చిత్తూరు జిల్లా పై నివర్ తీవ్ర ప్రభావం
వాగులో వ్యక్తి గల్లంతు – ఇద్దరు రైతులను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
పలు చోట్ల రాకపోకలు బంద్
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ తీరం దాటిన సందర్భంగా చిత్తూరు జిల్లా తూర్పు మండలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.విపరీతమైన గాలులు వీస్తుండడంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలతో మల్లి మడుగు, ఆరణియార్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు.
రేణిగుంట, ఏర్పేడు, వరదయ్యపాలెం, సత్యవేడు, వెదురుకుప్పం తదితర మండలాల్లో వాగులు కాలువలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. రేణిగుంట మండలం కుమ్మరి పల్లి లో ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. వారిలో ప్రసాద్ అనే వ్యక్తి గల్లంతు అయ్యారు. మరో ఇద్దరు లోకేష్, వెంకటేష్ ఒక చెట్టును పట్టుకొని కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. పోలీసులు రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
మామండూరు వద్ద చెట్లు విరిగిపడడంతో తిరుపతి కోడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలలో భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండడం తో గోగర్భం డాం గేట్లు అధికారులు ఎత్తివేశారు. రెండో ఘాట్ రోడ్లు కొండచరియలు విరిగిపడడంతో ఒక వాహనం స్వల్పంగా దెబ్బతింది. తిరుమలలో పలుచెట్లు కొమ్మలు విరిగిపడడంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సప్తగిరుల్లో లోని జలపాతాలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరంగరాజపురం మండలంలో వాగులు, వంకలు ప్రవహిస్తూ ఉండటంతో 18 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. సత్యవేడులో లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు 400 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు అధికార యంత్రాంగం తరలించింది. శ్రీకాళహస్తి మండలం లో రెండు చెరువులకు గండ్లు పడ్డాయి. తుఫాన్ ప్రభావం మరో 24 గంటలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
.

Discussion about this post