మహాత్మా గాంధీ నుంచి దర్శి చెంచయ్య వరకు ఎన్నో జీవిత చరిత్రలు నన్ను ప్రభావితం చేశాయి. “ఒక సామాన్య మహిళ ఆత్మకథ” అనే టాగ్ లైన్ తో శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారు రాసిన ‘చదువు తీర్చిన జీవితం’ పుస్తకం నన్ను ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు.
స్వాతంత్య్రం రావడానికి నాలుగు ఏళ్ల ముందు పుట్టిన శేషమ్మ గారికి పదిహేను ఏళ్ళ వయసులో తల్లిదండ్రులు వివాహం చేశారు. నలుగురు పిల్లల్ని కని, విద్యాబుద్ధులు నేర్పిస్తూ, పట్టుదలతో డిగ్రీ పూర్తిచేశారు శేషమ్మ గారు. భర్త బ్యాంక్ ఉద్యోగం దృష్ట్యా వివిధ ప్రాంతాలు మారుతూనే, నలబై ఏళ్లు దాటాకా బీఎడ్ పూర్తి చేశారు.
గృహిణిగా చదువుకోవడం ఒక కష్టం అయితే ఉపాధ్యాయురాలిగా శేషమ్మ గారు తనని తాను మలుచుకున్న విధానం గొప్పగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కాదు, భవిష్యత్తులో పెన్షన్ రాదు, జీతాలు తక్కువ…. ఇవేమి శేషమ్మ గారికి పట్టవు. బోధన కోసమే వారు పుట్టారా అని అనిపిస్తుంది. బడిలో, కళాశాలలో పాఠాలు చెప్పడమే కాదు తన ఇంటికి వచ్చిన ప్రతి విద్యార్థికి చదువు చెప్పేవారు.
స్కూల్ పిల్లలే కాదు కాలేజ్ విద్యార్థులకు చివరికి పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి ఇంగ్లీష్, సామాజిక శాస్త్రాలు, జనరల్ నాలెడ్జ్ చెప్పేవారు. ఇతర దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇంగ్లీష్లో కూడా తర్పీదు ఇచ్చేవారు. తన పరిధిలోని ఎవరినీ వదిలిపెట్టేవారు కాదు. పని చేసే వారి పిల్లలు, పాలు పోసే వాళ్ల పిల్లలు.. అందరికీ చదువు చెబుతూ గైడ్ చేసేవారు. ఎంతోమంది చదువుకుని మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళడం శేషమ్మ గారి ప్రత్యేకత.
తన పిల్లలను బాగా చదివించారు. వారంతా చక్కగా స్థిరపడ్డారు. తన పిల్లలతో శేషమ్మ గారి సంభాషణలు మన మనసును హత్తుకుంటాయి. పిల్లలు ఏదైనా తప్పు ఒప్పులు ఎత్తి చూపితే శేషమ్మ గారు ఆలోచనలో పడేవారు. దాని మీద ఆత్మవిమర్శ చేసుకునేవారు. భర్త చీర బహుమతిగా ఇవ్వబోతే హిందూ పేపర్కు చందా కట్టిస్తారు ఆ డబ్బుతో. తన సంపాదనను చక్కగా పొదుపు చేశారు. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఇదంతా ఒక ఎత్తయితే, యాబై ఏళ్ల జీవిత సహచరుడి మరణం తర్వాత డబ్బై ఐదు ఏళ్లు వయసులో కూడా శేషమ్మ గారు నిరాసక్తత లోకి వెళ్లకుండా సాహితీ వ్యవసాయం చేయడం గొప్ప విషయం. ప్రఖ్యాత నాటకకర్త విలియం షేక్స్పియర్ గురించి “షేక్స్పియర్ను తెలుసుకుందాం” అనే పుస్తకాన్ని రచించారు. విద్యార్థిగా, ఉపాధ్యాయురాలిగా శేషమ్మ గారు షేక్స్పియర్ రచనల వల్ల బాగా ప్రభావితమై ఈ పుస్తకం రాశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇరవై ఆరు ఏళ్ల వయసులో నాటకాలు రాయడం మొదలు పెట్టి, యాబై రెండు ఏళ్ల వయసులో తనువు చాలించిన ఈ క్రియేటివ్ జీనియస్ (CREATIVE GENIOUS ) గురించి తెలుగులో శేషమ్మ గారు రాసినంత గొప్పగా ఎవరూ రాయలేరని నాకు అనిపించింది ఈ పుస్తకం చదివిన తర్వాత. 154 సానెట్లు, 39 నాటకాలు రాసిన షేక్స్పియర్ ముద్ర విశ్వ వ్యాప్తంగా సాహిత్య ప్రక్రియలపై ఎలా ప్రభావం చూపిందో గొప్పగా వివరించారు. షేక్స్పియర్ తన నాటకాలను ప్రదర్శించిన లండన్ లోని గ్లోబ్ థియేటర్ ను సందర్శించి వచ్చి, బార్డ్ పై తన అభిమనాన్ని చాటుకున్నారు శేషమ్మ గారు.
“పదహారవ శతాబ్దంలో ఆవిర్భవిస్తున్న మధ్యతరగతి వర్గం వారు షేక్స్పియర్ నాటకాల్లో కనపడరు” లాంటి మంచి పరిశీలనలు ఉన్నాయి ఈ పుస్తకంలో.
“షేక్స్పియర్ నాటకాలే మానవుని వీలునామా” అని బుచ్చిబాబు అన్నట్లు రచయిత్రి శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారు ప్రస్తావించడం కొసమెరుపు.
పదిహేడు వందల పదాలను, ఎన్నో పద బంధాలను ఇంగ్లీష్ భాషకు ఇచ్చిన షేక్స్పియర్ నాటకాలను క్లుప్తంగా తెలుగులోకి అనువదించి ఈ పుస్తకం ద్వారా పాఠకులకు అందించారు. అలాగే మూడు సొనెట్లను కూడా ఆంధ్రీకరించారు.
‘ఏమి రాత్రి ఇది! అటు స్వర్గంలోను ఇటు భూమి పైనా కూడా శాంతి కరువైపోయింది’ లాంటి అద్భుతమైన సంభాషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. బ్రిటిష్ రాచరికం గురించి, ఇంగ్లీష్ సమాజం గురించి ఈ పుస్తకం చదివితే కొంత వరకు అర్థం అవుతుంది. ట్యుడర్ వంశపు ఆఖరు పాలకురాలు ఎలిజబెత్ రాణి ఆస్థానంలో హామ్లెట్ నాటకాన్ని ప్రదర్శించాడు విలియం తను తండ్రి పాత్రలో నటిస్తూ. అప్పటి ఎలిజబెత్ రాణి గురించి శేషమ్మ గారు రాసింది చదివితే, ఇటీవల మరణించిన ఎలిజబెత్ రాణి నాకు గుర్తుకు వచ్చారు. శేషమ్మ గారి పరిశీలనా శక్తి, వ్యక్తీకరణ గొప్పగా ఉన్నాయి.
చదువు తీర్చిన జీవితం పుస్తకం చదివితే శేషమ్మ గారి కృషి, పట్టుదల, చదువు పట్ల తపన తెలుస్తాయి. వారి ప్రయాణం మనకి స్ఫూర్తిని కలుగజేస్తుంది.
షేక్స్పియర్ను తెలుసుకుందాం పుస్తకం చదివితే శేషమ్మ గారి ప్రతిభ, పరిశీలనా శక్తి, ఇంగ్లీష్ భాష మీద వారికి ఉన్న పట్టు, మక్కువ మనకు అర్థం అవుతాయి. షేక్స్పియర్ ను ఇంగ్లీషులో చదవాలన్న కోరికను మనలో కలుగజేస్తుంది ఈ పుస్తకం. ఒక రచయితకు అంతకంటే కావల్సింది ఏముంటుంది?
.. రాజేంద్రప్రసాద్ రెడ్డి
సీనియర్ పాత్రికేయుడు
.
Discussion about this post