తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్టానాన్ని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఆయన ఈ విధంగా అధిష్టానానికి తెలియజేశారు.
పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి గెలిచే నేతలు లేకపోవడం వల్ల ఆ పార్టీ తెలంగాణలో గెలవడానికి వ్యూహాత్మకంగా పథకాలు రూపొందిస్తోందని ఆయన అన్నారు.
ఈ నేపధ్యంలో తెరాస, ఎంఐఎం పార్టీలను పరోక్షంగా బిజెపి పార్టీ వాడుకుంటుందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బలమైన నాయకత్వం వున్న కాంగ్రెస్ పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి, మార్చి నెలల్లో రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు పార్టీ ఎంతో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా వుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం జానారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ సాటును గెలుస్తుందనే ధీమాను జగ్గారెడ్డి వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితులలో పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా అధిష్టానం ఏ పేరైతే అనుకుంటుందో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చే వరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగిస్తూ, ఉప ఎన్నికల తరువాతే నూతన పీసీసీపై నిర్ణయం తీసుకుంటే బాగుంటాదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. ఈ విషయంలో అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా జగ్గారెడ్డి కోరారు.
.

Discussion about this post