మనతోపాటు సకల జీవరాసులను, వృక్షాలను నిత్యం భరిస్తూ ఉంటుంది భూమి. అందుకే భూమిని భూదేవి అని స్త్రీతో పోల్చారు మన పెద్దలు. ఆ కారణంచేతనేమో సహనం, ఓర్పు, కరుణ, దయ, ఆప్యాయత, ప్రేమ అనే పదాలను స్త్రీ ని చూసే రాసుంటారు కవులు. ప్రపంచంలో ప్రత్యక్ష దైవం – స్త్రీ. అందుకే మాతృదేవోభవ అని స్త్రీకి ప్రధమస్థానాన్ని ఇచ్చారు ఋషులు. అర్థనారీశ్వరుడు అంటే శివుడిలో సగభాగం పార్వతి అనుకుంటాం. కానీ, పార్వతిలో సగభాగం శివుడు అనేదే అసలైన అర్థం.
పురుషుడైనా, స్త్రీ అయినా స్త్రీ గర్భం నుంచే కదా ఈ భూమ్మీదకు వచ్చేది. అంతెందుకు ముల్లోకాలను పరిపాలించే త్రిమూర్తులు సైతం శక్తి స్వరూపిణి అయిన స్త్రీమూర్తి నుంచి ఉద్భవించినవారే.
స్త్రీ యొక్క విశిష్టమైన గుణం రామాయణ, మహాభారతాలలో మనకు స్పష్టంగా కనబడుతుంది.
రామాయణంలో సీతను అపహరించి లంకకు తీసుకెళ్ళిన రావణాసురుడు ఆమె చిటికెన వ్రేలు గోరును కూడా తాకలేదు. అది రావణాసురుడి గొప్పతనంకాదు. సీతాదేవి యొక్క పాతివ్రత మహిమాన్వితమైన సంకల్పంవలనే రావణాసురుడు ఆ మహాతల్లిని స్పర్శించలేకపోయాడు. అలాగే మహాభారతంలో ద్రౌపదిదేవి పాతివ్రతాన్ని భంగపరచాలని చూసిన కౌరవులు రాజ్యాన్ని పొగొట్టుకుని కురుక్షేత్ర యుద్ధంలో దుర్మరణం పొందారు.
అత్రి మహర్షి భార్య అయిన అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి దివి నుండి భువికి వచ్చిన త్రిమూర్తులు సైతం ఆమె యొక్క మహిమాన్వితమైన పాతివ్రత్యాన్ని చూసి పరవశించిపోయి ఆ మహాతల్లికి పుత్రులుగా జన్మించిన పుణ్యభూమి మనది.
తన భర్త కౌశికుడు దుర్మార్గుడు అని తెలిసినా అతనినే ప్రత్యక్ష దైవంగా భావించి సేవ చేసింది సుమతి. ‘నీ భర్త సూర్యోదయంలోపు మరణిస్తాడ’ ని మాండ్యముని శాపానికి ఆగ్రహించిన సుమతి సూర్యోదయాన్ని నిలిపివేసిన మహాసాద్వి. మరుసటిరోజు సూర్యోదయం లేకపోయేసరికి లోకాల దినచర్య అస్తవ్యస్తం అయిపోవడంతో బ్రహ్మాది దేవతలు దివి నుండి భువికి దిగి వచ్చి ‘మీ భర్తను మేం బతికించి సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేస్తాం. సూర్యోదయం అయ్యేటట్లు చూడుతల్లి’ అని వేడుకోవడంతో శాంతించిన సుమతి సూర్యుని ఉదయించమని ఆజ్ఞాపిస్తుంది. సూర్యోదయం కాగానే కౌశికుడు మరణిస్తాడు. అప్పుడు అనసూయ వచ్చి కౌశకుడుని పునర్జీవుతుణ్ణి చేస్తుంది. అలాంటి పతివ్రతలు నడయాడిన ధన్యభూమి మనది. ఇలా చెప్పుకుంటూ పోతే మన పురాణ, ఇతిహాసాలలో ఎందరో విశిష్టమైన స్త్రీమూర్తులు మనకు కనిపిస్తారు.
పై అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మనకు అవగతమైన విషయం ఏంటంటే ఎప్పటికైనా పురుషుని కంటే స్త్రీనే గొప్ప అనేది సుస్పష్టం. స్త్రీని గౌరవించడం పురుషుని విధి వేరే మార్గమే లేదు. కాబట్టి స్త్రీని గౌరవించడం అంటే పురుషుడు తనని తాను గౌరవించుకోవడమే. స్త్రీని అవమానపరచడం అంటే పురుషుడు తనని తాను అవమానపరచుకోవడమే. స్త్రీ నడవడిక సరిలేదంటే అది పురుషుల తప్పిదనమే. వేరే మాటేలేదు.
సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆడవాళ్ళను అణగతొక్కాలని చూసిన వాళ్ళందరూ అధోగతి పాలయ్యారే తప్ప పురోగతి సాధించిన దాఖలాలు చరిత్రలో మనకు ఎక్కడా కనిపించదు. ఎక్కడయితే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఎక్కడయితే స్త్రీలు కన్నీరు పెడతారో అక్కడ దుఃఖంతో అలమటిస్తారు.
కానీ, నేటి సమాజంలో ఇప్పటికీ ఆడవాళ్ళపై అత్యాచారాలు, భౌతికదాడులు ఆగడంలేదు. ఎందరో
మహిళామణులు బయటకు చెప్పుకోలేని గృహహింసను అనుభవిస్తున్నారు. దారుణమైన విషయం ఏంటంటే.. తన కూతుర్ని ప్రేమగా చూసుకునే తల్లి కోడలి విషయంలో కఠినంగా వ్యవహరించడం. సాటి ఆడమనిషే ఆడవాళ్ళను గౌరవించకపోతే ఇక ఎవరు గౌరవిస్తారు. కాబట్టి అలాంటి తల్లులు, అత్తలు సహృదయంతో ఆలోచించి మీతోటి ఆడవాళ్ళను గౌరవించండి.
కుటుంబాలుగాని, సమాజంగాని సుఖశాంతులతో వర్థిలాల్లంటే స్త్రీని గౌరవించి తీరాల్సిందే వేరే మార్గమేలేదు. కాబట్టి నీ యొక్క సుఖశాంతులుగాని, కష్టనష్టాలుగాని స్త్రీ పట్ల నీవు ప్రవర్తించే తీరును బట్టి ఆధారపడి ఉంటాయి. నీవు స్త్రీని గౌరవిస్తే సుఖశాంతులతో జీవిస్తావు. స్త్రీని అగౌరపరిస్తే నరకకూపంలోకి నెట్టబడుతావు. ఇదే పురోభివృద్ధికిగాని, తిరోగమనానికిగాని ప్రమాణం.
కాబట్టి స్త్రీని అవమానపరచడమా? అగౌరపరచడమా? అనేది ఎవరికివారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరి అవసరం వాళ్ళది ఏంచేస్తాం…
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.
Discussion about this post