ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతగా దుమ్మెత్తిపోసుకుంటున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి.. జనసేన పార్టీ.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందనే వాదన ఒకటి రాజకీయవర్గాల్లో బలంగానే వినిపిస్తోంది. తాజాగా ఏదో అంశంపై విడుదల చేసిన వీడియోద్వారా.. పవన్ కల్యాణ్ అలాంటి అభిప్రాయం ప్రజల్లో ఏర్పడడానికి మరో సంకేతం ఇచ్చారు.
తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకుని, చంద్రబాబునాయుడును సీఎం చేయడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ 2014 ఎన్నకల్లో శక్తివంచన లేకుండా పనిచేశారు. 2019 ఎన్నికలకు పూర్వం విభేదించినట్లుగా బయటకు వచ్చి.. తన సొంత బలాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో బొక్కబోర్లా పడ్డారు. తర్వాత బీజేపీతో జట్టుకట్టి.. పరస్పరం పొసగని కాపురం సాగిస్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల సమయానికి పవన్ చొరవతో బీజేపీ సహా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోడానికి రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. పవన్ మాటలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు.
బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు, దామోదరం సంజీవయ్యలను ఆ వీడియోలో ప్రస్తుతించారు. దామోదరం సంజీవయ్య పెన్షన్ పథకానికి ఆద్యులని, అలాంటి మహనీయుడి పేరు ఒక్క పథకానికి కూడా పెట్టలేదని ఆక్రోశం వెలిబుచ్చారు. కర్పూలు సమీపంలోని ఆయన ఇంటిని స్మారక భవనంగా మార్చేందుకు జనసేన పార్టీ ఒక కోటి రూపాయలు విరాళాలుగా పోగుచేసి అందజేస్తుందని కూడా ప్రకటించారు.
కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టినట్టుగానే, కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కూడా పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం తక్షణమే సంజీవయ్య పేరు పెట్టాలనే డిమాండ్ వినిపించిన పవన్ కల్యాణ్ కు తన మాట ప్రభుత్వం వినిపించుకోదని నమ్మకం పుష్కలంగా ఉన్నట్టుంది. అందుకే.. దానికి కొనసాగింపుగా.. ఈ ప్రభుత్వం చేయకపోతే ‘‘అధికార మార్పిడి జరిగిన వెంటనే.. జనసేన పార్టీ ఆ పని చేయిస్తుంది’’ అని కూడా పవన్ కల్యాణ్ ప్రకటించారు.
EXCLUSIVE ARTICLES
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సరిగ్గా ఈ వాక్యం దగ్గరే అనేక సందేహాలు, పొలిటికల్ కాంబినేషన్లు కనిపిస్తున్నాయి.
అధికార మార్పిడి అనగా పవన్ కల్యాణ్ హృదయంలో ఉన్న మాట ఏమిటి? అధికార మార్పిడి అంటే జగన్ దిగిపోతారు అనే అర్థం వరకు ఓకే. కానీ.. ఎవరి చేతిలోకి అధికారం వస్తుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన అనుకుంటున్నారా?
సాధారణంగా ఇలాంటి కోరికలను తమ డిమాండ్ లుగా ప్రభుత్వానికి వినిపించినప్పుడు.. ప్రభుత్వం ఖచ్చితంగా వినే అవకాశం లేదని తెలిసి కూడా.. తాము డిమాండ్ చేశాం అనే కీర్తిని మాత్రం కోరుకుంటున్నప్పుడు.. రాజకీయ పార్టీలు డిమాండ్ చెప్పేసి.. ‘‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేస్తాం’’ అని అంటూ ఉంటారు. సాధారణంగా కమ్యూనిస్టులు అంటూ ఉండే మాట ఇది.
కానీ.. ప్రస్తుతానికి రాష్ట్రంలో నిర్దిష్టంగా ఏమాత్రం బలాన్ని నిరూపించుకునే స్థితిలో లేని జనసేన తరఫున.. ‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే’ అనే పదం వాడితే.. కామెడీ అవుతుందని, హాస్యాస్పదంగా పరువు పోతుందని పవన్ కల్యాణ్ భయపడినట్టుంది. అందుకే మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అనే పదాలు వాడకుండా.. ‘అధికార మార్పిడి జరిగిన వెంటనే’ అని ఆయన అంటున్నారు. అధికారం ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య మాత్రమే దోబూచులాడుతోంది. రెండో అతి పెద్ద పార్టీగా.. టీడీపీ మాత్రమే బలాన్ని నిరూపించుకుంటోంది. అంటే పవన్ ఉద్దేశంలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అనే ఆలోచనే ఉండవచ్చునని ఆ మాట బయటకు అనలేక ఇలా అన్నారనే విశ్లేషణలు వినవస్తున్నాయి.
అధికార మార్పిడి జరిగి ఎవరు అధికారంలోకి వచ్చినా తాను ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంటానని పవన్ కల్యాణ్ చెప్పదలచుకున్నారా? లేదా, తానే అధికారంలోకి వచ్చేస్తానని అనుకుంటున్నారా? బోధపడడం లేదు.
టీడీపీ అధికారంలోకి వచ్చే రోజును కోరుకుంటున్నారంటే.. వారితో పొత్తులు పెట్టుకోడానికి కూడా చాలా సుముఖంగా ఉత్సాహపడుతున్నట్టే అని అందరూ అనుకుంటున్నారు.
.

Discussion about this post