కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లకొచ్చి..
దయ్యం పట్టిందిరో నా పెళ్ళాం పోరలకు..
టీవీ మొదలైతే చాలు ఇంటిలోన తీరుమారు..
పుస్తకాలు పడేసి పసిపిల్లలు పోరలు జోరుజోరు చూస్తన్రు..
లవ్వంటే ఏందని అవ్వనడిగి జంపుతన్రు..
-అంటూ ప్రజాకవి గద్దర్ రాసి, పాడిన పాట కలరు టీవీ ప్రజల జీవితాల్లో తెచ్చిన విపరిణామాలను ప్రస్తావించి అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. కలర్ టీవీ కన్నా అనేక రెట్లు ప్రభావం చూపుతున్నదిపుడు ఇంటర్నెట్ ప్రపంచం.
ఇప్పుడు ఏ ఇంటికి వెళ్లినా అంతా తలొక ఫోన్లో మునిగిపోయి ముసిముసిగా నవ్వుకోవడమో (జోక్ కు), ప్రపంచం మునిగినట్లు ముఖం మాడ్చుకోవడమో (నచ్చని వార్తకు), కుతకుతలాడడమో (ఎవడో చేసిన అక్షర దాడికి) చేస్తూ కనిపిస్తున్నారు. కాసేపు మాట్లాడినా, అది తాము కొన్న కొత్త ఐ ఫోన్, లేదా తాము చూసిన వీడియోలో అంశాల లేదా తాము నెట్ లో చూసి పాటిస్తూ తృప్తిపడుతున్న వైద్య చిట్కాల లేదా వంకర మాటల రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ చుట్టూ పరిభ్రమిస్తుంది.
వాట్సాప్ గ్రూపుల్లో సమాచార ప్రవాహం, అనవసర సొల్లు మాటలు, గాలికబుర్లలో మునిగితేలి పక్కనున్న మనుషులతో మనసు విప్పి మాట్లాడుకోవడం లోపిస్తోంది. ఆనందమయ సుఖజీవనానికి ముఖ్యం సమాజంలో ప్రజలు కలుసుకుని మాట్లాడుకోవడం, మంచీ చెడూ పంచుకోవడమని అన్ని సర్వేలు చెబుతున్నా ఎవ్వరికీ పట్టడంలేదు. మొన్న మొన్న పుట్టిన పిల్లకూనలు సైతం ఫోన్ లో ఏదో ఒకటి చూపకపోతే తిండి తినడంలేదు. ఫోన్లు పక్కనపడేసి మనతో కాసేపు మాట్లాడేవాళ్ళు కరువవుతున్నారు. ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి. టీనేజ్ పిల్లలను ఈ విషయంలో డీల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మన సమాజం కానరాని ఒక సామాజిక సంక్షోభంలో ఉంది, ఈ స్మార్ట్ ఫోన్ల దుష్ప్రభావం వల్ల.
ఈ కరోనా పుణ్యాన, విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల మూలంగా నెట్ ప్రపంచానికి బాగా దగ్గరయ్యారు. దగ్గర కావడమేమిటి, అందులో మునిగి తేలుతున్నారు. ఇది అనేక విపరిణామాలు దారితీస్తున్నదని మానసిక నిపుణులు, టీచర్లు చెబుతున్నారు. కలర్ టీవీ కాలంలోలాగా ఇప్పుడు పిల్లలు లవ్వంటే ఏమిటని అడగక్కర్లేదు. గూగుల్ లో ఎలా సెర్చ్ చేయాలో వారికీ తెలుసు. శుభ్రంగా బొమ్మలతో సహా లవ్వు గురించి పూసగుచ్చినట్లు చెప్పడమే కాకుండా, కొన్ని ఆకర్షించే బొమ్మలు, ఉత్తేజపరిచే వీడియోలు కూడా తేలిగ్గా లభ్యమవుతున్నాయి.
“కొవిడ్ అనంతరం పిల్లల్లో మానసికంగా వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నెట్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. అందులో వాడే భాష, అందులో పాత్రల ప్రవర్తన క్లాసురూంలో కనిపిస్తున్నాయి. బూతు ప్రభావం కారణంగా యుక్త వయసు విద్యార్థినీ విద్యార్థులు ఒకరిని ఒకరు చూసుకునే విధానంలో కూడా నాకు తేడా కనిపిస్తోంది,” అని ఒక సీనియర్ అధ్యాపకుడు చెప్పారు. మనం గర్వంగా భావించే సంస్కృతీ సంప్రదాయాలు టెక్నాలజీ ప్రభావంతో మంటగలిసిపోతున్నాయని వాపోతున్నారు టీచర్లు.
ఇంకొందరు టీచర్లు చెబుతున్న ప్రకారం, నెట్ మీద ఆధారపడడం పిల్లల్లో ఎక్కువయ్యింది. బుర్రపెట్టి చేయాల్సిన హోం వర్క్ ను నెట్ సాయంతో చేయడం పెరిగింది. “సొంతంగా పరిష్కరించదగిన సమస్యలు కూడా నెట్ మీద ఆధారపడి చేస్తున్నారు. టీచర్లతో మాట్లాడే ధోరణి కూడా కొవిడ్ తర్వాత మారింది. సినీ క్లిప్పుల ప్రభావంతో మొబైల్ ఫోన్లు దొంగతనంగా స్కూల్ కు తేవడం, టీచర్లు చూడకుండా ఇతరులకు చూపి అందరూ కలిసి ఆనందించడం కనిపిస్తోంది,” అని మరొక టీచర్ చెప్పారు. చెడు సైట్ల కారణంగా ఒక తరం పూర్తిగా దెబ్బతిన్నట్లు భావిస్తున్నానని ఒక జర్నలిస్టు-కం-టీచర్ చెప్పారు.
పసి వయస్సులో బూతు క్లిప్స్ చూసి ఆగమాగం అయ్యే పిల్ల పరిస్థితి ఒకటైతే, హర్రర్ సినిమాలు చూసి మానసికంగా దెబ్బ తింటున్న పిల్లలు కూడా ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తున్నది. రోజూ చిత్ర విచిత్రమైన వీడియో గేమ్స్ ఆడి మారణాయుధాలతో ఇతరులను చంపి వికృత విజయానందం పొందే పిల్లలు శాంతి కాముకులు అవుతారని, సమాజంలో ప్రశాంతంగా బతుకుతారని ఆశించడం పిచ్చితనమే.
ప్రముఖ విద్యా రంగ నిపుణుడు వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఇలాంటి ఒక అనుభవాన్ని సోషల్ మీడియాలో గత వారం పంచుకున్నారు. తన పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అందుబాటులో ఉన్న ఇంటర్ నెట్ లో ఎక్కువగా దయ్యం సినిమాలు చూసి, ఆ ప్రభావంతో తన చుట్టూ నాలుగు దయ్యాలు ఉన్నట్లు ఫీలవుతూ, దయ్యం పూనిన మనిషిలా ఊగిపోతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం గురించి అయన రాసిన వ్యాసం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
శృంగార సమస్యలకు పరిష్కారమైన వయాగ్రా పిల్స్ ఆన్లైన్ ఛాలెంజ్ పేరుతో ఫ్రూట్ జ్యూస్లో కలిపి తాగి ఆసుపత్రి పాలైన 13 మంది విద్యార్థుల వార్త కలవరం కలిగించింది. కొలంబియా కుకుటాలోని సాన్ బార్టోలోమ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదివే 14-15 ఏళ్ల పిల్లలు ఈ పనికి పాల్పడ్డారు. వయాగ్రా ను భోజన విరామ సమయంలో జ్యూస్లో కలిపి తీసుకుని గుండె వేగంగా కొట్టుకోవడం వంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై స్పందిస్తూ- విద్యార్థుల తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పిల్లల కదలికలపై దృష్టి సారించాలని, వాటికి దూరంగా ఉంచాలని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది.
పిల్లల్లో టెక్నాలజీ ప్రేరేపిత పిచ్చి ప్రవర్తనకు విరుగుడుగా న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రాం (NLP)ను అమర్నాథ్ గారు వివరించారు. “మనం ఏదైనా అనవసర భయాన్ని ఊహించుకొని బాధితులుగా మారితే దాన్ని పోగొట్టడానికి చక్కటి శాస్త్రీయ పరిష్కారం న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం. కంప్యూటర్కు సాఫ్ట్ వేర్ ఎలా ఉంటుందో మన మెదడుకు కూడా అలాగే సబ్ కాన్షియస్ మైండ్ లో నిక్షిప్తమయిన ఆదేశాలు ఉంటాయి. అవి మనకు తెలియకుండానే మనలో ప్రవేశిస్తాయి . దాన్ని మార్చుకొనే శాస్త్రీయ విధానమే NLP,” అని అయన చెప్పారు.
ఆ పదేళ్ల పాప సబ్ కాన్షియస్ మైండ్లోకి దెయ్యం అనే కాన్సెప్ట్ వెళ్ళిందన్నది స్పష్టం. పిచ్చి బొమ్మలు, బూతు క్లిప్పుల ప్రభావంతో బుర్ర ఖరాబై పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటికే పలు రకాల లైంగిక దాడులతో పెద్ద సంఖ్యలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో క్రమం తప్పకుండా సర్వేలు నిర్వహించి భావి తరాన్ని ఆదుకునేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్న స్పృహ మన పిచ్చి ప్రభుత్వాలకు ఎటూ లేదు. అందుకే, తల్లిదండ్రులు, అధ్యాపకులు పూనుకుని టెక్నాలజీని మంచికి ఎలా వాడుకోవాలో అవగతమయ్యేట్లు బోధించడంపై దృష్టిపెట్టాలి. అదనపు క్లాసులతో అయినా సరే ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. లేకపోతే, మానసికంగా స్వచ్ఛంగాలేని తరంతో కుటుంబాన్ని, సమాజాన్ని పాడుచేసి వాళ్ళం అవుతాం.
కుటుంబ సభ్యుల పట్ల పిల్లలు మెలిగే/మాట్లాడే విధానాన్ని పేరెంట్స్, తోటి విద్యార్థినీ విద్యార్థులతో ప్రవర్తించే తీరును టీచర్లు నిశితంగా గమనించి ఎప్పటికపుడు చర్యలు తీసుకోవడం తక్షణావసరం. పిల్లలతో ఎక్కువ సేపు గడపడం, వారి స్నేహితుల గురించి తెలుసుకోవడం, వారు తరచూ పోవాలని అనుకునే ప్రదేశాలను గమనించడం కూడా గార్డియన్స్కు ముఖ్యం. సిలబస్కు మాత్రమే పరిమితమై, పిల్లలు ఏమైతే మనకేమిటని ఉపాధ్యాయులు భావిస్తే దేశానికి చాలా నష్టం జరుగుతుంది. పిల్లలు వాడిన ఫోన్ లో అప్పుడప్పుడు సెర్చ్ హిస్టరీ లోకి వెళ్లి చూడడాన్ని తప్పుగా భావించాల్సిన పనిలేదని నిపుణులు కూడా చెబుతున్నారు. పిల్లల్ని ప్రతి క్షణం ఒక కంట కనిపెట్టుకుని ఉండడం అసాధ్యమే అయినా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ఆన్ లైన్ బిహేవియర్ పట్ల చాలా జాగ్రత్త వహించాలి. బీ కేర్ ఫుల్.
.. డాక్టర్ ఎస్. రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు

.

Discussion about this post