సంక్రాంతి పండగ వస్తోంది. సంక్రాంతి అనగానే.. అల్లుళ్ల పండగ అంటారు తెలుగు నేల మీద చాలా ప్రాంతాల్లో. సంక్రాంతి అనగానే మనకు పొంగళ్లు, పశువుల పండుగ, గతించిన పెద్దలను స్మరించుకోవడం.. కొత్త బట్టలు, పండగ ఉత్సాహం ఇవన్నీ గుర్తుకొస్తాయి. సంక్రాంతి అనగానే.. ధనుర్మాసం అంతటా సాగే వైభవం.. వాకిలి నిండుగా పెద్దపెద్ద ముగ్గులు.. గొబ్బెమ్మలు.. తెలుగుదనపు నిండైన శోభ స్మరణలోకి వస్తుంది. కోడిపందేలు, సరదా జూదాలు అతిథులతో విందు వినోదాలు.. పల్లెసీమలంతా నిండిపోయే కళ గుర్తుకొస్తుంది.
సంక్రాంతి అనగానే.. సైబీరియన్ కొంగల్లాగా బారులు కట్టి.. సొంతూళ్లకు తరలిపోయే చిన్నా పెద్ద వలసజీవులు గుర్తుకొస్తారు. సంక్రాంతి అనగానే.. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ నడుమ టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల పొడవున క్యూ కట్టిన వాహనాలు గుర్తుకొస్తాయి. సంక్రాంతి అనగానే.. ఆర్టీసీ/ ప్రెవేటు బస్సు సర్వీసుల్లో అడ్డదిడ్డంగా టికెట్ ధరలు పెంచేసి వడ్డించే దోపిడీ వ్యవహారం గుర్తుకొస్తుంది.
సరిగ్గా ఈ దోపిడీ దగ్గరే ప్రస్తుతం మన ఆలోచన ఆగిపోతోంది. లోతుగా చూసినప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ‘ప్రజల, పేదల సంక్షేమం కోసం’ అనే మాటతో.. ఊహకు కూడా అందని అనేకానేక పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. డబ్బులు పంచిపెడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఉచితంగా డబ్బు వచ్చి తమ బ్యాంకుఖాతాలో పడని కుటుంబాలను లెక్కతీస్తే.. చాలా స్వల్పంగా కనిపిస్తుంది. కానీ సంక్రాంతి వచ్చే సరికి ఆర్టీసీ బస్సు టికెట్లు ఆ రూపేణా జరిగే దోపిడీ విషయంలో మాత్రం ప్రభుత్వాలు పరస్పర భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.
సంక్రాంతి సందర్భంగా అందరూ సొంత ఊరికి వెళ్లాలని ఉబలాటపడతారు కాబట్టి.. అందరికీ సొంత వాహనాలు ఉండవు కాబట్టి.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బీభత్సంగా ఉంటుంది. ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచడం.. పండగ సీజన్ ముగిసిన తర్వాత.. పండగ సందర్భంగా ఆర్టీసీకి ఇంత ఆదాయం వచ్చిందంటూ.. తామేదో ఘనకార్యం సాధించినట్లుగా.. అన్నాళ్లూ సాగించిన దోపిడీని అధికారికంగా ప్రకటించుకోవడం ఒక రివాజుగా మారింది. ఈ ఏడాది కూడా అదే తరహా దోపిడీకి తెరతీశారు. అయితే ఏపీలో మాత్రమే ఆర్టీసీ ఆ దోపిడీ చేస్తోంది. తెలంగాణ మామూలు ధరలకే బస్సుసర్వీసులు తిప్పాలని నిర్ణయించింది. పండగకి ఊరెళ్లాలనుకునేవారికి గుండె ఠారెత్తాల్సిందే. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో యాభైశాతం టికెట్ ధరలు పెంచారు.
సినిమా టికెట్ ధరల పెంపుతో పోలిస్తే..
సరిగ్గా ఈ పాయింట్ దగ్గర.. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంతో పోల్చి చూడడం సబబు అనిపిస్తోంది. ఆర్టీసీ బస్సు టికెట్లు పెంచితే మాత్రం.. దాన్ని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. అదే రిలీజ్ రోజున, లేదా తొలి వారం రోజున సినిమా టికెట్ ధరలు పెంచితే అలా కుదరదంటూ అడ్డుకుంటుంది. ఏంటీ తమాషా!
సినిమా రూపేణా వినోదం పేద ప్రజల అవసరం అని వాదిస్తుంది ప్రభుత్వం. సంక్రాంతి పండగను సొంత ఊళ్లలో చేసుకోవాలని కోరుకోవడం.. పేద ప్రజల కనీస కోరిక కాదా? సంక్రాంతి సొంత ఊర్లకు వెళ్లే వాళ్లకు బస్సు సర్వీసులను ఉచితంగా నడపవచ్చు కదా! తిరిగివెళ్లేప్పుడు మాత్రం ‘రెగులర్’ చార్జీలు వసూలు చేయవచ్చు కదా! అంతగా పేదల మీద ప్రేమ ఉంటే..?
సినిమా- పేదల అవసరం అని ప్రభుత్వం అంటుంది గానీ.. నిజానికి సినిమా ఒక వ్యసనం. టికెట్లు పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతించినంత మాత్రాన ప్రతి సినిమాకూ టికెట్ పెంచుకోవడం ఉండదు. భారీ సినిమాలు మాత్రమే అలా ఎక్కువ ధరలకు అమ్ముతాయి. భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి.. ప్రమాణాల పరంగా పెద్దస్థాయి సినిమాలు తీస్తారు కాబట్టి.. ఆ మేరకు ఆర్థికంగా నష్టం రాకుండా ఉండడానికి ధరలు పెంచి అమ్ముకుంటారు. అందుకు ప్రభుత్వ అనుమతిని అడుగుతారు. ఆ మేరకు పెంచిన ధరల మీద కూడా ప్రభుత్వం పన్నులు వసూలు చేసుకోవచ్చు. అయితే.. సినిమా టికెట్ ధర పెంపు.. చివరివరకూ ఉండదు. రిలీజ్ సందర్భంగా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ‘రిలీజ్ అయిన వెంటనే సినిమా చూసేయాల్సిందే’ అనే అత్యుత్సాహం లేకపోతే గనుక.. ప్రభుత్వం చెబుతున్న పేదవాళ్లు అందరూ.. మామూలు ధరకే సినిమా చూడవచ్చు. సినిమా టికెట్ ధర పెంచే విషయాన్ని పక్కన పెడదాం.
రిలీజ్ డే అనేది సినిమాకు డిమాండ్ ఉన్న రోజు కాబట్టి.. ఆరోజు ధర పెంచి అమ్ముకోవాలనుకుంటే.. దోపిడీ అవుతుందని అంటున్న ప్రభుత్వం. సంక్రాంతి అనేది ప్రజలందరూ ఊర్లకు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలనుకునే సీజన్ కాబట్టి.. బస్సు టికెట్లు పెంచి దోచుకోవాలనుకోవడం కరక్టేనా? బస్సు టికెట్లు ధరలు పెంచడాన్ని ప్రభుత్వం ఏ రకంగా సమర్థించుకుంటుంది. నిజానికి ఆర్టీసీ వారి దోపిడీలో ఇంకా చాలా రకాలు ఉంటాయి. లగ్జరీ బస్ టికెట్లు భారీగా పెంచుతారు. లగ్జరీ టికెట్లు మాత్రమే అమ్ముతారు. కానీ.. తీరా ప్రయాణానికి బస్సుస్టేషన్ కు వెళ్లేసరికి.. ఏ పల్లెవెలుగు బస్సో సిద్ధంగా ఉంటుంది. లగ్జరీ బస్సులు చాలినన్ని అందుబాటులో లేవు గనుక.. ప్రయాణికుల్ని చేరవేయడానికి ఏదో ఒక బస్సు అందుబాటులో పెట్టినట్టుగా చెబుతారు. టికెట్ మాత్రం లగ్జరీ బస్సు ధర ఉంటుంది. ఇలాంటి అరాచకాలు, మోసాలు ఆర్టీసీ చాలా చేస్తుంది.
ప్రభుత్వం నడుపుతున్న సంస్థ సాగిస్తున్న దోపిడీ గనుక మనం ఆర్టీసీ గురించి చెప్పుకుంటున్నాం. ప్రెవేటు బస్సు ఆపరేటర్లు పండగ సీజన్లో వంద, రెండొందల శాతం టికెట్ ధరలు పెంచేసి దోచుకుంటారు. వారిని నియంత్రించే తెగువ ప్రభుత్వానికి ఉందా? వాటి సంగతి ఎందుకు పట్టించుకోవడం లేదంటే దాని అర్థమేంటి? ఒక దోపిడీదారు, మరో దోపిడీదారుణ్ని చూసి.. ఉపేక్షించడం, మిన్నకుండడం కాదా?
డిమాండ్ ను బట్టి ధర పెంచి దండుకోవడమే వ్యాపారం యొక్క ప్రథమ లక్షణం. డిమాండ్ ప్రవాహంలో కొట్టుకుపోకుండా తనను తాను నియంత్రించుకోగలిగితే.. ఏ పేదవాడు కూడా నష్టపోడు. ‘రిలీజ్ రోజే సినిమా చూడాలి’ అనుకోకుండా కంట్రోల్లో ఉంటే.. సినిమా అభిమాని ఏ రకంగానూ నష్టపోడు? ‘సొంతూరికి సంక్రాంతి రోజే వెళ్లాలి.. పండగ చేస్కోవాలి’ అనుకోకుంటే ఏ పేదవాడికీ బస్సుచార్జీల దోపిడీ పట్టదు. వాడు దోచుకోబడడు. దోపిడీ పరిధిలోకి రాడు! కానీ ఆ నియంత్రణ అందరికీ ఉండదు గనుకనే.. దోపిడీ సాగుతుంటుంది.
ఆర్టీసీ బస్సు టికెట్ పెంపు వ్యవహారం గమనించినప్పుడు.. ప్రభుత్వం తీరు ఎలా ఉన్నదంటే.. డిమాండ్ ను బట్టి బస్సు టికెట్ పెంచి దోచుకోవడం, దండుకోవడం మాత్రం వ్యాపార లక్షణం. అదే సమయంలో.. అదే డిమాండ్ సూత్రాన్ని అనుసరించి- సినిమా రిలీజ్ రోజు టికెట్ ధర పెంచి దోచుకోవడం మాత్రం.. అచ్చంగా దోచుకోవడమే! తాము పెంచేది వ్యాపారం.. ఇతరులు పెంచేది దోపిడీ! ఈ వ్యవహారం గమనిస్తున్నప్పుడు ఒక సామెత గుర్తుకొస్తుంది.. తాను చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం!
..కృష్ణమోహన్ దాసరి
డల్లాస్, యూఎస్ఏ

.

Discussion about this post