ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ వైసీపీ తరపున బరిలో దిగారు. టీడీపీ తరపున శంకర్ యాదవ్ బరిలో నిలిచారు.
1955 నుంచి రెడ్డి సామాజిక వర్గానికే ఇక్కడ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తూ వచ్చాయి. అయితే మొట్టమొదటి సారిగా టీడీపీ బీసీ అభ్యర్థిని ఇక్కడ బరిలోకి దింపడంతో… ఆ సామాజిక వర్గం ఎక్కువ భాగం శంకర్ కు అండగా నిలబడింది. ఈ ఎన్నికల్లో శంకర్ విజయం సాధించారు. అయితే ఆయన బెంగళూరులో నివాసం ఉంటూ… ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ వచ్చేవారు. ఈ కారణంగా శంకర్ పై స్థానికంగా అసంతృప్తి పెరిగింది.
అయినా అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్ధి లేక పోవడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ మళ్లీ ఆయనకే దక్కింది. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున పెద్దిరెడ్ఢి ద్వారకనాథరెడ్డి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ద్వారకనాథరెడ్డి విజయం సాధించారు. వైసీపీ టికెట్ కోసం ప్రవీణ్ కుమార్ రెఢ్డి ప్రయత్నించినా ఫలితం దక్కక పోవడంతో… నిరాశ చెందిన ప్రవీణ్ రాజకీయాలకు దూరమై ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారు.
లక్ష్మీదేవమ్మ మాత్రం ములకల చెరువులోనే నివాసం ఉంటోంది. ఇదిలా ఉండగా 2019లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన శంకర్ యాదవ్ ఓటమి చెందడంతో నియోజక వర్గానికి రావడమే మానేశారు. బెంగళూరుకే పరిమితం అయ్యారు. అరుదుగా మాత్రమే తంబళ్లపల్లెకు వస్తుంటారు. 2019 ఎన్నికల తరువాత శంకర్ నియోజక వర్గ కార్యకర్తలతో కనీసం ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో తంబళ్లపల్లెలో తెలుగుదేశం పార్టీ చాలా బలహీనపడింది.
టీడీపీకి పెద్ద సంఖ్యలో సానుభూతి పరులు ఉన్నప్పటికీ.. వారిని నడిపించే నాయకుడు లేక వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇది గమనించిన టీడీపీ అధిష్టానం తంబళ్లపల్లెలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ద్వారకనాథరెడ్డి బలమైన నేత కావడంతో.. ఆయన్ను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం.. బలం మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ కుటుంబానికి మాత్రమే ఉందని గ్రహించారు. లక్ష్మీదేవమ్మ కుటుంబ సభ్యులతో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులుశ్రీనివాసులురెడ్డి పలు ధపాలు చర్చించినట్లు సమాచారం.
ప్రవీణ్ కు పగ్గాలు ఇస్తే తంబళ్లపల్లెలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ కార్యకర్తల ఆశ. నమ్మకం కూడా. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం తంబళ్లపల్లె నియోజక వర్గానికి చెందిన సమన్వయ కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కమిటిలో ఉన్న 27మందిని మాత్రమే సమావేశానికి రమ్మని పార్టీ అధిష్టానం చెప్పింది. అయితే శంకర్ మాత్రం తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట, ములకలచెరువు, బి.కొత్తకోట, పీటీఎం మండలాల నుంచి తన అనుచరులను తీసుకెళ్లారు.
అయినా అధిష్టానం మాత్రం సమన్వయ కమిటీ సభ్యులతోనే చర్చించి… వారి అభిప్రాయాలను వ్యక్తి గతంగా కనుగొంది. ఈ సమావేశంలో లక్ష్మీదేవమ్మ కుటుంబ సభ్యుల ప్రస్తావన వచ్చింది. ద్వారకనాథరెడ్డిని ఎదుర్కోవాలంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుదనే అభిప్రాయాన్ని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిసింది. అయితే వారు ప్రస్తుతం పార్టీలో లేనందున.. తరువాత నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం సూచించింది.
తనకు బాధ్యతలు ఇస్తే పార్టీని నడిపిస్తానని బి.కొత్తకోట మాజీ జడ్పీటీసీ పర్వీన్ తాజ్ పార్టీ నేతలను కోరింది. బీసీ సామాజిక వర్గానికి అయితే శంకర్ యాదవ్ లేదా పర్వీన్ తాజ్.. రెడ్డి సామాజిక వర్గానికి అయితే ప్రవీణ్ కుమార్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబును కోరారు. దీంతో ఇన్ ఛార్జి నియామకం నిర్ణయం వాయిదా వేయాలని ఆయన నిర్ణయించారు.
అయితే సమన్వయ కమిటీ సభ్యులు మాత్రం తమకు ఇన్ ఛార్జిని నియమించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో శంకర్ యాదవ్ ను మూడు నెలల పాటు ఇన్ ఛార్జిగా నియమించడానికి చంద్రబాబు అంగీకరించారు. బెంగళూరు వదలి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని శంకర్ కు ఆదేశించారు. ఒకవేళ అలా చేయక పోతే మూడు నెలల తరువాత తంబళ్లపల్లె బాధ్యతలు వేరే వారికి అప్పగిస్తానని తేల్చి చెప్పారు.
ఇందుకు అంగీకరించిన శంకర్ కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. మూడు నెలల తరువాత ఏం జరుగుతుందోనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ శంకర్ ను తప్పిస్తే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
.

Discussion about this post