ఏ మనిషికైనా కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు, ‘దేవుడా! నాకే ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నావు? నేనేం పాపం చేశాను? నన్ను ఎలాగైనా ఈ బాధలు, కష్టాల నుంచి రక్షించు తండ్రి…! నా కష్టాలు తీరిస్తే నీకు మొక్కు తీర్చుకుంటాను’ అని గుడులు, గోపురాలు తిరుగుతుంటాడు.
సుఖాలు, సిరిసంపదలు కలిగినప్పుడు , ‘ఎందుకు నాకు ఇన్ని సుఖాలను, సిరిసంపదలను కలిగించావు? ఇది నీకు న్యాయమేనా? నేను ఏం పుణ్యం చేశానని నాకు ఈ భోగభాగ్యాలు కలిగించావు?’ అని ఎవరూ దేవుణ్ణి నిందించరు. ప్రశ్నించరు. ప్రార్థించరు. ఎందుకని?
ఎందుకంటే.. తనకు కష్టాలు, బాధలు కలిగినప్పుడు కారకుడు దేవుడని, సుఖాలు, సిరిసంపదలు కలిగినప్పుడు అవి నా స్వయంకృషితో సంపాదించాను అని మనిషి భావించడమే అందుకు కారణం.
అంటే.. బాధలను, కష్టాలను తొలగించమని, కోరికలు తీర్చమని వేడుకోవడం కోసమే మనం దేవుణ్ణి ప్రార్థించడానికి గుడికి వెళ్ళతాం తప్ప దేవుని కోసమే ఎవరూ గుడికి వెళ్ళరనేది నమ్మలేని నిజం.
కానీ, ఈ విషయాన్ని ఎవరూ అంగీకరించరు. ‘ మేం ఉపవాసాలు ఉంటాం. ధూప, దీప, నైవేద్యాలు పెడతాం. నిరంతరం గ్రంథ పారాయణాలు చేస్తాం. అందుకే మాకు భక్తి ఎక్కువ. మేం నిజంగా దేవుని కోసమే గుడికి వెళతాం’ అని వాదిస్తారు. ఈ వాదనలో కొంత నిజం ఉంది. అది ఏంటంటే.. ఉపవాసాలు ఉండడం, ధూప, దీప, నైవేద్యాలు పెట్టడం, భక్తి ఉండడం నిజమే కావచ్చు. కానీ, దేవుని కోసమే గుడికి వెళ్తాం అనేది మాత్రం నిజంకాదు.
ఎలాగంటే…
తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం కాలినడకన, బస్సుల్లో, కార్లల్లో చాలామంది భక్తులు వెళ్తుంటారు. అలా వెళ్ళిన భక్తులు క్యూలైన్లలో చేరుకున్నాక ఒక వార్త తెలుస్తుందని అనుకుందాం.

అది ఏంటంటే.. గర్భగుడిలో వున్న స్వామి వారికి ఎదురైన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా స్వామివారిలో ఐక్యమయిపోతూ మోక్షప్రాప్తి పొందుతున్నారనే వార్త క్యూలైన్లల్లో ఉన్నవారికి తెలిసిందనుకోండి. అప్పుడు భక్తులు అదే భక్తితో క్యూలైన్లలో ఉంటారా? లేక ‘మాకు మోక్షము వద్దు, గీక్షము వద్దు బతికుంటే చాలురా దేవుడా!’ అంటూ గేట్లు పగలకొట్టుకుని బయటపడతారా? అంటే… ఖచ్చితంగా క్షణాల్లో క్యూలైన్లలో జనాలు ఖాళీ అయిపోతారు. ఖాళీ అయిపోవడమే కాదు తిరుమల పరిసరప్రాంతాలలో నరమానవుడు ఎవరూ కనబడరు.
అంటే.. మనిషి దేవుని కోసమే గుడికి వెళ్తాడనేది ఎంత పచ్చి అబద్దమో, తన స్వార్థం కోసమే తప్ప ఎవరికోసమూ గుడికి వెళ్ళడనేది కూడా అంతే నిజం.
ఈ విషయం అక్షరాల సత్యమని చెప్పడానికి మా గురువుగారుకి తన నిజ జీవితంలో తటస్థించిన రెండు సంఘటనలను ఓ సందర్భంలో నాకు తెలియజేశారు.
సంఘటన 1 :
ఓరోజు.. మా గురువుగారికి చాలా ఏండ్ల తర్వాత తన బాల్యమిత్రుడు శ్రీకాళహస్తి పెండ్లిమండపం దగ్గర కనబడి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత..
“నాకు దేవుణ్ణి చూపించగలవా?” అన్నాడంట.
దానికి మా గురువుగారు..
“ఇప్పుడే చూపించాలా?” అని అన్నాడంట.
“అవును ఇప్పుడే చూపిస్తే మంచిది” అని ఆ మిత్రుడు చెప్తుండగా.. అంతలోనే ఆ మిత్రుడు ఎక్కవలసిన బస్సు ఆ ప్రదేశానికి వచ్చింది. అంతే వెంటనే.. “సుబ్రహ్మణ్యం దేవుణ్ణి తర్వాత చూపిస్తువులే. బస్సు వచ్చేసింది. నేను అర్జంటుగా వెళ్ళాలి” అని బస్సు ఎక్కబోయాడు అతను. అంతే మా గురువుగారు అతని చేయి పట్టుకుని..
“దేవుణ్ణి చూపించమని అడగడం, బస్సు వస్తే వెళ్ళడం నీ ఇష్టమేనా? నీవు దేవుణ్ణి చూడందే వెళ్ళడానికి లేదు” అన్నాడంట.
“నీవు భలే వాడివే. ఈ బస్సు వెళ్తే అంతే సంగతులు. రేపటివరకు మా ఊరికి బస్సులేదు. అప్పుడు వరకు నేను ఎక్కడుండేది ఈ ఊర్లో. దేవుడి సంగతి దేవుడెరుగు” అని చేయి విదిలించుకుని చక్కా బస్సెక్కి వెళ్ళాడంట.
సంఘటన 2 :
మా గురువుగారికి ఓ గురువు ఉండేవాడు. ఆయన్ని మేం తాత అని పిలిచేవాళ్ళం. ఆ తాత దగ్గరకి ఓసారి.. శ్రీకాళహస్తికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొణతనేరి అనే గ్రామం నుంచి ఓ రైతు వచ్చాడు. వచ్నిన వెంటనే తన బాధలు చెప్పుకుని, బాధల నివారణకు తాయొత్తు ఒకటి తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు..
“స్వామీ! నాకు మోక్షాన్ని ఎలాగైనా ప్రసాదించడం” అని వేడుకున్నాడట.
దానికి తాత అతని వైపు చిరునవ్వుతో చూస్తూ..
“నీకు పొలం ఎన్ని ఎకరాలు ఉంది?” అన్నాడట.
“ఐదు ఎకరాలు ఉన్నాయి స్వామి” అన్నాడట ఆ రైతు.
“అయితే ఐదెకరాలు నాకు రాసిచ్చేయ్. తర్వాత ఇస్తాను నీకు మోక్షం” అన్నాడట.
అంతే, ఆ రైతు ఉలుకు, పలుకు లేకుండా అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడట.
అలా ఉంటుంది మన వ్యవహారం దేవుని విషయంలో. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవసరాల కోసమే దేవుడు అవసరంగాని- నిజంగా ఎవరికీ దేవుడు అవసరంలేదనేది సుస్పష్టం.
దానికి కారణం ఏంటంటే.. మనిషి కొలిచే, వెతికే దేవుడు బయట ఎక్కడా లేడు. తనలో ఉన్నాడు. ఎలాగంటే, ఈ సమస్త సృష్టిని ఏదోక శక్తి నడిపిస్తోంది. ఆ శక్తే ప్రతి జీవి ఉనికికి ఆధారం. ఆ శక్తే ప్రతి మనిషిలోనూ ఉండేది. ఆ శక్తే అందరినీ నడిపించేది, ఆడించేది, లాలించేది. కానీ, ఆ విషయం తెలీక గుడికెళ్ళి కోరికలు కోరినప్పుడు కొన్ని తీరుతాయి. కొన్ని తీరవు. తీరిన కోరికలకు నీ యొక్క పట్టుదల, కృషి, సంకల్ప బలం దృఢంగా ఉండబట్టే అవి జరుగుతాయి. తీరని కోరికలకు వాటిలో నీ ప్రయత్న లోపం ఉంటుంది. కానీ, ఆ విషయాన్ని ఎవరూ గుర్తించక దేవుని దూషించడమో, ఇతరులను ద్వేషించడమో చేస్తుంటారు.
కాబట్టి.. మనిషి యొక్క సుఖశాంతులకే కాదు, కష్ట, సుఖాలకు కూడా తానే కారకుడు. సుఖశాంతులు కలిగినప్పుడు ఎంత ఆనందిస్తామో, కష్ట, నష్టాలకు కూడా అధైర్య పడకుండా ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, సంకల్పబలంతో ఆ కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళితే ఖచ్చితంగా వాటిని నుంచి బయటపడతాం.
కనుక.. కోరేవాడిలోనే తీర్చేవాడు ఉన్నాడనేది నిజం. కాబట్టే మనం దేముడి ముందుకెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం. అంటే దేవుడనే వాడు బయట ఎక్కడా లేడు. తనలోనే ఉన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తానే దేవుడు. ఇక ‘తానే’ దేవుడని తెలిసిన తర్వాత ప్రత్యేకంగా దేవుని కోసం బయట వెతుకలాడవలసిన అవసరం ఏముంది?
…దేవీప్రసాద్ ఒబ్బు
98662 51159
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

.

Discussion about this post