అనంతవిశ్వంలో ప్రతిబిందువూ కేంద్రమే అని ప్రబోధించిన అనిలాచలఋషి కథ ఇది.
నిశ్చలంగా నిద్రిస్తున్న వ్యక్తి కలలో మరో ప్రపంచాన్ని సృష్టించుకుని నడయాడుతున్నట్టు.. అచలరూపుడైన పరమేశ్వరుని సంకల్పపరంపరయే ఈ బ్రహ్మాండగోళములుగా మహా సృష్టి ఏర్పడింది. జగత్తు యావత్తు శివుని సంకల్పరూపమే. శివుడు మెలకువతో కనే కలే ఈ ప్రపంచం.
ఒకే పరతత్త్వం- సంకల్పం లేనప్పుడు శివుడుగా ఉంటుంది. సంకల్పం ఉన్నప్పుడు పార్వతిగా ఉంటుంది. ఆ శివుడే అనిలాచలశివుడుగా శ్రీకాళహస్తిలో కొలువై ఉన్నాడు. ఆ పార్వతే జగత్తుగా… జగత్తులో… జ్ఞానప్రసూనాంబిక పేరుతో క్రీడిస్తోంది.
ఆపదలోకి త్రోయడం.. ఆపద నుంచి రక్షించడం.. ఆ క్రీడలో భాగమే.
అజ్ఞానానికి గురి చేయడం.. దానిని తొలగించడానికి జ్ఞానప్రబోధం చేయడం.. ఆ క్రీడలో భాగమే.
మంచి-చెడుల తక్కెడలను అటు ఇటూ సమాంతరంగా లేనట్లు.. మళ్లీ ఉన్నట్లు సరిచూసుకుంటూ ఉండడం.. ఆ క్రీడలో భాగమే.
ప్రతిజీవి కర్మఫలాన్ని ప్రతిజీవికీ సరాసరిన పంచుతూ ఉండడం.. ఆ క్రీడలో భాగమే.
అవతరించడం.. అనుగ్రహించడం.. ఆగ్రహించడం.. అంతం చేయడం.. ఆ క్రీడలో భాగమే.
ఆ క్రీడలో “ఎందుకు” అనే ప్రశ్నకు తావులేదు. యెందుకంటే అది క్రీడ కాబట్టి. క్రీడలో గెలుపు ఓటములు రెండూ వినోదమే కాబట్టి.
ఆ క్రీడలో భాగంగానే.. సకల నామరూపాలూ తానే అయినప్పటికీ జ్ఞానప్రసూనాంబిక 1942 ఆగస్టు 24 న శ్రీకాళహస్తిలో ఓ మారుమూల గ్రామంలో “సుబ్రహ్మణ్యం” అనే ప్రత్యేక నామంతో, ప్రత్యేక రూపంతో వ్యక్తమయ్యింది. శ్రీకాళహస్తి రమణసత్సంగంలో ఓ గురువుగా తనను తాను జ్ఞానరూపంలో ప్రకటించుకుంటోంది. ఆ జ్ఞానప్రసూలన్నింటినీ బాబు అనే జ్ఞానశిశువు ఏరుకుని గ్రంథస్తం చేసి జ్ఞానాంబప్రేమను లోకానికి పంచాడు..
వారు నడయాడిన శ్రీకాళహస్తి క్షేత్రం మరింత తేజోవంతమై ఆర్తులనే దీపపు పురుగులను తన వైపుకు ఆకర్షింపజేసుకుని జ్ఞానాగ్నిలో వారి సంస్కారబీజములను దహింపచేస్తోంది. దీపం దీపపు పురుగులను ఆహ్వానించదు. సముద్రం నదులను ఆహ్వానించదు. గురువు జ్ఞానప్రబోధానికై యెవర్నీ ఆహ్వానించడు. ఎవరికివారే.. స్వచ్ఛందంగా ఆకర్షింపబడి వారి పాదాల వద్ద వాలిపోతుంటారు. వారి దివ్యపాదారవిందం శక్తికేంద్రం. అజ్ఞాన తిమిరాన్ని మ్రింగే జ్ఞానకేంద్రం.
‘ఇక్కడకు వచ్చి అనుగ్రహం పొందటం కాదు. నా అనుగ్రహం పొందినవాడే నా గడప దాటి రాగలడు..’
అని ముక్తి పొందాలని వచ్చిన అతిథులకు తక్షణమే అభయమిస్తారు. ఇక్కడ పొందలేనివాడు ఎక్కడా పొందలేడు.
“నేను” ఉన్నచోటే క్షేత్రం.
“నేను” అన్నమాటే వేదం.
అని భరోసా ఇస్తారు గురువుగారు..
ముక్తి కూడా వద్దు.. మీ పాదాలపై భక్తి ఒక్కటి చాలు. అని నిశ్చింత అవుతారు సందర్శకులు.
* * *
వారి అనుగ్రహభాషణం పుస్తకరూపం దాల్చాయి. వాటిల్లో కొన్ని- అనిలాచలశివమాల, జయశ్రీ రమణ, గీతామృతం, మౌనభాషణం, దేవీప్రసాదం, పరమపదం, ఇప్పుడు ఇక్కడ ఇలా, సరాసరి, భగవదిచ్ఛ మొదలైనవి. మొత్తం ఇప్పటివరకూ 26 గ్రంథాలు అచ్చు అయినాయి. ఈ గ్రంథాలన్నీ స్వస్వరూపాన్ని జ్ఞప్తికి తెచ్చే జ్ఞానగుళికలు….
* * *
‘సముద్రమంత దుఃఖం- బిందువంత సుఖం’ అంటాడు బుద్ధుడు. ఆ బిందువంత సుఖాన్ని కూడా సుఖం అని అనుకోనక్కర్లేదు. దుఃఖమే రెండు భాగాలుగా ఉంది. దుఃఖంగా, సుఖంగా. తక్కువ దుఃఖాన్నే సుఖం అనే పేరుతో వ్యవహరిస్తుండేది మనం.
* * *
తనకు సుఖం కాదు, తానే సుఖం అంటారు గురుదేవులు. తానేసుఖం అనేది మరచి, తనకు సుఖం అంటూ ప్రాకులాడుతున్నాడు మనిషి. తనకు తానై తగిలించుకున్న బంధాలే ఇవి. తనకు తానై పెంచుకున్న వ్యవహారాలే ఇవి. అవి కొంత, ఇవి కొంత చేరి సముద్రమంత అయ్యింది. దాన్నుంచి తరించడానికి (దాటడానికి) తగిన నావ(గురుబోధ)కై ప్రజ ఆర్తితో ప్రార్థిస్తుంది. అవసరమైన వేళలో.. అవసరమైన చోటులో గురువులు అవతరిస్తూనే ఉంటారు. సమాధానపరుస్తూనే ఉంటారు. సమాధానపరచడానికి అవతరించిన అలాంటి సద్గురువులలో ఒకరు – సద్గురు సుబ్రహ్మణ్యం.
* * *
ఆర్తులను ఓదార్చడానికి జిజ్ఞాసువులకు సమాధానమివ్వడానికి వారు సామాన్యుల వలె.. ఇంకా చెప్పాలంటే- దాసులకు దాసుడు వలె తన భక్తులకు, శిష్యులకు ప్రేమతో దాస్యం చేస్తారు.. తల్లి తన చంటిబిడ్డకు చేసినట్లు. వారు జ్ఞానాంబావతారులు. వారి సన్నిధిలో ఉన్నవారందరూ జ్ఞానశిశువులు..
వారి ఘనత్వం పైన కూర్చోవడంలో కాదు, ‘పరమపదం’ పటాన్ని పైన పెట్టి, శిష్యులలో ఒకడుగా క్రింద కూర్చోవడంలోనే ఉంది వారి ఘనత్వం.
‘తనను తాను తగ్గించుకునువాడు తనను తాను హెచ్చించుకొనును’ అన్న క్రీస్తు వాక్యం గుర్తుకువస్తోంది.
‘అణగి మణగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు’ అన్న తుకారాం పాట గుర్తుకువస్తోంది.
వారి నిరాడంబరత్వం, సాధారణత్వం, సహజత్వం, ఆ కలుపుగోలుతనం, చెదరని చిరునవ్వు.. అలా వారిలో చూసి మురిసిపోవల్సిందే తప్ప.. కనీసం అనుకరించడం కూడా మనకు కుదరదు అనిపిస్తుంది.
ఏ మాత్రమూ నిలకడ స్వభావము లేని నేను వారి సహచర్యంలో ఇన్నేళ్లు గడిపానంటే అది వారి గొప్పతనమేగాని నాది కాదని అనిపిస్తుంది. అంతగా చేరదీస్తారు శిష్యుల్ని. చాపలు పఱచి, మంచినీళ్లు చెంబు పెట్టి, ఫ్లాస్కు నిండా టీ పెట్టి.. శిష్యుల రాక కోసం గేటు వైపు పలుమార్లు చూస్తూ యెదురు చూసే వాత్సల్యమూర్తి గురువుగారు.
దోషాల్ని అస్సలు పట్టించుకోరు. సవరించాలనిగానీ, సంస్కరించాలనిగానీ అస్సలు అనుకోరు. మనకు తెలియకుండానే వారి సన్నిధిలో మన దోషాలు సవరించబడతాయి.. లేదా రూపుమాపబడతాయి.. అదే సద్గురుబోధామృత మహిమ.
పైసా కూడా ఖర్చుపెట్టని లోభిని కూడా వారు విమర్శించరు. “పై వాడి అనుమతి” లేనిదే వాడు మాత్రం ఏం చేయగలడు పాపం..! అంటూ ఆ లోభిని కూడా వెనకేసుకొచ్చే కరుణామయులు వారు.
అలా ఉండొద్దు. ఇలా ఉండు. అని నా 30 ఏళ్ల వారి సహచర్యంలో ఒక్కసారి కూడా వారి నోట ఆ మాట వినలేదు.
వారు ఉంటారు.. అంతే.
వారు చూస్తారు.. అంతే.
దేనికీ ప్రతిస్పందించరు.
అడిగితే చెబుతాడు. లేకుంటే ఊరకుంటాడు..
జ్ఞానప్రసూనాలన్నీ అడిగినవారికి చెప్పబడినవేగానీ వారికి వారై చెప్పినవి ఏవీ లేవు అనాలి.
వారిని చాలామంది తరచూ అడిగే ప్రశ్న – బ్రహ్మానుభూతిని పొందాలంటే ఏం చేయాలి? అనేదే. ‘నేను బాబు-బాబు’ అనుకుంటున్నావు. ఇక నుంచి ‘నేను బ్రహ్మము-బ్రహ్మము’ అనుకో అంటారు. అనుకుంటే సరిపోతుందా? అని అడిగితే, అవును.. సరిపోతుంది.. అని కరాఖండితంగా చెబుతారు.
నేను బాబు అనే అబద్దాన్ని అనుకుని అనుకుని నిజం చేసుకున్నావు. నేను బ్రహ్మమును అనే నిజాన్ని ఎందుకు అనుకుని అనుకుని ఎందుకు నిజం చేసుకోలేవు? అని అడుగుతారు గురువుగారు.
* * *
గంధానికి గంధం పూయగలమా? నీటిని పలుచన చేయగలమా? ఆకాశాన్ని విస్తరింప చేయగలమా? అవి అంతే. గురుతత్త్వం కూడా అంతే. వారి నోటి నుండి పలుకబడే పరమతత్త్వం యొక్క సౌందర్యం కూడా అలాంటిదే. ఇక దానిని ఏ మార్పులూ చేయలేం. దానికి ఏ సొబగులూ అద్దకుండా ఉన్నదానిని ఉన్నట్టుగా స్వీకరించగలిగితే చాలు. ఇక దానిని వ్రాసుకోవడమో, భాషాపరమైన సొబగులు అద్దడమో చేస్తే ఆ సహజమైన సౌందర్యాన్ని దూరం చేసుకున్నవారమవుతాము.
జ్ఞానేశ్వరులు అన్నట్టు- బంగారునగకు వెండి పూత పూయడమే అవుతుంది. కానీ వ్రాయడమే స్వభావముగా కలిగిన “బాబు” అనే ఓ శిష్యుడు వారి వాక్యాలను ఏరుకుని, వ్రాసుకుని వాటిని గ్రంథరూపంగా వెలువరించాడు. కానీ ఆ గ్రంథం కంటే వారి ప్రత్యక్ష సన్నిధే గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇది కేవలం వారి సన్నిధికి చేర్చే చిరునామా మాత్రమే అంటాడు బాబు తను వ్రాసిన గ్రంథాల గురించి.
బజారులో దొరికే సీసాతేనెను కొని తెచ్చుకోవలసిన దౌర్భాగ్యంగా కాకుండా నేరుగా పువ్వులవద్దకు వెళ్లి మకరందాన్ని ఆస్వాదించే భ్రమరం వలె సద్గురు సన్నిధి చేరి.. జ్ఞానప్రసూనాల్లోని తత్త్వామృతాన్ని జుర్రుకోండి. అంటాడు బాబు.
* * *
గురువుగారికి ఎంతోమందిశిష్యులున్నారు. అలాంటప్పుడు ‘మా గురువు’ అని కాకుండా
‘నా గురువు’ అని ఈ పుస్తకానికి పేరు పెట్టడం సరియేనా? అని అడిగారొకరు. సరియే.
ఒక గురువుకు 12 మంది శిష్యులున్నప్పుడు, ఆ 12మందికి 12 మంది గురువులున్నట్లే. పైకి అందరికీ కలిపి ఒకే గురువున్నట్టు కనిపించవచ్చుగాక, కాని ఎవరి గురువు వారికే, ఎవరి అవగాహన వారిదే.
‘నా గురువు’ అని నేను అన్నప్పుడు ‘గురువు’ అనే అద్దంలో నేను దర్శించిన నా స్వరూపమే. ఎవరు ఎవరి గురించి వ్రాసినా సరే, అది తన గురించి తాను ఆవిష్కరించుకోవడమే అవుతుంది. ప్రతి రచనా రచయిత యొక్క అనుభవపు ఆవిష్కరణయే. లేకుంటే ఇన్ని రామాయణాలు, ఇన్ని భగవద్గీతలు ఉండేవి కావు.
“మొల్ల రామాయణం” చదివితే రామాయణాన్ని మొల్ల ఏ మాత్రం అర్థం చేసుకున్నది అనే విషయం మాత్రమే అర్థమవుతుంది. “వినోభా భగవద్గీత” చదివితే భగవద్గీతను వినోభాభావే ఏ మాత్రం అర్థం చేసుకున్నాడు అనే విషయం మాత్రమే అర్థం అవుతుంది. అలా నేను “నా గురువు” అనే రచన ద్వారా
గురువును బాబు ఏ మాత్రం అర్థం చేసుకున్నాడు అనేది మాత్రమే అర్థం అవుతుంది.
అంతేగాని పూర్తిగా గురుస్వరూపాన్ని బాబు చెప్పేశాడు అనికాదు. యెవరికి వారు సద్గురు సన్నిధి చేరి గురుతత్త్వాన్ని అనుభవించాలేగాని, ఏ ఒక్కరు వ్రాసిన పుస్తకమూ పరమప్రమాణం కాదు. చదవొచ్చు.. కాలక్షేపంగా. కానీ నీ స్వానుభవమే నీకు పనికొచ్చే పుస్తకం. అందుకే మన పెద్దలు పురాణ కాలక్షేపం.. హరికథాకాలక్షేపం.. అన్నారు. అన్నీ కాలక్షేపాలే.. నీకు పనికొచ్చేది నీ జీవితానుభవగ్రంథమే.
* * *
సముద్రపు నీటిని దోసిళ్లలో పట్టగలమే గానీ మొత్తం సముద్రాన్ని దోసిళ్లలో పట్టలేం.
గురుచరిత్ర యెవరు వ్రాసినా అంతమాత్రమే..గురుచరిత్ర వ్రాయడం గురువుకు కూడా సాధ్యం కాదు అన్నారు గురువుగారు ఓసారి. మరెందుకు మీరు వ్రాయడం అంటారేమో.. ‘రామాపురం పోవుదారి’ అనే సూచికబోర్డు రామాపురానికి దారి చూపిస్తుంది. అలా గురుచరిత్ర గురువు వద్దకు చేరుస్తుంది. అలా దేశ నలుమూలల నుండి గురుదర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ “మా జన్మ ధన్యమయ్యింది” అన్న తృప్తితో తిరిగి వెళ్లినవారేగాని, ఎవరూ లోటుతో వెళ్లలేదు.
గురువు ఇచ్చినట్టూ కనబడదు, భక్తులు తీసుకున్నట్టూ కనబడదు గానీ
తమకే తెలియని ఏదో వెలితితో ఉంటారు ప్రతి ఒక్కరూ.. సద్గురు సన్నిధిలో ఆ వెలితి పూడిపోయినట్లు అనుభూతి కలిగి ఆనందంతో తిరిగి వెళుతుంటారు.
“నా గురువు” అనే రచన చదివి, “బాబు గురువు” గా కాకుండా, మీరు కూడా గురువుచెంత చేరి.. “నా గురువు” అని అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను..
– జ్ఞానశిశువు
9533667918

.

Discussion about this post