మరణం అనివార్యం. ఏం చేసినా కూడా అది మనల్ని పలకరించకుండా ఆపలేం. కానీ.. దాని గురించి మనం చాలా నెగటివ్ అభిప్రాయాలను కలిగి ఉంటాం. చావు తప్పనిసరి అయినప్పుడు.. దానికి తోచినప్పుడు అది వస్తుంది- దాన్ని గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోవడం దండగ అనే అభిప్రాయం మనకు ఎఫ్పుడూ ఏర్పడదు.
మరణానికి భయపడుతుంటాం. మరణాన్ని ఆమోదించలేని, స్వీకరించలేని వ్యథలో కుములుతూ ఉంటాం. విశ్వప్రయత్నం చేసినా సరే ఓడించలేని శత్రువుతో స్నేహం చేసుకోవడానికి మించిన పరిష్కారం ఉండదు. మరణాన్ని శత్రువుగా పరిగణించడమే పెద్ద తప్పు. ఒకవేళ అలా పరిగణించినా సరే.. దాన్ని మనం జయించలేం గనుక.. ఆమోదించ గలగాలి.
ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే.. మరణం గురించిన భయం మనల్ని వెన్నాడుతుండడం సంగతి తర్వాత.. కానీ వాస్తవంలో మరణం పలకరించేలోగా.. మనం చాలా చాలా జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. మనం అనుకునే మరణం కాకపోవచ్చు గానీ.. జీవితకాలం పూర్తయ్యేలోగా మనం చాలా రకాలుగా మరణిస్తూ ఉంటాం. మరణం అనేక రకాలుగా మనల్ని వరిస్తూనే ఉంటుంది. అవన్నీ కూడా మనం కోలుకోగలిగే మరణాలు. చిట్టచివరగా వచ్చేది మాత్రం మనం పరిగణించే మరణం.
మరణంతో సమానమైనది ఏమిటో.. ఓ సుభాషితం మనకు వివరిస్తుంది.1
చితా చింతా సమ హ్యుక్తా బిందు మాత్ర విశేషతః
సజీవం దహతే చింతా నిర్జీవం దహతే చితా
చితికి, చింత కు మధ్య ఉండే వ్యత్యాసం చాలా చిన్నది. మరణించిన తర్వాత చితి మనల్ని దహించేస్తుంది. చింత అనేది జీవించి ఉండగానే దహించేస్తూ ఉంటుంది. – అనేది శ్లోకభావం.
చింత కూడా మరణం (చితి)తో సమానమే అని చెబుతుంది ఈ సుభాషితం. నిత్యజీవితంలో మనల్ని అనేక రకాల చింతలు పట్టిపీడిస్తుంటాయి. ఏ విషయంలోనైనా మనకు దక్కిన దానితో సంతృప్తి చెందకపోవడం దగ్గరినుంచి చింత మొదలవుతుంది. మన శక్తి సామర్థ్యాల పరిధిలో లేని దాని గురించి ఆశపడడం దగ్గరినుంచి చింత మొదలు అవుతుంది.
ప్రతి మనిషికీ అనేక రకాల చింతలుంటాయి. అర్హతలతో నిమిత్తం లేకుండానే ఆ చింతలు ఉంటాయి. అవి వారిని నిత్యం వెన్నాడుతుంటాయి. ‘చింత’ అనేది దాని తీవ్రతను బట్టి.. మనిషి సగటు వివేచనను, స్వాభావికమైన విచక్షణను చంపేస్తుంటుంది. ఒకసారి మనిషిగా, విచక్షణ, వివేచన కోల్పోయిన తర్వాత.. ఎన్ని రకాల అడ్డదారులైనా మనం తొక్కుతాం. దానికి తగ్గట్టుగా అందమైన ఆత్మవంచనను కూడా తయారుచేసుకుంటాం. ఇలాంటి అనేక రకాల పెడపోకడలకు ప్రధానంగా ఉండగల మూల కారణాల్లో చింత కూడా ఒకటి.
అందుకే చింత- అనేది మరణంతో సమానంగా ఈ సుభాషితం అభివర్ణిస్తుంది. చింతిస్తూ కూర్చోవడం అనేది, చింతలోనే గడపడం అనేది, ఆ రూపేణా మనిషికి ఉండవలసిన చైతన్యాన్ని కోల్పోవడం అనేది మరణంతో సమానమే.
చింత దరిచేరకుండా బతకడానికి మనం యోగులం, రుషులం కాదు. దరిచేరిన చింతనుంచి వీలైనంత త్వరగా బయటపడడం.. ఆ చింత ఉపశమించే పనులు చేయడం, అధిగమించడం మనలోని జీవలక్షణం అవుతంది. చింతను వదిలించుకోకపోతే.. మరణించినవాడితో సమానం అవుతాం.
శుభోదయం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post