ఎవరివో మాటల అలజడికి లోయర్ బెర్త్లో కలత నిద్రతో ఉన్న నాకు మెలకువ వచ్చింది.
లేచి కూర్చుని కిటికి అద్దంలోంచి బయటికి చూశాను. చుట్టూ చీకటి ఆవరించి ఉన్న సన్నటి వెలుతురులో ‘గుడివాడ’ అనే నేమ్ బోర్డు స్పష్టంగా కనిపిస్తోంది. ఫోన్ ఆన్ చేసి టైం చూశాను. పావు తక్కువ రెండు అయ్యింది. దిగవలసిన వాళ్ళు దిగుతున్నారు… రెండు నిమిషాల తర్వాత ట్రైన్ మెల్లగా కదిలింది…
వెలుతురులోంచి చీకటిలోకి…
చల్లగా జారుకుంటోంది…
వాతావరణంలో తేమ ఉండడం వలన చలిగా అనిపిస్తోంది…
మళ్ళీ నాకు నిద్రపోవాలని అనిపించలేదు…
అందుకే కిటికీ ప్రక్కన కూర్చొని కదిలే దృశ్యాల్ని మౌనయోగిలా అలా తటస్థంగా చూస్తుండిపోయాను.
నిరంతరం అలా కదిలి వెళ్లిపోతున్న దృశ్యంలో.. కారుచీకటిలో… చెట్లన్నీ… ఒంటికాలిపై నిలబడుకుని కఠోరతపస్సు చేస్తున్న మునుల్లా కనబడుతున్నాయి….
ఆ నిశీధి ప్రపంచంలో మనుషులు చేసే అనవసరమైన, అసహజమైన అలజడులతో గందరగోళంగా ఉండే ఈ భూగోళం నెమ్మదించి నిశ్శబ్దం కరాళనృత్యం చేస్తోంది.
అప్పుడనిపించింది.. ఈ మనుషుల కోపతాపాలు… ఈర్షాద్వేషాలు… మమతానురాగాలు…
ఈ నిశీధి నిశ్శబ్దంలో ఏమయిపోయాయని?
మరి మెలకువలో ఉన్నప్పుడు మనిషి ఎందుకు ఈ ప్రశాంతతను కోరుకోవడంలేదని? ఆలోచిస్తుండగా… నాకు వెంటనే స్ఫురించిందేంటంటే… ఆ నిశ్శబ్దాన్ని, ఆ ప్రశాంతతను మనిషి భరించలేడని.
అతనికి శబ్దమే ఆనందపు శంఖారావం…
అరుపులే ఆయుధాలు…
కోపతాపాలే మలయమారుతాలు…
ఈర్ష్యాద్వేషాలే విందుభోజనాలు…
నిరంతరం వాటితోనే సహవాసం చేయడంవల్ల అవి మనిషికి ప్రియనేస్తాలుగా మారిపోయాయి.
చివరకు వాటితోనే మమేకం అయిపోవడంవల్ల మనిషి తన సహజస్థితిని మరిచిపోయాడు.
మరి మనిషి సహజస్థితిని మరచిపోవడానికి కారణమేమి?
మనిషి పుట్టుక ఏడుపుతోనే మొదలవుతుంది. ఎందుకంటే అప్పటివరకు ఏకాంతంలో ఓలలాడిన మనిషి ఒక్కసారిగా ఈ శబ్దప్రపంచంలోకి జారి ఒక విధమైన ఉలికిపాటుకు గురికావడంవల్ల భయంతో ఏడుస్తూ తల్లిగర్భంలోంచి బాహ్యప్రపంచంలోకి వస్తాడు.
ఆ తర్వాత ఆ ఏడుపునే ఆలంబనగా చేసుకుని.. తదుపరి తనకు జీవితంలో ఎదురయ్యే రాగద్వేషాలు, భావోద్వేగాలనే సుడిగుండాలలో కొట్టుమిట్టాడుతూ జీవనపోరాటం చేస్తాడు.
చివరకు వాటితో విసిగి, వేసారిన మనిషికి నిరాశ, నిర్లిప్తత ఆవహించడంవల్ల…
మళ్ళీ తన స్వరూపమైన ఆ ఏకాంతంలోకి… ఆ మౌనప్రపంచంలోకి వెళ్ళిపోవాలని ఆరాటపడతాడు.
అందుకోసమే మృత్యువు వైపు ఆశగా ఎదురు చూస్తుంటాడు. “కాటికి కాళ్లుచాచడం” అంటే ఇదే. చివరకు మృత్యువు సమీపించినప్పుడు తన్మయంతో మనసు ఉండడం వల్ల పెల్లుబికిన ఆనందబాష్పాలు కంటి అంచుల నుంచి జాలువారుతుంటే… విడిగా ఉండి చూసేవారికి అవి బాధాతప్త కన్నీళ్లుగా గోచరిస్తాయి.
మనిషి మళ్ళీ తన సహజస్థితిని పొందాలంటే ఏంచెయ్యాలి?
మనిషి మౌనాన్ని, నిశ్శబ్దాన్ని కోరుకోవడానికి అసలు కారణం ఏంటంటే… అది అతని సహజస్థితి.
ఆ సహజస్థితిని మనిషి మరవడంవల్లే ఈ రాగద్వేషాలు, భావోద్వేగాలు మనస్సుకు అంటుకుంటున్నాయి. మరి తన సహజస్థితిని మళ్ళీ పొందడానికి మార్గమేమి..? అనే ప్రశ్న మనలో ఉదయిస్తుంది. దానికి మార్గం అంటూ ఏదీలేదు.
‘నేనున్నాను’ అన్న “ఎరుక”తో సదా ఉండడమే.
మరి ఆ ఎరుకను.. కలిగి ఉండాలంటే.. ఏంచెయ్యాలి?
ఉదాహరణకు:
మీకు గాఢనిద్ర నుంచి మెలకువ వచ్చిన తర్వాత…
“ఏమండీ! గాఢనిద్రలో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంది?” అని ఎవరైనా అడిగారనుకోండి.
“హాయిగా ఉందండి” అంటారు మీరు.
“మరి ఆ హాయి ఇప్పుడు ఏమైంది” అని అడిగితే..
ఏ సమాధానం చెప్పక మౌనం వహిస్తారు.
కారణమేమంటే.. గాఢనిద్రలో ఉన్నప్పుడు మనకు ఏ అనుభవాలు ఉండవు. మెలకువ వచ్చిన తర్వాత ఈ ప్రాపంచిక విషయాలు మనకు తెలియకుండానే మనల్ని చుట్టుముట్టడంవల్ల రకరకాల అనుభవాలు మనకు కలుగుతాయి. మరి గాఢనిద్రలో ఉన్న “హాయి”ని మెలకువలో కూడా అనుభవించాలంటే ఏంచెయ్యాలి? అంటే ‘ఇప్పుడు జరిగేదంతా ఒక కల’ అని సదా జ్ఞప్తిని కలిగి ఉండడమే.
ఈ తలంపుల తడువులాటల మధ్యలోనే ట్రైన్ ఆగడానికి సన్నద్ధమయినట్లు అలికిడి వినిపించడంతో మళ్ళీ కిటికి అద్దంలోంచి బయటి దృశ్యాన్ని చూశాను..
గాఢనిద్రలోంచి మెలకువలోకి…
నిశ్శబ్దంలో నుంచి అలజడిలోకి…
తల్లిగర్భంలో నుంచి బాహ్య ప్రపంచంలోకి…
వచ్చినట్లు..
ట్రైన్ చీకటిలోంచి వెలుగులోకి మెల్లగా ప్రవేశిస్తోంది…
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.
Discussion about this post