భూమి ఒక అందమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో.. గలగలపారే జలపాతాలు, మనోహరమైన మలయపర్వతాలు, కనువిందుచేసే పచ్చని పరిమళాలు వెదజల్లే తరువులు, మధురగానం చేసే కోయిలలు, పురివిప్పి నాట్యం చేసే మయూరీలు, కిలకిలరావాలతో గిలిగింతలు పెట్టే పక్షులు, గర్జించే సింహాలు, గాండ్రించే పులులు, లేలేత లేడికూనలు, కిచకిచలాడే వానరాలు, సరసరపాకే సరీసృపాలు తమ పనిని తాము చేసుకుంటూ స్వేచ్ఛగా, హాయిగా జీవన గమనాన్ని సాగిస్తున్నాయి.
అలా.. హాయిగా ఉన్న ఆ అందమైన ప్రపంచంలో ఓరోజు అలజడి రేగింది. ఈ అలజడికి జంతువులు, పక్షులు ఉలికిపాటుకు గురైనాయి. అందుకు కారణం ఆ ప్రపంచంలోకి ఒక కొత్త జీవి ఆగమనమే. ఆ జీవిని చూస్తేనే ఆ వన్యప్రాణులకు వణుకు పుట్టేది.
ఎందుకంటే… అది కనపడిన ప్రతి ప్రాణిని వెంటపడి, వేటాడి తినడం ప్రారంభించడంతో ఆ ప్రాణులకు దిక్కుతోచక ప్రాణభీతితో కొండకోనల్లో తలదాచుకునేవి. అయినప్పటికీ ఆ జీవి కరుణించక నిర్దాక్షిణ్యంగా, నిర్దయతో వాటిని చంపి తినేది. అంతటితో ఆ జీవి ఆగక.. వాటి మనుగడకు ఆధారమైన మహావృక్షాలను సైతం తెగ నరికి ఆ జీవుల ఆవాసానికి అవరోధం కల్పించేది.
తర్వాత ఆ జీవి తన సంతతిని వృద్ధి చేసుకుంటూ ఆ అమాయక జీవుల సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని వాటికి కంటిమీద కునుకులేకుండా చేసింది. ఆ జీవులు తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలోతామే రోదిస్తున్నాయి. వాటి వేదన అరణ్యరోదనే అయింది.
చివరకు ఆ జీవులు.. తమను సృష్టించిన దేవుణ్ణి ప్రార్థించాయి.. ఆ నికృష్టజీవి నుంచి రక్షించమని.
ఇంతకీ ఆ నికృష్టజీవి.. ఎవరోకాదు.. ‘మనిషే’.
ఆ అమాయకపు ప్రాణుల ఆవేదనను ఆలకించిన దేవుడు.. వాటికి అభయహస్తం ఇచ్చి.. మనిషిని శిక్షించడానికి పూనుకున్నాడు.
దాని పర్యవసానంగానే.. మనిషిపైకి ప్రకృతి వైపరీత్యాలను పారద్రోలాడు. వింతరోగాలను విసిరాడు. అయినా మనిషి మారలేదు. ఇక చివరి అస్త్రంగా వైరస్ రూపంలో మృత్యుదేవతను ఉసికొల్పాడు. మృత్యుదేవత మనిషిపై విరుచుకుపడి విలయతాండవం చేయడంతో మనిషి విలవిలలాడి అసువులు బాయడం ఆరంభమైంది. మనుషులు మరణించడం చూసి.. వన్యప్రాణులన్నీ వినోదంతో విందుచేసుకుని ఆనందించాయి.
కానీ, కొంతకాలానికి మనిషిపడే ఆవేదనలు, ఆర్తనాదాలు చూసి.. వన్యప్రాణులకు దయకలిగింది.
మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించాయి.. మనిషిని దయపెట్టమని. కరుణార్ద్ర హృదయుడైన బోళాశంకరుడు వన్యప్రాణుల సహృదయానికి సంతసించి.. మనిషిని పిలిపించి.. ఇలా ప్రబోధించాడు..
“ఓ మనిషీ! ఇకనైనా తెలుసుకుని మారడానికి ప్రయత్నించు. లేకుంటే ఈ భూమిపై మీ మనుగడే లేకుండా చేస్తాను” అని పరమశివుడు ఆదేశించడంతో.. మనిషి చేతులు జోడించి.. “ఓ దేవా! మీ ఆజ్ఞను శిరసావహిస్తాను” అని ప్రణమిల్లాడు.
దాంతో పరమశివుడు త్రిశూలధారియై.. మళ్ళీ ఇలా ఆదేశించాడు…
“ఓరీ మానవా! ఇప్పుడు నీవు మంచిగా మసలుకునే సమయం ఆసన్నమయ్యింది.
* సహజంగా జీవించే వన్యప్రాణుల జీవుల మనుగడకు ఆటంకం కలిగించకు.
* ప్రాణవాయువును ఇచ్చే వృక్షాలను నరికి వేయకు.
* కుట్రలు – కుతంత్రాలు, మోసం – ద్రోహం అనే విషపుగోడలను నిలుపుకున్న నీ మనసు పునాదిపై నుంచి వాటిని కూల్చివేసేయ్.
* సాటి జీవులపట్ల దయకలిగి, వాటి స్వేచ్ఛకు ఆటంకం కలిగించకు.
* ఈ భూమిపై సహజంగా ప్రవహించే నదులు, జలపాతాలను నీ స్వార్థానికే వినియోగించకు.
* అత్యాశకు పోయి.. దోపిడి, దౌర్జన్యాలకు పాల్పడకు..
* ఉన్నదాంతోనే సంతృప్తిపడి జీవనం సాగించు.
లేకుంటే.. ఈ అందమైన భూమిపై నీ మనుగడే లేకుండా అంతమొందిస్తాను” అని పరమశివుడు హెచ్చరించడంతో..
మనిషి వణికిపోతూ… వినయంతో… ఇలా విన్నవించాడు..
“ఓ పరమతండ్రీ! మీరు ఆదేశించినవన్నీ ఈ క్షణం నుంచే పాటిస్తాము. మాపై దయుంచి వైరస్ అనే ఆ మృత్యుదేవత నుంచి మమ్మల్ని రక్షించు” అని మోకరిల్లి నమస్కరించాడు మనిషి.
“నీవు ప్రవర్తించే తీరునుబట్టి.. ఆ మృత్యుదేవత ఉపశమిస్తుంది.. అదే నీకు గుర్తు. కాబట్టి బుద్ధిగా మసలుకో” అని చెప్పి అదృశ్యమయ్యాడు పరమశివుడు.
అప్పటినుంచి మనిషి సాటిజీవులపట్ల, ప్రకృతిపట్ల మంచిగా మమేకమై మసలుకోవడంతో.. వైరస్ అనే మృత్యుదేవత కనుమరుగైంది.
ఇప్పుడు ఈ అందమైన భూమిలో మనిషి కూడా ఒక మకరందమే.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.

Discussion about this post