‘ఆశ్రిత వత్సలుడు’ అనే ఒక మాట ఉంటుంది. సాధారణంగా.. నలుగురికీ మేలుచేసే గొప్పవాళ్ల గురించి ఈ పదం వాడుతుంటారు. దేవుడిని పొగిడే పద్యాలు, పాటల్లో కూడా ఇలాంటి పదం దొర్లుతూ ఉంటుంది. అంటే.. తనను నమ్ముకున్న వాళ్లకి, ఆశ్రయించిన వాళ్లకి మేలు చేసే వాడు.. వాళ్ల అభివృద్ధి గురించి పట్టించుకునేవాడు అని అర్థం. ఒక స్థాయికి ఎదిగిన చాలా మంది.. ఇలా తమను నమ్ముకున్న వాళ్లకి మేలు చేస్తుంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆ విషయంలో తాను తిరుగులేని వాడినని నిరూపించుకున్నారు.
తిరుపతి ఎంపీ టికెట్ను డాక్టర్ గురుమూర్తికి ఇవ్వడం చాలా కీలకమైన విషయం. డాక్టర్ గురుమూర్తి.. ఫిజియో థెరపిస్టు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన కాలంలో.. ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన వ్యక్తి. ప్రతినిత్యం ఆయనతో పాటు ఉంటూ.. ఆయనకు వ్యక్తిగతంగా సేవలు అందించారు. అంతకుమించి.. ఆయన ఏమాత్రమూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఒక కుగ్రామంలో.. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీచేయాల్సి వస్తే.. కోట్లకు కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చుకు పెట్టుకోగల తాహతు ఉన్న వ్యక్తి కూడా కాదు. అయితే.. ఆయనకు ఏకంగా లోక్సభ ఎంపీ టికెట్ ప్రకటించడం విశేషం.
తిరుపతి ఎంపీ సీటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సిటింగ్ సీటు! ఆ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించడం వలన ఉపఎన్నిక జరుగుతోంది. వారి కుటుంబానికి ఇస్తే సానుభూతి కూడా వర్కవుట్ అవుతుంది. అయితే జగన్ తన తక్కెడలో సానుభూతి ద్వారా దక్కే విజయం కంటె.. తనకు సేవలందించిన విశ్వాసపాత్రుడిని అందలం ఎక్కించడానికే మొగ్గు చూపారు. సానుభూతి ద్వారా తనకు విజయం అక్కర్లేదనుకున్నారు జగన్.. తన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని కూడా అనుకున్నారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
గురుమూర్తికి టికెట్ దక్కడం కొత్త విషయం కాదు. చాలా కాలం కిందటే ఈ విషయం గురించి అనధికారిక ప్రకటన వచ్చింది. అయితే.. అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి.. వైసీపీలో ఇంకా కొందరు.. ఆర్థికంగా బలం ఉన్న వాళ్లు.. టికెట్ కోసం యథోరీతిగా తమతమ ప్రయత్నాలు చేసుకున్నారు. అవేవీ జగన్ పట్టించుకోలేదు. మంగళవారం నాడు.. గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.
తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక విషయంలో తెలుగుదేశం అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును చంద్రబాబునాయుడు ఎంతోకాలం కిందటే ప్రకటించినప్పటికీ.. ఆమె ఇంకా యాక్టివ్గా ప్రచారంలోకి దిగలేదు. జనసేన ప్రయత్నాల్ని తోసిరాజని బరిలోకి దిగుతున్న బీజేపీ.. మాజీ ఐఏఎస్ను రంగంలోకి దించుతోంది. గత ఎన్నికల్లో దక్కిన మెజారిటీ.. ఇటీవలి పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో ఫలితాల నేపథ్యంలో.. తిరుపతి ఎంపీ సీటు విషయంలో కూడా.. వైసీపీకే విజయం దక్కే అవకాశం ఉంది. అలాంటప్పుడు.. కేవలం తనకు విశ్వాసపాత్రుడుగా ఉండడమే అర్హతగా భావించి.. జగన్, గురుమూర్తికి టికెట్ ఇవ్వడం గమనార్హం.

.

Discussion about this post