ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ పెద్ద సవాలునే విసిరారు. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా తన పార్టీగత రాజకీయ అనుబంధాలను కూడా లెక్కచేయకుండా తన గళాన్ని గట్టిగానే వినిపిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు బంతిని జగన్మోహన్ రెడ్డి కోర్టులోకి నెట్టారు.
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం ఆదివారం తిరుపతిలో జరగనున్న నేపథ్యంలో, ఆ వేదిక మీద ఈ సమస్యను ప్రస్తావించాలని, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తేవాలని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రికి సూచిస్తున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించడానికి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముఖ్య వేదికగా ఉపయోగపడుతుందని జనసేన భావిస్తోంది. ఆదివారం తిరుపతిలో జరిగే ఈ సమావేశంలో.. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే భావోద్వేగంతో ఈ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముడిపడి ఉందో, 32 మంది ప్రాణ త్యాగాలతో ఈ పరిశ్రమను ఎలా సాధించుకున్నదీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియచేయాలని, ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి సద్వినియోగపరచుకోవాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానాన్ని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలని, అక్కడ అన్ని పక్షాలతో తమిళనాడు ప్రభుత్వం చర్చించిందని ఆయన తెలియజెప్పారు. అదే తరహాలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూసేందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా ముందుకురావాలని సూచించారు.
కేంద్రం ఇష్టానికి వ్యతిరేకంగా ఒక డిమాండ్ ను హోంమంత్రి అమిత్ షా ఎదుట పెట్టేంత చొరవ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపణ అయింది. ఇలాంటి నేపథ్యంలో ఆదివారం నాటి సమావేశం సందర్భంగా.. ముఖ్యమంత్రి ముందరికాళ్లకు బంధం వేసేలా పవన్ కల్యాణ్ దళం తమ గళం వినిపించడం విశేషం.
.
Discussion about this post