కష్ట,నష్టాలను చవిచూడందే కార్యం నెరవేరదని తెలిసినా, ఆటు,పోటులను ఎదురీదందే అవతలి గట్టుకు చేరలేమని తెలిసినా, సుఖ,దుఃఖాలను అనుభవించందే జీవితం సాఫల్యం కాదని తెలిసినా, ప్రతివ్యక్తీ ఒక్క క్షణమైనా బాధలేకుండా తన జీవితమంతా నిరంతరం సుఖమయంగా ఉండాలని కోరుకుంటాడు.
మనిషి సుఖాన్ని కోరుకోవడంలో ముమ్మాటికీ తప్పులేదు. అయితే, ఎవరికైనా లేనిదానిని ఇవ్వగలరుగాని అల్రెడీ ఉన్నదానిని ఎవరు మాత్రం ఇవ్వగలరు?
మనిషి కోరుకునే సుఖం నీడవలే నిరంతరం ప్రతిఒక్కరికీ అందుబాటులోనే ఉంది. కానీ, ఆ విషయం మరవడంవల్లే మనిషి అష్టకష్టాలు పడుతున్నాడు.
ఎలాగంటే…
ప్రతివ్యక్తీ ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని కార్యకలాపాలు నిర్వహించినా రోజులో చివరి మజిలీ అయిన గాఢనిద్రలోకి జారుకుంటున్నాడు. ఆ గాఢనిద్రలో అతనికి కోపతాపాలుగాని, కష్టనష్టాలుగాని ఏవీ అనుభవంలో లేకపోవడంవల్ల హాయిగా నిద్రపోతున్నాడు. కానీ, మెలకువ రాగానే అవన్నీ మళ్ళీ మనిషిని తగులుకుంటున్నాయి.
కారణమేమిటంటే…
మెలకువలో ‘నేను – నాది’ అనే భావన బలంగా ఉండడంవల్ల సమస్యల సుడిగుండంలో మనిషి చిక్కుకుని సతమతమవుతున్నాడు. కానీ, ఋషులు, మహర్షులు ఆ గాఢనిద్రలో ఉన్న స్థితినే మెలకువలో కూడా అనుభవించి తరించారు కనుకనే వాళ్ళు హాయిగా ఉండిపోయారు.
మరి మనం ఎందుకు నిరంతరం హాయిగా, సుఖమయంగా ఉండలేకపోతున్నాం? అలా ఉండడం మనకు సాధ్యమేనా? అంటే…
ఖచ్చితంగా సాధ్యమే. కాకపోతే అందుకు మనం మరణించాల్సి ఉంటుంది. మరణించడం అంటే శరీరాన్ని వదలడంకాదు, మన మనస్సులోని “అహాన్ని” అంతం చేయాలి.
ఎలాగంటే…
మీరు నిద్రలో ఉన్నప్పుడు ఒక కల వచ్చిందనుకోండి. ఆ కలలో ఎవరో మిమ్మల్ని చంపడానికి వెంటాడుతున్నారు. అప్పుడు మీరు పరుగెడుతూ, పరుగెడుతూ ఒక కొండమీద శిఖరానికి చేరుకున్నారు. నిన్ను వెంటాడేవాళ్ళు అక్కడకు కూడా వచ్చేశారు. కానీ, నీవు వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ఆ శిఖరంపై కొంచెం దూరం పరుగెత్తావు. కానీ, ఒక ప్రదేశంలో ఆగిపోయావు. ఎందుకంటే ఎదురుగా లోయ ఉంది. అప్పుడు నీకు ఏంచేయాలో దిక్కుతోచక భయంతో వణికిపోతున్నావు. ఆ సమయంలో నీకు మెలకువ వచ్చేసింది.
‘అంటే ఇప్పుడు వరకు జరిగింది కలేనా! హమ్మయ్య కల కాబట్టి బతికిపోయాను’ అని రిలాక్స్ అయిపోతావు. కల జరిగినంత సేపు అది నిజమనే అనుకోవడంవల్ల అది కలయని తెలియడంలేదు. అందువల్ల నీకు భయమేసింది. మెలకువ రాగానే అది ‘కల’ అని తెలుస్తోంది.
అలాగే..
మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు ఏ అనుభవమూ ఉండదు. కాబట్టే హాయిగా ఉంటుంది. మెలకువ రాగానే మనకు అన్నీ అనుభవాలు కలగడంవల్ల జరిగేవన్నీ నిజమని అనుకుంటున్నాం. మనం ఏదయితే నిజమనుకుంటామో అది ఖచ్చితంగా కలే. కాబట్టి మెలకువ వచ్చినప్పటి నుంచి మళ్ళీ గాఢనిద్రలోకి వెళ్ళేంతవరకు జరిగేదంతా ముమ్మాటికీ కలేనని మనం ఒప్పుకోక తప్పదు. కానీ, ఆ విషయాన్ని మనం గుర్తించకపోవడంవల్లనే సమస్యలతో సతమతమవుతున్నాము.
కాబట్టి..
మనకు గాఢనిద్రలోంచి మెలకువ వచ్చిన తక్షణమే…
“నేను కలలోకి ప్రవేశించాను. ఈ క్షణం నుంచి జరిగేదంతా కలే. ఇది ఎప్పటికైనా తొలగిపోతుందని, ఈ కలలో కలిగే కోపతాపాలకు, రాగద్వేషాలకు అసలు అర్థమేలేదు” అని దృఢంగా అనుకుని ఉండగలిగితే సుఖం నీ సొంతం అవుతుంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అలా ఉండగలిగే సామర్థ్యాన్ని సాధించడానికి ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాం.
ఒక రంగస్థలం మీద “రామరావణ యుద్దం” అనే నాటకం జరుగుతోంది అనుకోండి. ఆ నాటకం జరిగినంతసేపు ఆ నాటకంలో రాముడు, రావణుడు పాత్రలు ధరించిన వ్యక్తులు శత్రువులే. ఆ నాటకం పూర్తి అయిపోయి స్టేజీ దిగేసిన తర్వాత ఇద్దరూ కలిసి ఓ ‘టీ’ షాపుకు దగ్గరకు వెళ్ళి ‘టీ’ తాగారనుకోండి. అప్పుడు వాళ్ళు మిత్రులు.
దీనినిబట్టి మనకు అర్థమయింది ఏంటంటే.. నాటకం వేసినంతసేపూ రాముడు, రావణుడు అనేవి కేవలం పాత్రలేనని అనుకోవడం వల్ల వాళ్ళిద్దరూ ఆ పాత్రలను అభినయిస్తారే తప్ప అనుభవించరు. అందువల్ల ఆ పాత్రల యొక్క కష్ట,సుఖాలు వాళ్ళ మనస్సును అంటవు.
అలాగే.. భగవంతుడు సృష్టించిన ఈ జగన్నాటకంలో మనం కేవలం పాత్రధారులం. ఏ పాత్రను ఎప్పుడు ప్రవేశపెట్టాలో, ఎప్పుడు నిష్క్రమింపచేయాలో విశ్వ కథారచయిత అయిన భగవంతుని ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది.
కాబట్టి.. ‘జగన్నాటకం’ అనే జీవితంలో మనది కూడా ఒక పాత్రేనని భావిస్తే ఆ పాత్రకు సంబంధించిన కష్టనష్టాలుగాని, సుఖసంతోషాలుగాని ఏవీ మనకు అనుభవంలోకి రావు. అప్పుడు మన జీవితానుభవం అభినయంగా మారిపోతుంది. ఎప్పుడైతే మన జీవితం అభినయంగా మారిపోతుందో అప్పుడు ఆనందం మనం సొంతం అవుతుంది.
కాదు కాదు.. ఆనందమే మనం అవుతాం.
మరణించి జీవించడం అంటే –
జీవితంలో ‘అహం’ వల్ల కలిగే ఈర్షాద్వేషాలను, కోపతాపాలను అనుభవంలోకి రానీకుండా అభినయిస్తూ ఆనందంగా జీవించడమే.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

.

Discussion about this post