రెండు వస్తువుల కలయిక వల్ల ఏర్పడిన దానిని గాని, ఇద్దరు మనుషుల మధ్య ఉండే సంబంధాన్నిగాని మనం సాధారణంగా బంధం అంటాం. ఈ బంధం అనేది పలువిధాలుగా ఉంటుంది.
భార్యాభర్తల బంధం, తండ్రీకొడుకుల బంధం, అన్నాచెల్లెళ్ల బంధం, ప్రేయసీప్రియుల బంధం, గురుశిష్యుల బంధం… ఇలా చెప్పుకుంటూపోతే లోకంలో అనేక బంధాలున్నాయి.
మరి ఈ బంధాలకు తూకంరాయి ఏమిటి?
అనే ప్రశ్న కొద్దిరోజులుగా నా మెదుడులో మెలికలు తిరుగుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతకటంకోసం నా గతంలోకి నేను తొంగిచూడక తప్పలేదు.
కొన్ని సంవత్సరాల క్రితం ఓ మిత్రుడు నాకు ఫోన్ చేసి.. “మిత్రమా! అమెరికా నుంచి మన మిత్రుడు వస్తున్నాడు. మన స్నేహితులందరినీ కలవాలట… అందుకోసం నన్ను సమావేశం ఏర్పాటు చేయమన్నాడు. అందుకని ఆ విషయం నీకూ తెలియజేయాలని ఫోన్ చేశాను…. వచ్చే ఆదివారమే మీటింగు. ఈ సమావేశానికి నీవు తప్పకుండా రావాలి.” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
చాలాకాలం తర్వాత మిత్రులందరూ కలవడం అనేది నాకు సంతోషం కలిగించింది. పైగా నన్ను గుర్తు పెట్టుకుని పిలిచినందుకు మనస్సులో చాలా ఆనందం వేసింది. ఆ ఆనందంతోనే ఆ సమావేశానికి హాజరయ్యాను.
ఆరోజు సమావేశానికి ఓ అరవైమంది మిత్రులు హాజరైనారు. వాళ్ళల్లో టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారస్థులు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, రాజకీయ నాయకులుతో పాటు నాలాంటి రోజు వారీ కూలీలు కూడా ఉన్నారు. సమావేశం స్టేజీపైకి అమెరికా మిత్రుడుతోపాటు రాజకీయ నాయకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్ల నుంచి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించి కూర్చోపెట్టారు. సమావేశం మొదలయిన తర్వాత ఎవరెవరు ఏంచేస్తున్నారో ఒక్కొక్కరుగా పరిచయం చేసుకున్నాం. సమావేశం అయిన తరువాత అమెరికా మిత్రుని దగ్గరకు వెళ్ళాను కలవడానికి. అతను నన్ను గుర్తుపట్టలేదు. అందుకని ‘నేను పలానా’ అని నేనే పరిచయం చేసుకున్నాను. అయినా అతను నన్ను పలకరించకుండా ఓ వెకిలినవ్వు నవ్వేసి.. అక్కడ నుంచి వెళ్ళి.. రాజకీయ నాయకులను, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. అక్కడ నన్నేకాదు నాలాంటి కూలీలను ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు. నాకు చాలా బాధ కలిగింది.
అప్పుడు అర్థమయింది.. ఇక్కడ మనుషుల మధ్య ఉన్న బంధం స్టేటస్సేగాని స్నేహంకాదని.
మరి లోకంలో ఉన్న ఇతర బంధాలను మనం అంతర్దృష్టితో చూసినప్పుడు… ఎన్నో విషయాలు మనకు అవగతమవుతాయి.
ఉదాహరణకు:
1. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచి అవసరమైనవి సమకూరుస్తూ వాళ్ళకు ఏ కష్టం తెలియకుండా పెంచుతారు. ఎందుకంటే తమ జీవిత చమరాంకంలో చేదోడువాదోడుగా ఉంటూ తమల్ని కడతేరుస్తారని. మరి నేటి సమాజంలో నూటికి తొంభైశాతం మంది పిల్లలు తమ తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు. మరి లోపం తల్లిదండ్రులదా? లేక పిల్లలదా? అంటే ఎవరిదీ కాదని నేనంటాను.
ఎందుకంటే… నీరు ఎప్పుడూ మిట్ట నుంచి పల్లానికే ప్రవహిస్తుంది. పల్లం నుంచి మిట్టకు ప్రవహించదు.
ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమ.. నీరు మిట్ట నుంచి పల్లానికి ప్రవహించినట్లు నిరంతరమూ తమ పిల్లల వైపే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ పిల్లల ప్రేమ.. పల్లం నుంచి మిట్టకు ప్రవహించినట్లు. నీరు పల్లం నుంచి మిట్టకు ప్రవహించడం అసాధ్యమైన పని. సృష్టిలోనే ఈ రకమైన ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎవరినీ నిందించాల్సిన అవసరంలేదు. అంచేత తండ్రీకొడుకుల మధ్య ఉన్న బంధం మిట్టాపల్లాల బంధమే.
2. నేటి సమాజంలో భార్యాభర్తల బంధాన్ని పరిశీలిస్తే మనకు ఆశ్చర్యకరమైన విషయాలు గోచరిస్తున్నాయి. నూటికి తొంభైశాతం మంది భార్యాభర్తలు అసంతృప్తితో జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. దీనికి కారణం ఎవరికివారు తమకు నచ్చినట్లు ఉండాలని భార్యాభర్తలు ఇద్దరూ అనుకోవడంవల్ల వాళ్ళ మధ్య అగాధం ఏర్పడుతోంది. దానికితోడు ఆర్థికపరమైన కారణాలవల్ల వాళ్ళ మధ్య దూరం పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే.. సెల్ ఫోన్. ఇది అత్యంత ప్రమాదకరమైన పరికరంగా నేడు మన ముందు కదలాడుతోంది.
‘నా భార్య ఇరవైనాలుగు గంటలూ ఫోను చూసుకుంటుంద’ని భర్త, ‘నా భర్త ఎప్పుడూ బయట తిరుగుతూ.. ఇంట్లో విషయాలు పట్టించుకోడ’ని భార్య తరచూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. వీటికితోడు హింస, అశాంతిని ప్రేరేపించే టి.వి. సీరియల్స్ కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన భర్తకు కనీసం నీళ్ళు కూడా ఇవ్వకుండా “ఏమండీ! నీళ్ళు తాగుతారా? స్నానం చేస్తారా? భోజనం చేస్తారా?” అనే విషయాలు కూడా వాట్స్అప్ ద్వారానే అడిగే దౌర్భాగ్యపు రోజులు దాపురించాయి మనకు. ఇంక ఎక్కడ ఉంటుంది? భార్యాభర్తల మధ్య సఖ్యత. భార్యాభర్తలు ఇద్దరూ ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చుని ఆప్యాయంగా పలకరించుకోవడమనేది నేటి కుటుంబ వ్యవస్థలో మనకు ఎక్కడా కనిపించడంలేదు. ఎవరికివారు సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. కాబట్టే విడాకుల కేసులు ఎక్కువైతున్నాయి. కనుక నేటి సమాజంలో భార్యాభర్తలు బయటి ప్రపంచానికి ‘మేం సఖ్యతగానే ఉన్నాం’ అనే ఎండమావుల బంధాన్ని అనుభవిస్తున్నారు.
3. నేటి యువతీ యువకులు ఆకర్షణకులోనై చదువుకుంటున్న రోజుల్లోనే ప్రేమ వలయంలో చిక్కుకుని తమ జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది ఆడపిల్లలు కొందరు యువకులు చెప్పే మాయమాటలకులోనై తమ సర్వసాన్ని సమర్పించి.. తీరా మోసపోయిన తర్వాత మానసిక క్షోభను జీవితాంతం అనుభవిస్తున్నారు. కాబట్టి తెలిసీతెలియని వయస్సులో ప్రేయసీప్రియుల మధ్య ఉన్న బంధం ‘ఆకర్షణేగాని’ ప్రేమ కాదని అందరూ అర్థంచేసుకోవాలి.
4. నేటి సమాజంలో గురుశిష్యుల మధ్య ఉన్న బంధం దీనావస్థకు చేరిందని చెప్పవచ్చు. ఎందుకంటే.. “నువ్వు చెబితే మేం వినేది ఏమిట”ని పిల్లలు, “పిల్లలు వినడంలేదు కాబట్టి.. మేం చెప్పినా ఏంలాభం?” అని గురువులు తయారైనారు. ఒకవేళ క్లాసులో పిల్లలు పాఠం వినడంలేదని గురువులు మందలించినా, దండించినా సస్పెండై ఇంటి దగ్గర కూర్చోవాల్సిన దౌర్భాగ్యపు రోజులు దాపురించాయి. అది నేటి గురుశిష్యుల మధ్య ఉన్న బంధం.
ఇలా..నేటి సమాజంలో..మనం చెప్పుకుంటూ పోయే బంధాలన్నీ… సన్నబడిపోయి.. చతికిలబడి.. భారంగా.. బతుకుపోరాటం చేస్తున్నాయి.
మరి ఈ బంధాలు.. సన్నబడిపోయి..చతికిలబడి పోవడానికి కారణం ఏంటంటే… మనిషి మనస్సు పొరల్లో ఉన్న బలహీనతలే.
‘తమ జీవిత చరమాంకంలో తమ పిల్లలు తమ బాగోగులు చూసినా.. చూడకపోయినా పర్వాలేదు.. పిల్లలు సంతోషంగా ఉంటే చాలు’ అని అనుకోవడమే తల్లిదండ్రుల బలహీనత.
సెల్ ఫోను అతిగా వాడడం, ఇంటికొచ్చిన భర్త బాగోగులను సక్రమంగా చూసుకోలేకపోవడం, అస్తమానం పనికిమాలిన టి.వి.సీరియల్స్ చూడడం వంటివి భార్యల బలహీనతలు.
పని ఉన్నా.. లేకున్నా.. అనవసరంగా బయట తిరగడం, చిన్న చిన్న విషయాలకు కూడా భార్యలపై కోపంతో విరుచుకు పడడం వంటివి భర్తల బలహీనతలు.
యువతీయువకుల మధ్య ఉన్న ‘ఆకర్షణ’ కూడా ఒక బలహీనతే.
గురువులు చెప్పిన పాఠం శిష్యులు వినకపోవడం, పిల్లలు మనం చెప్పే పాఠాలు విననప్పుడు మనం చెప్పడం ఎందుకని? గురువులు అనుకోవడం గురుశిష్యుల బలహీనత.
కుక్క విశ్వాసంగా ఉండడం గొప్పగా చెప్తారు లోకంలో. కానీ కుక్కకు విశ్వాసంగా ఉండడం తప్ప మరొక విధంగా ఉండలేకపోవడం దాని బలహీనత.
అలాగే కర్ణుడు దానశీలి అని లోకంలో ప్రసిద్ధి. కానీ కర్ణుడు దానశీలిగా ఉండడం తప్ప వేరొక విధంగా ఉండలేకపోవడం అతని బలహీనత.
ఈ బంధాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మనకు స్పష్టమైన విషయం ఏంటంటే…
బంధాలకు తూకంరాయి – బలహీనత.
…దేవీప్రసాద్ ఒబ్బు
98662 51159.
.

Discussion about this post