భగవాన్ శ్రీ రమణమహర్షి తమిళనాడు మధురైకు దగ్గరలో ఉన్న తిరుచ్చిళి అనే గ్రామంలో అళగమ్మ-సుందరామయ్యరు అనే పుణ్యదంపతులకు పునర్వసు నక్షత్ర పుణ్యదినాన అనగా 30 డిశెంబరు 1879 న జన్మించారు.
భగవాన్ తన 16వ యేట ఒకసారి మేడపై పడుకుని ఉండగా హఠాత్తుగా శ్వాస ఆగిపోయినట్లు, దేహం బిగుసుకుపోయి చనిపోయినట్లు అనుభూతి కలిగింది. శరీరం నిర్జీవం అయిపోయినా కూడా ఆయన ఆలోచన ఇట్లా కొనసాగింది-
ఇప్పుడు ఈ శరీరం చనిపోయింది. దీన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేస్తారు. అది కాలి బూడిదవుతుంది.
కానీ “నేను” అనేది మాత్రం శరీరంతో పాటు చావక మిగిలి ఉంది. కాబట్టి “నేను” అనేది శరీరం కాదు. ఈ “నేను” శరీరంతో పాటు చచ్చేది కాదు. అనే భావం అతనిలో స్థిరపడింది.
నేను ఈ శరీరాన్ని కాను. “నేనున్నాను” అన్న ఎఱుకయే “నేను” అని తెలుసుకున్నారు. ఇదంతా కేవలం ఆలోచనగా కాక అనుభవంగా మారుకుంది. వెంటనే శరీరంలో చలనం వచ్చి మామూలుగా అయినారు.
ఆ స్వానుభవంతో మనిషి ఋషి అయినారు. వైరాగ్యం పెరిగింది. బాహ్యవిషయాలపై ఆసక్తి తగ్గింది. ఇల్లు విడిచి అరుణాచలం చేరారు. శివలింగాన్ని కౌగిలించుకుని, తండ్రీ! నీ ఆజ్ఞ మేరకు వచ్చాను. అంటూ ఆనందబాష్పాలతో అభిషేకించారు. నమస్కారం చేయలేదు, సాష్టాంగపడలేదు. ప్రదక్షిణం చేయలేదు. ఏ స్తోత్రమూ చేయలేదు. తండ్రీ! అని సంబోధించారు. శరణాగతికి గొప్ప అర్థం చూపారు. ప్రయాణంలో మిగిలిన పైకాన్ని బయట కోనేరులో పారేశారు. కౌపీనం ధరించారు. మౌనం పట్టారు. అరుణాచలమే సింహాసనంగా ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఏలారు 54 ఏళ్లు.
ఇంట్లోవాళ్లు ఇతని కోసం దేశమంతా గాలించారు. అరుణాచలంలో యోగిగా ఉన్నాడని తెలిసి బయలుదేరింది తల్లి. కుమారుని అవతారం చూసి భోరుమని ఏడ్చింది. తనతో ఇంటికి రమ్మంది. స్వామి మౌనం వీడలేదు. ప్రక్కనున్నవారు పెన్సిలు, కాగితం ఇచ్చి తల్లికి ఏదైనా తెలియజేయమన్నారు.
అందులో ఇలా వ్రాశారు-
కర్త (ఈశ్వరుడు) వారి వారి ప్రారబ్ధకర్మానుసారము జీవులను ఆడిస్తున్నాడు. జరగవలసిన దానిని ఎవరెంత అడ్డుపెట్టినా జరిగి తీరుతుంది. జరుగనిది ఎవరెంత ప్రయత్నించినా జరుగనే జరుగదు. ఇది సత్యము. కనుక మౌనముగా ఉండుటయే ఉత్తమం.
కుమారుని ఉన్నతస్థాయిని గుర్తించి ఆమె తన జీవిత అంత్యం వఱకు భగవాన్తోనే గడిపి, ఆయన ఒడిలోనే చివరిశ్వాసను విడిచింది. భగవాన్ ఆమెకు ముక్తిని ప్రసాదించారు.
తిరుపతి వేంకటకవులు సైతం పాదాభివందనం చేసిన మహాకవులు, తపస్వి, మంత్రద్రష్ట అయిన శ్రీ కావ్యకంఠ గణపతిముని భగవాన్ ను దర్శించి “భగవాన్! నేను చదువని శాస్త్రం లేదు, జపించని మంత్రం లేదు. అయినా నేను శాంతిని పొందలేకున్నాను. మార్గం చూపండి” అని వేడుకున్నాడు.
భగవాన్ కరుణతో తన 12 ఏళ్ల మౌనాన్ని వీడి, గొంతు సవరించుకుంటూ మెలమెల్లగా ఇట్లా చెప్పారు- “నేను-నేను” అంటున్నావే ఈ “నేను” అనేది ఎక్కడ నుంచి పుడుతోందో గమనించి చూడు. మనస్సు అందులో లీనమౌతుంది. అదియే తపస్సు. మంత్రాన్ని జపించేటప్పుడు మంత్ర నాదం యెక్కడ నుంచి పుడుతోందో గమనించి చూడు. మనస్సు అందులో లీనమౌతుంది. అదియే తపస్సు.” అని ఉపదేశించారు. గణపతిముని ఆ దివ్యమైన ఉపదేశానికి పులకించినవాడై సాష్టాంగపడీ ఆశువుగా భగవాన్ మీద శ్లోకాలు పాడారు.
గణపతిముని తన దివ్యదృష్టితో చూచి భగవాన్ శ్రీ రమణమహర్షి సాక్షాత్తు పార్వతీదేవి ముద్దుల కుమారుడైన కుమారస్వామి అవతారమని నిరూపించి లోకానికి చాటారు.
కుల, మత ప్రమేయం లేకుండా లక్షలాదిమంది జనం చేరారు. ప్రశ్నలు వేసి సమాధానం పొందారు. అవన్నీ పెద్ద పెద్ద గ్రంథాలైనాయి. చిన్న గుడిసె ఇప్పుడు పెద్ద గుడి అయ్యింది. భగవాన్ మాత్రం గోచీ, తుండుగుడ్డ, ఊతకర్ర, కమండలం తప్ప ఇంకేవీ ముట్టుకోలేదు. ఇవే ఆయన ఆస్తి.
ఒక్క మానవులకే గాక, గోవు, జింక, కాకి, కుక్క మొదలైన జీవజాలానికి కూడా ఆయన ముక్తిని ప్రసాదించారు. నేటికీ శ్రీరమణమహర్షి ఆశ్రమంలో వీటి సమాధులు ఉన్నాయి.
చివరికి భగవాన్ 1950 ఏప్రిల్ 14వతేది రాత్రి 8-47 నిమిషాలకు మహానిర్యాణం పొందారు. ఒక జ్యోతి రూపంలో ఆయన అరుణాచలంలో కలిసిపోయారు. ఈ జ్యోతిని వేలాది భక్తజనమంతా చూసి తరించారు. నేటికీ రమణమహర్షి సమాధి సన్నిధిలో గొప్ప శాంతి ఆవరించి ఉంటుంది.
ఆయన ఉపదేశసారమంతా ఒక్కటే-
“నిన్ను నీవు తెలుసుకో” అని.
“నేను” అనేది ఇప్పుడు దేహం వఱకే పరిమితమైపోయింది. నేనెవడను? అనే ఆత్మశోధన ద్వారా ఈ దేహపరిమితమైన నేను, అపరిమితమైన “నేను”గా మారుకుంటుంది. అంటే చిన్న నది సముద్రంలో కలిసి అనంతమైన తత్త్వంగామారుకున్నట్లు, ఈ చిన్న “నేను” ఆ అనంతమైన “నేను”లో కలిసిపోతుంది. అదే ముక్తి అంటే. ఇంకేమీ కాదు.
జ్ఞానులు చెప్పే ఆత్మకు, భక్తులు చెప్పే దైవానికి, రమణమహర్షి చెప్పే ఈ “నేను”కు ఏ తేడా లేదు. ఆత్మ-దేవుడు-ఓంకారం-నేను ఈ నాలుగూ ఒకటే అర్థం. భగవంతునికి నిజమైన పేరు, అర్థం “నేను” అంటారు భగవాన్.
నేనెవడను? అనే ఆత్మశోధన కన్నా గొప్ప కర్మగాని, గొప్ప భక్తిగాని మరేదీలేదు. “నేను”ను తెలుసుకుంటే, ఏకకాలంలో అన్నీ తెలుసుకున్నట్లే. నేనెవడను? అనే ఆత్మవిచారణ ద్వారా మనమందరం తరియింతుము గాక.
(రమణ మహర్షి జయంతి సందర్భంగా)
…దేవీప్రసాద్ ఒబ్బు,
అత్యాశ్రమం, శ్రీకాళహస్తి
9866251159

.

Discussion about this post