ఏకంగా ఉన్న భగవంతుడు అనేకం అవ్వాలని సరదాపడి సృష్టిని సృష్టించాడు.
ఆ సృష్టిలో మొదట కొన్ని జీవరాశులను సృష్టించాడు. ఆ జీవరాశులకు ఒక్కో లక్షణాన్ని ప్రసాదించి…
అవి ప్రదర్శించే చిలిపిచేష్టలు, కౄరత్వం, కరుణ, దయ, మమకారం, ఆప్యాయత, అనురాగం, స్నేహం, ద్వేషం, అసూయ, కోపం, శాంతం, భయం, మధురం, మోసం.. లాంటివి చూసి సంబరపడ్డాడు.
కానీ ఎందుకో భగవంతుడుకి సంతృప్తి కలగలేదు. అప్పుడు భగవంతునికి ఒక ఆలోచన కలిగింది…
అదేమంటే- అన్ని జీవరాసుల లక్షణాలు కలిపి ఉన్న ఒక ప్రత్యేక జీవిని సృష్టిస్తే.. ఆ జీవిలోనే అన్నీ చూసుకోవచ్చనే ఉద్దేశంతో “మనిషి”ని సృష్టించాడు. అన్నీ లక్షణాలు ప్రదర్శించే మనిషిని చూసి మురిసిపోయాడు.
కాలక్రమంలో… మిగతా జీవరాశులన్నీ తమ తమ లక్షణాలను పాటిస్తూ… అత్యాశకు పోకుండా జీవించడం అలవాటు చేసుకున్నాయి. కానీ మనిషి మాత్రం తనకున్న సహజలక్షణాలను అధిగమించి.. అత్యాశ అనే అవలక్షణాన్ని అలవాటు చేసుకోవడం ప్రారంభించాడు. భగవంతుడు అది చూసి.. మనిషి మారతాడులే అని చూసీచూడనట్లు వదిలేశాడు.
కానీ కాలక్రమంలో… అత్యాశతో పాటు అరాచకాలకు పాల్పడడం ప్రారంభించడంతో… ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకుని.. మనిషిపైకి కొన్ని ఉపద్రవాలను (భూకంపం, అగ్ని పర్వతాలు, వరదలు.. లాంటివి) ప్రయోగించి హెచ్చరించాడు. అప్పుడు మనిషి కొంత ఉలికిపాటుకు గురైనాడు.
కానీ తర్వాత ఆ హెచ్చరికలను బేఖాతరు చేసి.. మళ్ళీ అదే మార్గంలో పయనిస్తూండడంతో..
ఇక లాభంలేదనుకుని.. కొన్ని వ్యాధులను వ్యాపింపచేసి.. మనిషిలో కాస్త భయాన్ని కలిగించాడు. మనిషి ఆ సమయానికి భయపడి.. మళ్ళీ తన పంథాను మార్చుకోకుండా.. సాటి మనుషులతో పాటు సృష్టిలోని జీవరాశులు, వృక్షాలపై విరుచుకుపడి.. విలయతాండం చేస్తుండంతో… భగవంతుడు భరించలేకపోయాడు.
ఇక మనిషిని ఇలాగే… వదిలేస్తే మిగతా జీవరాశుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భావించి, మనిషికి ఉన్న లక్షణాలలో అన్నింటినీ మరుగుపరచి.. భయాన్ని తెరమీదకు తెచ్చాడు. అందుకోసం ఒక మహమ్మారిని సృష్టించి.. మనిషిపైకి వదిలాడు. దాంతో మనిషిలో ఉన్న అన్నీ లక్షణాలు మటుమాయం అయిపోయి.. ‘భయం’ ఒక్కటే మనిషి గుండెలోతుల్లో గూడుకట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు తన మనుగడకే ప్రమాదం ఏర్పడింది. తనే లేనప్పుడు మిగతావన్నీ (ఆస్తిపాస్తులు) ఉండి.. సాధించేది ఏముంది…? అనే భయంవల్ల నిరాశ, నైరాశ్యాలు.. మనిషిని చుట్టుముట్టడంతో.. క్షణక్షణం.. భయంతో వణికిపోతూ.. ఒక జీవచ్ఛంలా బతుకుతున్నాడు.
గతంలో మనిషికి కొన్ని భయాలుండేవి…
విద్యార్థులకు పరీక్షలంటే భయం,
వ్యాపారస్థులకు నష్టం వస్తుందనే భయం,
ఉద్యోగులకు జీతం రాకపోతే భయం,
ఆడపిల్లలకు ఒంటరిగా తిరగాలంటే భయం,
కొందరికి చీకటంటే భయం,
మరికొందరికి పాములంటే భయం,
గర్భవతులకు ప్రసవం భయం…
కానీ, ఇప్పుడు…
సాటి మనిషి తుమ్మినా, దగ్గినా భయమే.
బయట తిరగాలన్నా భయమే.
సాటి మనిషిని స్పర్శించాలన్నా భయమే.
సాయం చేయాలన్నా భయమే.
అందువల్ల ఇప్పుడు మనిషికి…
బంధాలులేవు, బాంధవ్యాలులేవు, రాగద్వేషాలులేవు,
ఆప్యాయత- అనురాగాలు లేవు, ఉన్నదల్లా ఒకటే.. అదే
మృత్యుభయం.
చివరకు తన బంధువులు, ఆత్మీయులు, ఆప్తులు, స్నేహితులు చనిపోతున్నా…
ఏమీచేయలేని నిస్సహాయుడుగా మిగిలిపోయాడు. ఇప్పుడు మనిషి ఒంటరైపోయాడు…
అయినా ఆ భయం నుంచి బయటపడాలని ఆలోచించకుండా భయపడుతూనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు.
మరి మృత్యుభయం నుంచి బయటపడాలంటే..ఏంచేయాలి…?
శివుడికి శరణాగతి చెందడమే. వేరే మార్గమేలేదు.
శివుడికి శరణాగతి ఎలా చెందాలి? అనే ప్రశ్న మీలో సహజంగానే కలుగుతుంది.
దానికి సమాధానం ఏంటంటే…
“ఓ శివా! ఈ మహమ్మారి నుంచి మమ్మల్ని తక్షణం రక్షించు. ఇక మీదట నుంచి మేము సాటి జీవరాశులపట్ల, మొక్కలపట్ల, సాటి మనుషుల పట్ల మంచిగా ప్రవర్తిస్తాము. వేటినీ వేధించము. ఎవరినీ సాధించము. అత్యాశలకు,అరాచకాలకు పాల్పడము. మీరు ప్రసాదించిన దానితోనే సంతృప్తి చెందుతాము. మాకు ఎంత అవసరమో అంతే ఉంచుకుని మిగతా అంతా అభాగ్యులకు, అనాధల కోసం వెచ్చిస్తాం.
జంతువులపట్ల, మొక్కలపట్ల ప్రేమతో వ్యవహరిస్తాం.” అని త్రికరణశుద్దిగా ప్రార్థించాలి.
ప్రార్థిస్తే సరిపోదు…తక్షణమే అమల్లో పెట్టాలి… అప్పుడే ఆ దేవదేవుడు దివి నుండి భువికి తక్షణమే దిగివచ్చి మనల్ని రక్షిస్తాడు. అమలుపరిస్తే.. నిజంగా రక్షిస్తాడా..? అనే అనుమానం మనకు కలుగుతుంది. ముందు అమలు పరచి చూడు తర్వాత ఫలితం ఎలా ఉంటుందో… కాబట్టి.. అమలుపరుస్తామా..? ఆలోచిస్తామా..? అమలుపరిస్తే.. అవనిపై పదికాలాలపాటు మనుగడ సాగిస్తాం. ఆలోచనకే పరిమితం చేస్తే మృత్యుఒడిలోకి జారుకుంటాం.
మరి శాశ్వత ముగింపుకు నాంది పలుకుదామా? లేక పచ్చని ప్రపంచానికి ఆహ్వానం పలుకుదామా? ఇప్పుడే …ఇక్కడే…నిర్ణయించుకోండి….
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.

Discussion about this post