‘‘ఏది పుణ్యం ఏది పాపం / ఏదినరకం ఏది నాకం / ఏది సత్యం ఏదసత్యం… ఓ మహాత్మా.. ఓ మహర్షీ’’ అంటూ మహాకవి శ్రీశ్రీ కూడా తన సందేహాన్ని స్పష్టంగానే వెలిబుచ్చాడు. ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియని, తేల్చుకోలేని మీమాంస ఆయనను కూడా వెన్నాడినట్టుంది. అందుకే ఆయన ఇలాంటి సందేహాలతో సందిగ్ధాలతో ఓ కవిత రాసుకున్నాడు.
ఏది సత్యం అనేది ఎప్పటికీ పెద్ద ప్రశ్న? ఉన్నదున్నట్టుగా చెప్పేయడమేనా? కొంత దాచి చెప్పడమా? ఉన్న విషయాన్ని షుగర్ కోటెడ్ గా చెప్పడమా? ఇలా రకరకాల సందేహాలు మనకు కలుగుతాయి. ఎఫ్పుడూ కలుగుతూనే ఉంటాయి.
సర్వధర్మ కోవిదుడని మనం అనుకునే ధర్మరాజు కూడా నిజమో అబద్ధమో కుట్రో కూహకమో మనకు ఇప్పటికీ క్లారిటీ లేకుండా ఒక నిజం చెప్పేసి.. తన జీవితానికి ఒక మచ్చ తెచ్చుకున్నాడు.
నిజం- అబద్ధం అనే పదాలకు ప్రతి ఒక్కరూ తమ తమ అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త కొత్త నిర్వచనాలు, భాష్యాలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. సత్యం అనేది నిత్యం రూపం మార్చుకుంటూనే ఉన్నది.
కానీ.. సత్యం గురించి నారదుడు చెప్పిన నిర్వచనం ఒకటి ఉంది. దీనిని మనం ప్రమాణంగా భావించవచ్చు కూడా..
సత్యస్య వచనం శ్రేయః సత్యాదపి హితం వదేత్
యద్భూత హిత మత్యంతమ్ ఏతత్ సత్యం మతం మమ
నిజం చెప్పడం ఎప్పటికీ మంచిది. అభిలషణీయమైనది. దానికంటె కూడా.. నలుగురికీ ప్రయోజనం కలిగించే సంగతిని చెప్పడం చాలా మంచిది. నా దృష్టిలో (ఇది నారదుడి వాక్యం) ఏ విషయమైతే విస్తృత ప్రజా హితాన్ని కలిగి ఉంటుందో.. అదే సత్యం!
నారదుడు చెప్పిన ఈ నిర్వచనం ఆచరించదగినది. మనం చాలా సందర్భాల్లో చిన్న చిన్న అబద్ధాలు చెబుతూనే ఉంటాం. అవి సరదా అబద్ధాలని సమర్థించుకుంటూ ఉంటాం. కానీ.. ఏది నిజం అనే విషయంలో.. ఈ నిర్వచనం మనకు ఒక తృప్తి నిస్తుంది. నలుగురికీ మంచి జరుగుతుంది అనుకుంటే.. అదే నిజం. అయితే, అందుకోసం కల్పించి అబద్ధం చెప్పకూడదు. నిజమే అయినప్పటికీ.. దానివలన ఎవ్వరికీ ఎలాంటి ప్రయోజనం లేదని అనిపించినప్పుడు, చెప్పాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.
శుభోదయం
.

Discussion about this post