పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్ పి డి సి ఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఉదయమే కార్యాలయం వద్ద వందలాది మంది పోలీసులు మొహరిం చారు. సీఎం డి ని కలిసేందుకు వామపక్ష కార్యకర్తలు గేట్లు తోసుకుంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
పోలీసులు కార్యకర్తలను నిలువరించారు. ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నందుకు నేడు అదే ఫ్యాన్ కి ఉరి వేసుకోవాల్సిందే అంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ రాజన్న రాజ్యం నెలకొల్పు తా మంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మూడేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు.
దివంగత సియం వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే నేడు జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపారని పేర్కొన్నారు. కరోనా, కరువు, వరదలతో ఇప్పటికే ప్రజలు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచి మరింత భారం వేశారని అన్నారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి నేడు 30 యూనిట్ల నుండి ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణం పెంచిన ధరలు తగ్గించాలని లేనిపక్షంలో ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు కరెంట్ చార్జీలు పెంచారని తాము అధికారంలోకి వస్తే పెంచబోమని చెప్పి ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు.
Jiకరెంటు చార్జీలు పెంచి వామపక్షాల ఉద్యమానికి చంద్రబాబు నాయుడుకు ఏ గతి పట్టిందో జగన్ గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి. జనార్దన్ మాట్లాడుతూ నవరత్నాలలో కోత విధించేందుకే నేడు విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు. కరెంట్ బిల్లులు అధికంగా వచ్చిన వారికి రేషన్ కార్డు తో ముడి పెట్టి సంక్షేమ పథకాలలో అనర్హులుగా ప్రకటించడమే జగన్ తెర వెనక అజెండా అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, నగర కార్యదర్శి విశ్వనాధ్, రైతు సంఘం నాయకులు కుమార్ రెడ్డి, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ, రవి, రాజా, శివ, చంద్రశేఖర్ నాయుడు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, ఉదయ్, చలపతి, వై ఎఫ్ నాయకులు రామకృష్ణ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, ప్రమీల, శాఖా కార్యదర్శులు పద్మనాభరెడ్డి, రామచంద్రయ్య, సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, డివైఎఫ్ఐ నాయకులు జై చంద్ర, ఎస్ఎఫ్ఐ కార్య దర్శి మాధవరెడ్డి, ఐద్వా కార్యదర్శి సాయిలక్ష్మి సిఐటియు కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post