తెలుగు రాజకీయ దిగ్గజం, వర్తమాన రాజకీయ నేతలందరిలోనూ పెద్దమనిషి, రాజనీతిజ్ఞుడు కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు.
88 ఏళ్ల వయస్సున్న రోశయ్య నిద్రలోనే కన్నుమూశారు. శనివారం ఉదయం తెల్లవారాక ఆయన నిద్రలేవకపోయే సరికి అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే సరికి.. అప్పటికే మరణించినట్లుగా తెలుస్తోంది.
లోబీపీ కావడంతో స్టార్ ఆస్పత్రికి తీసుకువెళ్లారని, మార్గమధ్యంలోనే మరణించారని కూడా వినిపిస్తోంది.
కొణిజేటి రోశయ్య వర్తమాన తెలుగు రాజకీయాలలో మేరునగ సమానుడు. తెలుగు రాజకీయాలలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా.. అన్ని రకాల పదవులనూ నిర్వహించి.. ప్రతి చోటా కూడా అత్యంత సమర్థుడిగా పేరు తెచ్చుకున్న నాయకుడు కొణిజేటి రోశయ్య.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 16 సార్లు వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య చరిత్ర సృష్టించారు. ఆర్థికమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.
ముఖ్యమంత్రిగా
వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.
ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి.. ఆయన స్వయంకృషి, ప్రతిభతోనే ఆయన అన్ని ఉన్నతస్థానాలకు ఎదిగారు.
1968-85: శాసనమండలి సభ్యుడు.
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత.
1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
2009 సెప్టెంబరు – 2010 నవంబరు 24: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు.
.
Discussion about this post