పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పీఆర్సీ విషయంలో జగన్ సర్కారు మళ్లీ పాత పాటే పాడుతోంది. ఒకేమాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతల సహనానికి పరీక్ష పెడుతోంది. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. పదే పదే ఇదే మాట చెప్పడానికి తమను చర్చలకు ఎందుకు ఆహ్వానించాలన్నది ఉద్యోగ సంఘాల నేతల వాదన. చర్చల్లో పురోగతి లేక పోవడంతో ఉద్యోగులు మళ్లీ పోరుబాటకు సిద్ధమయ్యారు.
పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో గురువారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కార్యదర్శి సత్యనారాయణ చర్చలు జరిపారు. అధికారులు 14.29శాతం ఫిట్ మెంట్ పైనే స్థిరంగా నిలబడ్డారు. ఇందుకు అంగీకరించలేదు. గతంలో ఇచ్చిన ఫిట్ మెంట్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్పడం ఉద్యోగ సంఘాల నేతలకు ఆగ్రహం తెప్పించింది. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేక పోతే.. ముఖ్యమంత్రి జగన్ ఫిట్ మెంటు ఎంత ఇస్తారో చెబితే తమ అభిప్రాయం చెబుతామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.
ప్రస్తుతం ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, సీసీఏ అనేవి తమకు ప్రధాన సమస్యలని.. ఆ మూడు సమస్యలనీ ఒక్కరోజే తేల్చాలని ఉద్యోగ సంఘాల నేతల వాదన. ఇదే విషయం వారు ఆర్థికశాఖ అధికారులకు తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి సమక్షంలోగానీ.. ఇంకోచోట గానీ కేవలం పీఆర్సీపై తేల్చి హెచ్ఆర్ఏ, సీసీఏను వదిలేస్తామంటే కుదరదని వారు అంటున్నారు. ఈ మూడింట్లో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోయినా తాము వేతనం నష్టపోతామని.. దీనికి ఉద్యోగులు సిద్ధంగా లేమని వారు అంటున్నారు. తమ సమస్యలపై ఎలాంటి పురోగతి లేకుండా ఇకపై తమను చర్చలకు పిలవొద్దని కూడా ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సీఎస్ కమిటీ నివేదిక తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, తమ డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే తమను తిరిగి చర్చలకు పిలవాలని ఆర్థిక అధికారులతో ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మూడు స్లాట్లలో మూడు గ్రూపులుగా అధికారులు ఈ సమావేశం నిర్వహించారు. పాతప్రభుత్వాలు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇచ్చాయని అధికారులకు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న స్థాయి ఆర్థిక ప్రయోజనాలు తమకు పీఆర్సీ అమలుతో అంది తీరాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల కంటే ముందుగా ఐఆర్ తీసుకుని ఏపీ ఉద్యోగులు లాభపడ్డారంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలో నిజం లేదని.. తెలంగాణ ఉద్యోగుల కంటే 9 నెలల ముందుగా ఐఆర్ తీసుకున్నప్పటికీ ఆర్థికంగా తామే నష్టపోయామని ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అధికారులకు వివరించారు. తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ రూపం లో ఆర్థిక ప్రయోజనాలు రెండేళ్ల నుంచి అందుతున్నాయని, అలా సవరించిన స్కేళ్లపై వాళ్లకు హెచ్ఆర్ఏ, ఇంక్రిమెంట్లు, డీఏలు లెక్కిస్తున్నారన్నారు. ఈ రకంగా చూస్తే ఏపీలో ప్రతి ఉద్యోగీ ప్రతి నెలా రూ.4,000 నుంచి రూ.5,000 వరకు నష్టపోయారని కూడా వారు తెలిపారు.
కేంద్రం తన ఉద్యోగులకు కేవలం 14.29 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందనడం తప్పని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. కేంద్రం తన ఉద్యోగులకు కనిష్ఠంగా 32 శాతం నుంచి గరిష్ఠంగా 56 శాతం వరకు ఫిట్మెంట్ ఇచ్చిందని వారు ఆర్థికశాఖ కార్యదర్శులకు వివరించారు. కేంద్రం తన లోయర్ కేడర్ ఉద్యోగులకు 157 శాతం, మిడిల్ కేడర్ ఉద్యోగులకు 162 శాతం, హయ్యర్ కేడర్ ఉద్యోగులకు 181 శాతం ఫిట్మెంట్ను అప్పటికే తీసుకుంటున్న వేతనంలో విలీనం చేశారని చెప్పారు. ఈ ఫిట్మెంట్ శాతాల్లో అన్ని కేడర్లకు 125 శాతం డీఏ కాగా, మిగిలింది అంతా ఫిట్మెంటేనని ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అధికారులకు వివరించారు.
దీనిపై అధికారులు స్పందించకుండా… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ పాతపాట అందుకోవడంతో ఉద్యోగ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ‘‘ఇది గత సమావేశాల్లో చెప్పిందేగా.. ఇప్పుడేమైనా కొత్తగా చెప్పేదేమైనా ఉందా? అసలు మమ్మల్ని ఈ సమావేశానికి ఎందుకు పిలిచారో చెప్పండంటూ’’ అధికారులను వారు నిలదీశారు. దీంతో ఖంగుతున్న అధికారులు ప్రజాస్వామిక వాతావరణంలో అన్ని అంశాలు చర్చించుకుందామని చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేక పోయింది.
‘‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగులు తీసుకుంటున్న వేతనాలే ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వాల నుంచే వేతనాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం రూ.1,06,000 కోట్లు. అందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే రూ. 75వేల కోట్లు అవుతుంది’’ అని అధికారులు వివరించారు. ఇందుకు ఉద్యోగ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ దగ్గర కూడా లెక్కలు ఉన్నాయని, వేతనాలకు ఇచ్చేదాని కన్నా ఎక్కువగా చెబుతున్నారని వారు బదులిచ్చారు.
‘‘సీఎం వద్ద వారంలో పీఆర్సీపై సమావేశం ఏర్పాటు చేస్తానని… సీఎస్ గతంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో హామీ ఇచ్చారని… అయితే అది జరగలేదని.. మళ్లీ చర్చలు అంటూ ఆర్థికశాఖ అధికారులతో ఏర్పాటు చేశారు. గత సమావేశానికి ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మా సమస్యల పరిష్కారం మీ పరిధిలో లేదు కాబట్టి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయండి’’ అని ఉద్యోగసంఘాల నేతలు అధికారులను అడిగారు. ముఖ్యమంత్రితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి సమావేశం ముగించారు.
ఉద్యోగుల సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. ఉద్యోగ సంఘాలు మొత్తం 71 సమస్యలను జగన్ సర్కారు ముందుంచాయి. అయితే ఇందులో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోక పోవడం ఉద్యోగులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వక పోవడంతో ఉద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చారు.
అయితే ఆయన అధికారంలోకి వచ్చి రెండన్నర ఏళ్లు దాటినా … సీపీఎస్ రద్దు ఊసే లేదు. అది రద్దు చేయక పోగా… అప్పట్లో సాంకేతిక అవగాహన లేకుండా హామీ ఇచ్చామని తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. అవగాహన లేని వారు ఎలా పాలన చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది.నిత్యావసర ధరలు పెరిగి పోతున్నా… ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విషయంలో జగన్ సర్కారు జాప్యం చేస్తూనే ఉంది. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చారు.
ఆ హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఉద్యోగ భద్రత సరే.. ఉన్న ఉద్యోగాలనే ఊడ గొడుతున్నారు. జగన్ ప్రభుత్వ విధానాల వలన ఒప్పంద, పొరుగు సేవల కింద పని చేసే వేలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అక్టోబరు 2వ తేదీ నాటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. అయినా వారిని రెగ్యులర్ చేయకుండా కాలయాపన చేస్తోంది. ఇలా పలు రకాల సమస్యలు ఉద్యోగులను వేధిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కీలక పాత్ర పోషించారు.
ఎవరైతే తనకు అండగా నిలబడ్డారో.. అలాంటి ఉద్యోగుల పట్లే నేడు జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారి సహనానికి పరీక్షల మీద పరీక్షలు పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే జగన్ సర్కారు ఉద్యోగుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. పాలనలో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం ఎంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకుంటే అంతమంచిది. లేదంటే భవిష్యత్తులో పాలకులు సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విషయం జగన్.. ఆయన సలహాదారులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
.

Discussion about this post