ఇండియన్ సివిల్ సర్వీసెస్ ను ఐ.సీ.ఎస్. అంటారు. నా అభిప్రాయం ప్రకారం ఇందులో ‘ఐ’ అంటే ఇంటెలిజెన్స్ (మేథస్సు ఉన్న), ‘సీ’ అంటే క్లవర్ (తెలివిగల), ‘ఎస్’ అంటే సూపర్ (ఉత్తమమైన). ఆయా సబ్జెక్టులలో అత్యద్భుతమైన తెలివితేటలున్న బెస్ట్ బ్రెయిన్స్ మాత్రమే మంచి వడపోత ద్వారా ఈ సర్వీసుకు ఎన్నికై ఉత్తమమైన శిక్షణ పొంది సివిల్ సర్వీసెస్ అధికారులుగా ఉద్యోగాల్లో చేరి దేశంలో ప్రజా పాలనకు వెన్నెముక గా నిలుస్తారు.
దురదృష్టవశాత్తూ, ఆ సర్వీస్ లో ఉన్న కొంతమంది అధికారులను చూశాక ‘ఐ’ ఫర్ ఇడియట్స్ (వెధవలు), ‘సీ’ ఫర్ కన్నింగ్ (జిత్తులమారి), ‘ఎస్’ ఫర్ స్టుపిడ్స్ (బుద్ధిహీనులు) అనిపిస్తుందని కొందరు ఘాటుగా విమర్శిస్తుంటారు. దేశంలోనే ఉత్తమమైన సర్వీస్కు ఎన్నికై సేవలందిస్తున్న వారందరినీ ఇట్లా ఒకే గాటనగట్టి తిట్టడం పిచ్చితనం. కానీ, ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తానని ప్రతినబూని సర్వీసులో చేరిన అనేక మంది పాలకపక్షంతో, రాజకీయ పార్టీల అధినేతలతో అంటకాగుతున్న వైనం, అవినీతి సముద్రంలో మునిగితేలుతూ, ప్రజలకు దూరంగా బతుకుతూ వ్యవస్థకు కలిగిస్తున్న నష్టాన్ని చూస్తే గుండె మండిపోతుంది.
ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలు- శాసన వ్యవస్థ (లెజిస్లేచర్), అధికార వ్యవస్థ (ఎగ్జి క్యూటివ్), న్యాయ వ్యవస్థ (జుడీషియరీ), సమాచార వ్యవస్థ (మీడియా). ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న అధికార ప్రతినిధులు చట్టాలు చేయడంలో, చేసిన చట్టాలను అమలు చేయడంలో కీలక పాత్ర అధికార వ్యవస్థది. అధికారులు చాలా కీలకం కాబట్టే, బ్రిటిషర్స్ అందించిన ఒక పకడ్బందీ పద్ధతి (సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ట్రైనింగ్) పాటించి ఐ సీ ఎస్ అధికారులను తయారుచేసుకుంటున్నది భారత దేశం- ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా. ఎన్నిక అయ్యాక, నాయకుల కన్నా ప్రజల్లో ఎక్కువ గౌరవ మర్యాదలు, మన్ననలు దక్కేది క్షేత్ర స్థాయిలో ఐ ఏ ఎస్, ఐ పీ ఎస్ అధికారులకే. జిల్లాలకు రారాజులు వాళ్ళు.
మంత్రులు వెర్రి వెంగళప్పలు అయితే, ఈ అధికారుల హవాకు అడ్డూ అదుపూ ఉండదు. మందీ మార్బలం, బిళ్ళ బంట్రోతులు, విశాలమైన విలాస భవనం, విశేష అధికారాలతో కలెక్టర్లు రాజభోగాలు అనుభవిస్తారు. సెక్రటేరియట్ లో పనిచేసే అధికారులు కూడా వినూత్న పథకాలను ప్రతిపాదించడం ద్వారా తాము పనిచేసే శాఖలను కొత్తపుంతలు తొక్కించవచ్చు. ఒక మంచి నోట్ ఫైల్ తో, చొరవతో ఎంతో మందికి మంచి చేయవచ్చు. అయితే, ఈ ఉద్యోగం అనుకున్నంత పూలపాన్పు కాదు, చిత్త శుద్ధి, దేశభక్తి ఉన్న వాళ్లకు.
దర్శకుడు దేవ్ కట్టా సమున్నత ఉద్దేశంతో తీసిన ‘రిపబ్లిక్’ అనే తెలుగు సినిమా చూస్తే కలెక్టర్ గారు అనుకుంటే ఎన్ని మంచిపనులు చేయవచ్చో, అదే సమయంలో వారికి అడుగడుగునా ఎన్ని ఆటంకాలు, సంకట వాతావరణం, ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయో చూడవచ్చు. ముఖ్యంగా పొలిటికల్ బాసులు వీళ్ళను తొక్కిపట్టి కుక్కినపేనులా ఉండేలా చేసి ఆడుకుంటారు. అయినా లొంగకుండా కష్టనష్టాలకోర్చి తమ విధిని సమర్ధంగా నిర్వహిస్తూ చరిత్రలో నిలిచిపోయే అధికారులు కొందరైతే, పొలిటికల్ దోపిడీలో హ్యాపీగా పాలుపంచుకుని ముఖ్యమంత్రి, శాఖా మంత్రి పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టి దండుకునే వారు మరికొందరు.
ఇందులో మొదటి రకం అధికారులు ప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు. రెండో రకం వారు దొరకనంత కాలం నిర్లజ్జగా సంపాదించి, హవా నడిపించుకుని దొరికాక కేసుల్లో బుక్కయి కోర్టుల చుట్టూ తిరుగుతూ బతికేస్తుంటారు. మరీ ఆశకు పోకుండా బల్ల మీదకు వచ్చింది తీసుకుని తృప్తి పడి జీవితం లాగించే ఇంకో సెక్షన్ కూడా లేకపోలేదు.
సివిల్ సర్వీసెస్ వడపోత ద్వారా కాకుండా ఉద్యోగంలో అనుభవం మూలంగా ఐ ఏ ఎస్ హోదా పొందే రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ‘కన్ఫర్డ్ ఐ ఏ ఎస్ లు’ అంటారు. వారు కింది స్థాయిలో నలిగి ఉంటారు కాబట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు రెచ్చిపోతారు.
ఒక్కోసారి నిజమైన సివిల్ సర్వెంట్లను ఈ కన్ఫర్డ్స్ కుమ్మేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇదొక గమ్మతైన పరిస్థితి. కులం-విశ్వసనీయత ప్రాతిపదికన ప్రతి ప్రభుత్వం కొందరు అధికార్లకు పెద్దపీట వేసి, మరి కొందరిని తొక్కేయడం, కావలసిన వారిని చీఫ్ సెక్రటరీగా నియమించడం విచారకరం. అయినా సరే, ఐ ఏ ఎస్ అధికారులకున్న సంఘాలు ఇలాంటి ప్రమాదకర పరిణామాల గురించి చర్చ జరపకపోవడం మరొక విషాదం. దేశం కోసం ఓపెన్ గా మాట్లాడడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని నమ్మే వాళ్ళే ఈ సంఘాల్లో ఎక్కువగా ఉన్నట్లు అనుమానం.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో చాలా చోట్లా ఈ సివిల్ సర్వీస్ అధికారులు అసలున్నారా? లేరా? అన్నట్లు పాలకులు పాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లో, మంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తే సుఖం- శాంతి- పదోన్నతి- అమ్యామ్యా అనుకునే వాళ్ళు ఎక్కువ కావడంతో సివిల్స్ చార్మ్ తగ్గిందని సీనియర్లు బాహాటంగా అంటున్నారు. ఒంగరా బాబూ…అని మంత్రి అంటే బోర్లా పాకే కెరీర్ సెంట్రిక్ అధికారులు ఎక్కువ కావడం కాల మహిమ. అట్లాగని, ఒకప్పటి సీనియర్లు కూడా అంత నికార్సయిన ప్రజల పక్షపాతులు, శుద్ధపూసలు అనలేం.
నేను ఉద్యోగ రీత్యా దాదాపు డజను మంది సివిల్ సర్వెంట్లను (కేంద్ర కార్యదర్శి స్థాయి అధికారులు సహా) చాలా దగ్గరి నుంచి చూశాను. కొందరితో కలిసి పనిచేసాను కూడా. అందులో 99 శాతం మంది ఒట్టి మూర్ఖులు. డాబూ దర్పం- సూటూ బూటూ తప్ప బుర్రలో గుజ్జు శూన్యం. అసలు వీళ్లకు ఇంత మంచి ఈ ఉద్యోగం ఎట్లా వచ్చింది? వీళ్ళు దాదాపు 30 ఏళ్లపాటు ఎలా పనిచేశారు? అనిపించింది.
అందులో ఒకడైతే, అసలు మనిషి కేటగిరీ కిందకే రాడు. ఉద్యోగులందరూ కష్టపడితే వచ్చే ఫలితాన్ని సొంత విజయంగా చూపుకుంటాడు. వాడు చేసిన తప్పుకు వేరే అనామకుడ్ని బలిచేస్తాడు. జీవన సంధ్యలోనూ నీతి నియమాలు లేవు, ధర్మాధర్మ విచక్షణ లేదు. మతం, కులం రొచ్చులో పొర్లి దేశ సేవ చేస్తున్నట్లు కలరిచ్చుకుంటూ జనాలను ఉద్ధరిస్తున్నామన్నట్లు భ్రమలో బతకడం ఒక మూర్ఖత్వం.
బురిడీ కొట్టించే భజనపరుల బృందం భజనను ఆస్వాదిస్తూ, వాళ్ళు చెప్పే చాడీలపై స్పందిస్తూ, చిత్తశుద్ధితో పనిచేసే వారిని రాచిరంపాన పెడుతూ వ్యవస్థలను దుంపనాశనం చేసే నాసి-సన్నాసి రకం వాళ్ళు ఎక్కువగా కనిపించారు.. నా అదృష్టం బాగోలేక.
సివిల్ సర్వెంట్స్ కోరలు పీకి, వెన్నెముక లేకుండా చేసి పంపుతారేమో అనిపిస్తున్నది. ఇందులో స్వయంకృతాపరాధం కొంత, రాజకీయ రాబందుల పాత్ర కొంత. అందుకేనేమో, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి ఆ మధ్యన బ్యూరోక్రాట్స్ ను ‘మా చెప్పులు మోసే’ బ్యాచ్ అని బాహాటంగా అని నాలుక కరుచుకుంది. “Aapko nahi pata bureaucracy kuchh nahi hoti, chappal uthanewali hoti hai. Chappal uthati hai hamari. Hum log hi raji ho jate hai uske liye. (You do not know that bureaucracy is nothing. Bureaucracy is there to pick up our chappals (slippers). They pick up our slippers. We only got agreed for that),”
అని ఆమె అన్నట్టు వచ్చిన వీడియో చక్కర్లు కొట్టింది. దేశాన్ని బాగుచేసే సత్తా, ప్రజలకు ప్రత్యక్షంగా మేలు చేసే అవకాశం ఉన్న బెస్ట్ బ్రెయిన్స్ కు ఇలాంటి దుస్థితి పట్టకూడదు.
ఆ మధ్యన తెలంగాణా కలెక్టర్ ఒకరు- ‘మర్యాదపూర్వకంగా’ ముఖ్యమంత్రి పాదారవిందాలను పబ్లిగ్గా స్పృశించి భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఇంకొకరు, రైతులు వరి వేయడానికి వీల్లేదాన్ని ధమ్కీ ఇస్తూ ‘సుప్రీం కోర్టు చెప్పినా వినను.. వెంటాడతా’ అని హెచ్చరించి ఇరుక్కున్నాడు. అప్పట్లో గనుల లీజులో గలీజుగా ఇరుక్కొని ఒక మేడమ్ కేసులతో ఇబ్బందిపడ్డారు. ఐ ఆర్ ఎస్ అధికారి ఒకరు ముంబాయిలో డ్రగ్స్ కేసులో బద్నాం అవుతున్నారు. రైతుల ఉద్యమాన్ని అణచడం ధ్యేయంగా ఒక ఐ ఏ ఎస్ బాబు గారు ‘వాళ్ళు ఇటొస్తే తలలు పగలగొట్టండి.. మిగిలింది నేను చూసుకుంటా’ అని ఆదేశాలు ఇచ్చి రచ్చ రచ్చ అయ్యారు. ఇంకొకడు ఒక వ్యక్తి దగ్గర ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించినా అపవాదులు వస్తాయనేది వేరే విషయమైనా, ఈ సివిల్ సర్వెంట్స్ కు కమ్యూనికేషన్ సమస్య ఉందని నాకు చాలా సార్లు అనిపించింది.
నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే… వ్యవస్థలో మంచీ చెడూ ఉంటాయి. పోలీస్ బాసులంటే ఇలా ఉండాలని అనిపించే ఒకరిద్దరు అసలు సిసలైన ఐ పీ ఎస్ అధికారులు నాకు వృత్తిలో తారసపడ్డారు. కానీ ఈ మధ్యన పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీల చేతులోకి వెళ్ళిపోయాక ఐ పీ ఎస్ అధికారులు గత్తర ఇక్కడ ఉంటే మనకెందుకని వేరే వైపు చూడడం ఎక్కువయ్యింది. ఎన్నికల సమయంలో అధికార పార్టీ వాళ్ళు పంచిపెట్టే నోట్ల కట్టలకు, సారా బుడ్లకు పోలీస్ ఎస్కార్ట్ ఉండడం బాధాకరం.
హోం మంత్రి గారు నెలకు వంద కోట్లు వసూలు చేసి ఇవ్వమన్నారని ఏకంగా ముంబాయి పోలీస్ కమిషనర్ గా పనిచేసిన ఒక ఐ పీ ఎస్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, హక్కుల సంఘాల నేతలను లేపేయడం, జర్నలిస్టులను దొంగ కేసుల్లో అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేయడం, సమాంతర నేర సామ్రాజ్యం నడపడం, చట్టాన్ని చేతులోకి తీసుకుని వ్యవహరించడం వంటి పనుల కారణంగా చాలా మంది పోలీసు అధికారులు చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారు.
పదవిలో ఉండగా పదోన్నతుల కోసం, పదవీ విరమణ చేశాక భవిష్యత్తులో దక్కే అవకాశం ఉన్న పదవుల మీద మోజుతో పొలిటికల్ యాక్టివిస్టులుగా పనిచేసే సివిల్ సర్వెంట్స్ క్రిమినల్స్ తో, దేశ ద్రోహులతో సమానం. ఇలాంటి అధికారులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇలాంటి పాపాలు ఒట్టిగానే పోవనుకోండి.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
29 సంవత్సరాల సర్వీసులో 54 సార్లు బదిలీకి గురైన 1991 బ్యాచ్ ఐ ఏ ఎస్ అధికారి అశోక్ ఖేంకా లాంటి అధికారులు ఎంతో స్ఫూర్తినిస్తారు. అట్లాగే, 1956 బ్యాచ్ అధికారి ఎస్ ఆర్ శంకరన్ స్ఫూర్తిదాయకంగా సేవలందించి ‘ప్రజల అధికారి’గా జనాల గుండెల్లో నిలిచిపోయారు. దాదాపు ఇరవై ఏళ్ళ కిందట ఆయన్ను కలిసి ఇంటర్వ్యూ చేసిన నేను అయన గడిపిన సాధారణ జీవితాన్ని, ఆయనలో నీతి నిజాయితీలను చూసి అబ్బురపడ్డాను. అయన ఆదర్శప్రాయుడు, సదా స్మరణీయుడు. ఆయనకు అందుకే విగ్రహం కూడా కట్టి ప్రజలు, అధికారులు ఆరాధిస్తున్నారు.
ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని, మాయావి డబ్బు వలలో పడకుండా, విలాసజీవితాలపై మోజు లేకుండా మన సివిల్ సర్వెంట్స్ దేశం కోసం స్వతంత్ర భావనతో నిస్వార్ధంగా పనిచేయాలి. సోషల్ మీడియాను అండగా చేసుకుని, సదాలోచనాపరుల భాగస్వామ్యంతో, నియమ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించి ప్రజలకు మేలు చేయడం కోసం సివిల్ సర్వెంట్స్ కృషి చేస్తారని ఆశిద్దాం.
.. డాక్టర్ ఎస్ రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు

.

Discussion about this post