చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సంక్షోభం ఏర్పడిన ఈ నేపథ్యంలో.. ఒకరిమీద ఒకరు రకరకాల ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి పేరు పేర్ని నాని తో వ్యక్తిగతంగా కూడా భేటీ అయిన రాంగోపాల్ వర్మ.. ప్రభుత్వం మీద విమర్శల విషయంలోనూ, ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టే విషయంలోనూ.. ఏ మాత్రం తగ్గడం లేదు! వరుస ట్వీట్లతో ఆయన ప్రభుత్వం మీద దాడి చేస్తూనే ఉన్నారు.
ఇందులో భాగంగానే సినిమా పరిశ్రమకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. అయితే ఆ సలహాను ఆచరించి అమలులో పెట్టే ధైర్యం ఎవరికి ఉంది? టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు ఆ సంగతి తేల్చుకోవాల్సి ఉంది!
ఇంతకూ రాంగోపాల్ వర్మ ఏం సలహా చెప్పారు. ఏపీ రాష్ట్రప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆయన అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది.. చట్టానికి వ్యతిరేకంగా ఉన్నదని.. వర్మ చెబుతున్నారు.
నిజానికి సినిమాటోగ్రఫీ చట్టం అనేది ఈ దేశంలో 1952లో అమల్లోకి వచ్చింది. అయితే.. ఇటీవలి కాలంలో మోడీ సర్కారు సినిమాటోగ్రఫీ చట్టానికి మార్పులు చేసే ప్రయత్నంలో ఉన్నది గానీ.. ఆ ప్రభుత్వం తలపెట్టిన మార్పులకు ఇప్పుడు.. ఏపీ పరిధిలో ఏర్పడిన వివాదానికి సంబంధం లేదు.
అయితే రాంగోపాల్ వర్మ చెబుతున్న ప్రకారం.. సినిమాటోగ్రఫీ చట్టం అనేది కూడా.. ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుల కిందికి వస్తుందని ఆయన అంటున్నారు. ఏపీలో సినిమాటోగ్రఫీ చట్టాన్నే పక్కన పెట్టేసి నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.
నిజానికి చట్టం గురించి మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడారు. ఆర్జీవీ వివాదం తలెత్తినప్పుడు.. అసలు సినిమాటోగ్రఫీ చట్టం అనేది ఒకటి ఉంటుందని తెలుసా.. అంటూ పేర్ని నాని అడిగారు. ఆ చట్టం ప్రకారమే తాము నిర్ణయాలు తీసుకున్నాం అని అంటున్నారు. ఇప్పుడు వర్మ చట్టాన్ని పక్కన పెట్టేసి నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. టాలీవుడ్ పెద్దలు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నదని వర్మ సూచిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం చట్టానికి వ్యతిరేకంగా ఉన్న మాట నిజమే అయితే గనుక.. ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అయితే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి సినిమా పరిశ్రమ పెద్దలకు ధైర్యం చాలడం లేదు. అలాంటప్పుడు.. ఏకంగా హైకోర్టును ఆశ్రయించేంత ధైర్యం ఎవరికి ఉంటుంది?
వర్మ చెబుతున్నందువల్లనే కాకపోయినప్పటికీ.. టికెట్ ధరలను తగ్గించిన విషయంలో కోర్టును ఆశ్రయిస్తే.. సినిమా పరిశ్రమకు ఎంతోకొంత న్యాయం జరిగే అవకాశం ఉందనే అనుకుందాం. అయితే.. కోర్టును ఆశ్రయించేదెవ్వరు? కోర్టుకు వెళ్లే వారిని ప్రభుత్వం శత్రువులుగా పరిగణించే ప్రమాదం ఉంటే.. అందుకు ఎవరైనా సాహసిస్తారా? ప్రభుత్వంతో తగాదా పెట్టుకోవాలని.. వ్యాపారం చేయాలనుకునేవారు కోరుకుంటారా? అనేది అనుమానం.
దీనివలన లాభం జరిగేది నిజమే కావచ్చు. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవ్వరు?
Discussion about this post