నచ్చిన వారినెల్లా చెరిచే రాక్షసుడు, ఆపైన అధికార మదం.. ఎన్ని అకృత్యాలు చేసినా- పాలుతాగే దొంగపిల్లిలా కళ్లుమూసుకుని వర్తిల్లే అధికార పార్టీ దన్ను.. తన కనుసైగలతోనే పోస్టింగులు వేయించుకున్న ఖాకీదళాలు తన దుర్మార్గాలను చూసి మిన్నకుండిపోతున్నారనే ధైర్యం.. తన మోచేతి నీళ్లు తాగి బతికే గణాలేవీ తనను ఎదిరించి ప్రశ్నించవనే ధీమా.. ఇవన్నీ వెరసి.. రాజకీయ కుటుంబానికి వారసుడిగా రేపో మాపో ఎమ్మెల్యే కాగలనని అనుకుంటున్న వనమా రాఘవేంద్రను కీచకుడిని చేశాయి. ప్రస్తుతం తెలంగాణను కుదిపేస్తున్న ఈ నయా కీచకుడి ధూర్త పోకడలు, అందుకు కారణాలు, పర్యవసానాలపై.. సీనియర్ పాత్రికేయుడు ఎస్.రాము విశ్లేషణాత్మక కథనం.. adarsini.com కోసం..
ఈనాడు పత్రిక కథనం ప్రకారం వాడొక ‘కాలకేయుడు’, టీవీ-9 ఛానల్ లెక్కలో వాడొక ‘కామకేయుడు.’
ఇతర మీడియా సంస్థలు చెప్పేదాన్ని బట్టి ‘నరరూప రాక్షసుడు’, ‘మానవ మృగం’, ‘దుర్మార్గుడు’, ‘అధికార ఉన్మాది’, చిత్తకార్తెకుక్క’ వగైరా వగైరా. నన్నడిగితే మాత్రం వాడొక ‘అధికార మదాంధుల, అక్రమార్కుల, అవినీతిపరుల, ధన బకాసురుల, కామ పిశాచుల’ సంయుక్త ప్రతినిధి.
తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర అలియాస్ రాఘవ రూపంలో వీడు బయటపడ్డాడు. కానీ దేశవ్యాప్తంగా అనేక మంది మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, బలవంతులైన అధికార పార్టీ నాయకుల పుత్రరత్నాలు ఇదే కోవకు చెందిన వారై ఉన్నారు.
అయ్య పదవి అడ్డంపెట్టుకుని చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, గూండాలను పోషించడం, ప్రయివేట్ పంచాయతీల్లో తలదూర్చి దండుకోవడం, సెటిల్మెంట్ల పేరుతో కబ్జాలు చేయడం, కాంట్రాక్టుల్లో వాటా కొట్టేయడం, బదిలీల్లో సొమ్ముచేసుకోవడం, పోలీసు- అధికార వ్యవస్థను నిర్వీర్యం చేయడం, మందు-మగువలతో కాలక్షేపం చేయడం, ఎదురు తిరిగితే దౌర్జన్యం చేయడం- ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే తంతు. ఇదొక వ్యవస్థీకృతమైన రాజకీయ సంస్కృతి.
‘‘మా కుటుంబ ఆస్తి వివాదంలో జోక్యం చేసుకొన్న వనమా రాఘవేంద్రరావు.. ఏ భర్తా తన చెవితో వినగూడని మాట నా చెవిలో వేశారు. కాదు ఆర్డర్ చేశారు. ‘నీ సమస్య తీరాలంటే నీ భార్యను తీసుకొని హైదరాబాద్ రా’ అన్నారు. అదీ పిల్లలు లేకుండా! ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలండీ..?’’ అని దీనంగా వ్యవస్థను ప్రశ్నిస్తూ ఒక బాధితుడు నిస్సహాయ స్థితిలో కుటుంబం సహా ఘోరంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కాలకేయుడిపై ఇంత హడావుడి జరిగింది.
లేకపోతే, ఈ తరహాలోనే అనేక నియోజకవర్గాల్లో బహిరంగంగా కొన్ని చోట్ల, చాపకింద నీరులా మరి కొన్నిచోట్ల సాగుతున్న ఇలాంటి దారుణ, అమానుష, అఘాయిత్యాలు నిస్సహాయ బాధితుల కన్నీటి సాక్షిగా, మౌన రోదనల నడుమ.. ఏ స్టార్ హోటల్లోనో మూడు పువ్వులూ, ఆరు పండ్ల మధ్య, బిర్యానీ ఘుమఘుమలు, లిక్కర్ వాసనల నడుమ సమాధి అయ్యేవి. ఈ పాపం ఎవ్వరిదని ప్రశ్నిస్తూ వెర్రిగాలీ వెళ్లిపోవడానికైనా వీల్లేదు. ఎందుకంటే.. గాలిని సైతం శాసించే సత్తా సత్తా ఉంది వీళ్లకి! ఈ ‘అధికార మదాంధుల, అక్రమార్కుల, అవినీతిపరుల, ధన బకాసురుల, కామ పిశాచుల’ బ్యాచ్ బలం, బలగం అలాంటివి.
రాఘవ ఒక పరమ లోఫర్, నీచ్ కమీనే కుత్తే అని పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో ఎవ్వరిని అడిగినా చెప్తారు. నాగ రామకృష్ణ అఘాయిత్యం చేసుకునే ముందు తాను పడిన మానసిక నరకాన్ని వీడియో రూపంలో విడుదల చేసి ఉండకపోతే.. ‘ఇట్లా జరిగిందట’ అని ఘనత వహించిన వివిధ పార్టీల నాయకులు, మీడియాలో కనిపించే దీన జనోద్ధరణ సంఘాల నాయకులు, ఎదుటోడు బూడిదై పోతున్నా మనదేమి పోయిందని చోద్యం చూసే జనాలు చెవులు కొరుక్కుని వదిలేసేవారు.
‘‘కనీసం తను డబ్బు రూపంలో ఏమన్నా అడిగినా నేను ఇచ్చేవాణ్ని. మనిషిని కోరుకున్నాడండీ. నా భార్యను కోరుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేను. నా భార్యకు ఇంకా తెలియదు. ఇంకో భయం ఏమిటంటే నేను వీళ్లతో పోరాటం చేసే పరిస్థితుల్లో లేను. వాళ్ల ఆర్థిక, రాజకీయ అండదండల ముందు నా స్థాయి సరిపోదు. కాబట్టి నేను ఒక్కడిని ఏమైనా చేసుకుంటే నా భార్య పరిస్థితి ఏంటి?
నా భార్యను అసలు వీళ్లు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లే. పిల్లలు ఏమైపోతారో అర్థం కావట్లే. అందుకే నాతోపాటే వాళ్లను తీసుకెళ్తా. దయచేసి నా నిర్ణయాన్ని తప్పుపట్టకండి,” అంటూ రామకృష్ణ ఆ వీడియోను, తన జీవన పోరాటాన్ని ముగించాడు. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సాఫీగా సాగిపోతున్న తమ సంసారజీవితాన్ని అప్పులు- ఆస్తి తగాదాలు దెబ్బతీస్తే, అదే అదనుగా రాఘవ అందులో నిప్పులు పోసి చలికాచుకునే ప్రయత్నం చేశాడని కూడా వివరించాడు.
రామకృష్ణకు అక్షరం (లేఖ) కన్నా ప్రత్యక్ష కథనానికి (సెల్ఫ్ వీడియో) ఉన్న ప్రభావశీలత అర్థం కాబట్టి సరిపోయింది. ఒట్టి లేఖ రాసిపోతే.. దాన్ని మింగేసి ఈ ఘోరోదంతాన్ని ఇప్పటికే సమాధి చేసేవారు. తన లెటర్కు పెద్దగా స్పందించని రాజకీయ పార్టీలు వీడియా బైటికి వచ్చాక బంద్ జరపడం, మీడియా ఎక్కువ ఫోకస్ చేయడం, అబ్బాయిని అప్పగిస్తానని అయ్య ప్రకటించడం, అతనిని పట్టుకోవడానికి భారీగా టీమ్స్ను ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పడం, ఆ తర్వాత పారిపోతుండగా పట్టుకున్నామని వారు ప్రకటించడం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని అధికార తెలంగాణా రాష్ట్ర సమితి ప్రకటించడం, ఆ నీచుడ్ని జైలుకు తరలించడం జరిగిపోయాయి.
రామకృష్ణ కుటుంబ బలవన్మరణం నేపథ్యంలో రాఘవ పాపాల చిట్టా బైటికి వస్తున్నది. నిజానికి ఆ అభాగ్యుడు బలిదానం చేసింది తన వేదనకు చరమగీతం పలుక్కుంటూనే, రాఘవ అకృత్యాలను ఆపి ఇతరులను రక్షించడం కోసమని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. బహుశా రామకృష్ణ చేసిన వీడియో చూసి బాధ తట్టుకోలేక.. సీపీఐ నారాయణ గారు వాడ్ని సంసారానికి పనికిరాకుండా చేయాలని అన్నారు. బహిరంగంగా జనం మధ్యన శిక్షించాలని బీజేపీ బండి సంజయ్ కోరారు. చాలా మంది జనం కూడా ఇలాంటి శిక్షలు కోరుకుంటారు. కానీ, ఇవి అయ్యే పనులు కాదు. సజ్జనార్ తరహా సజాతో సమస్య పరిష్కారం కాదు. వారెవ్వా.. అని చర్చలు జరుపుకోడానికి తప్ప అవి ఎందుకూ ఉపకరించవు.
రాఘవ లాంటి నీతీజాతీ లేని పుండాకోర్లు రాజకీయ వటవృక్షం నీడలో, అధికార భల్లూకం అండ దండలతో, సమాజహితం పట్టని జనాల మద్దతుతో, పచ్చి స్వార్థపరులై, అధికారస్వామ్యం ఆసరాగా విజృంభించి ప్రజాకంటకులు అవుతున్నారు. వ్యవస్థ వైఫల్యం వల్ల వీళ్ళు పుట్టుకొస్తున్నారు. సమష్టిగా మనం చేస్తున్న ఘోరమైన పాపం వల్లనే ఇలాంటి దుర్మార్గులు పుట్టుకొచ్చి జనాలను కాల్చుకు తింటున్నారు. ఈ పాప పంకిలంలో భాగం ఉన్న వాళ్ళు ఎవరంటే..
1) రాజకీయ నేతలు :
తండ్రి పేరు చాటున రాఘవ చెలరేగి చలామణి కావడం వెనక దోషుల లిస్టులో ఏ-1 ప్రస్తుత తెరాస అధిష్ఠానం ఉంటుంది. పదికి పైగా కేసులు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు వంటి ఆరోపణలు ఉన్న యువనేతకు పైవారి అండ లేకపోతే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేదా? గ్రాస్ రూట్ నాయకుడు వనమా వెంకటేశ్వర రావు రాజకీయ మనుగడే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుడు కోనేరు నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా సాగింది. గత మూడు దశాబ్దాలుగా రాఘవ చిల్లర పనులు చేస్తుంటే కాంగ్రెస్ నాయకత్వం కూడా కిమ్మనలేదు.
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన జలగం వెంకట్రావు కొత్తగూడెం ఎంఎల్ఏ అయ్యాక రాఘవ బ్యాచ్ పప్పులుడకలేదు. కొన్ని చెత్త రాజకీయ సమీకరణాలు, అనూహ్య కారణాల మూలంగా వెంకట్ రావు ఓడిపోయి వనమా గెలిచి అధికార పార్టీ తీర్థం తీసుకోవడంతో రాఘవకు కొత్త ఊపు వచ్చింది. కొడుకు చేస్తున్న ఘోరాలను కన్న ప్రేమతో భరించి, తన చేయి దాటి పోయిన తర్వాత నిస్సహాయంగా చేష్టలుడిగి చూసిన వనమాకు ఎంత బాధ్యత ఉందో, చెత్త పాలిటిక్స్తో నియోజకవర్గంలో జనాలను వేదనకు, భయాందోళనలకు గురికావడంలో పరోక్షంగా ముఖ్యమంత్రి, అధికార పార్టీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు అంతే బాధ్యులు కదా.
2) పోలీసులు :
రాఘవ లాంటి క్రిమినల్ను కేవలం ఎంఎల్ఏ కొడుకన్న కారణంగా పోలీసు బాసులు పెంచి పోషించారు. ఒకరిద్దరు మినహా చాలా మంది పోలీసు అధికారులు రాఘవకు బ్రహ్మరథం పట్టి స్వామికార్యం, స్వకార్యం తీర్చుకున్నారు. రాఘవ పెంచి పోషించిన గూండాలను, వాళ్ళ దారుణాలను పట్టించుకోకుండా పోలీసులు తమ బాధ్యతను విస్మరించారు. ఒక ప్రజా ప్రతినిధి కొడుకు ఘోరాలు చేస్తున్నాడని గూఢచారి వర్గాలు నివేదించి ఉంటాయి. ఇన్ని ఆరోపణలు వచ్చిన మనిషిని జిల్లాను ఏలిన ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎలా చూసీచూడనట్లు ఎట్లా వదిలేశారు? రాఘవ పాపంలో వారికి భాగం లేదని చెప్పగలమా? ప్రజాధనంతో అధికారం, భోగాలు అనుభవిస్తున్న అధికారులకు రామకృష్ణ లాంటి బాధితుల ఉసురు తగలకుండా పోతుందా?
3) మీడియా :
వ్యవస్థలు విఫలమైతే ఎత్తిచూపి న్యాయం చేయాల్సింది మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా రాఘవ లాంటి రాజకీయ రాబందుల కొడుకులు యాజమాన్యాల కారణంగా నిష్పాక్షికంగా పనిచేయలేని పరిస్థితి. చాలా మంది విలేకరులు వ్యాపార ప్రకటనల కోసం ఇలాంటి చెత్త గాళ్ళను కాకా పట్టాల్సి వస్తుంది. పైగా, వీళ్ళు వేసే ఎరలు వద్దని నిష్ఠతో ఉండడం కూడా అంత తేలిక కాదు. వాడు విదిల్చేవి ఎంగిలి మెతుకులన్న స్పృహలేక కొందరు, విధిలేక కొందరు, మనం కూడా లాగిస్తే పోలా? అని మరి కొందరు విలేకరులు బాధ్యతను విస్మరించబట్టి వ్యవహారం ఇక్కడిదాకా వచ్చింది. రాఘవ చేసిన దుర్మార్గాలపై పరిశోధనాత్మక కథనాలు రాస్తే.. నమస్తే తెలంగాణా, తెలంగాణ టుడే తప్ప వద్దని చెప్పే యాజమాన్యాలు ఏమి ఉంటాయి?
4) మేథావులు :
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య గురించి తెలిసి నేను కొత్తగూడెం, పాల్వంచలో ఉన్న పలువురితో మాట్లాడాను. వాడికి తిట్లు, శాపనార్థాలు పెడుతున్న వారంతా భయం కారణంగా మిన్నకుండాల్సి వచ్చింది. పాపం పండిందని వారంతా ఆనందిస్తున్నారు. రాఘవ లాంటి పాపాత్ముల భరతం పట్టే వ్యవస్థ సదాలోచన పరులు, మేథావులు ఏర్పరుచుకోవడం కష్టం కాదు. రాఘవకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడకపోయినా, కనీసం ఉప్పందించి సామాజిక మాధ్యమాల్లో వచ్చేట్లు చేస్తే బాగుండేది.
5) జనం:
ఈ ప్రజాస్వామ్యాన్ని పలుచన చేస్తున్న వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- బాధ్యతారహిత జనం గురించి. బీరు-బిర్యానీ-కరెన్సీ నోట్లకు ఓట్లు అమ్ముకోవడం వల్ల దారుణాలు జరుగుతున్నాయి. వీరిని చైతన్య పరిచే శక్తులు కరువయ్యాయి.అదే రాఘవ లాంటి వాళ్లకు వరం. అధికారంలో ఉన్న వారిని కేవలం ప్రజాసేవకులుగా చూడాల్సిన ప్రజలు వారికీ, వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం చాలా సమస్యలకు దారితీస్తోంది.
మన పనికి అక్కరకు రాకపోతారా? అని వంగి వంగి వినయంగా, భక్తి శ్రద్ధలతో మెలగడం వల్ల ప్రజా ప్రతినిధులు, వారి పిల్లలు తమని తాము ఎక్కువగా ఊహించుకుని నెత్తికెక్కి కూర్చుంటున్నారు. ఎన్నికైన వారిని, వారి కుటుంబాన్ని భజన చేసి లబ్ధి పొందే సెక్షన్ ప్రతిచోటా ఉంది. తామేది చేసినా చెల్లుతుందన్న అభిప్రాయం వీరిలో పాతుకుపోవడానికి జనాల ఓవర్ యాక్షనే కారణం. ఈ అరాచక పరిస్థితి మారనంత కాలం ఇలాంటి అకృత్యాలు నిరాటంకంగా సాగిపోతూనే ఉంటాయి.
వ్యవస్థ మొత్తం ఇప్పటికైనా మారకపోతే రాఘవలు పుడుతూనే, చెలరేగుతూనే, జనాలను హింసిస్తూనే ఉంటారు. తండ్రికున్న అధికారం, తాము పోగేసిన డబ్బు పుష్కలంగా ఉన్నందున రాఘవ కు జైల్లో రాచమర్యాదలు జరగవచ్చు. ఖరీదైన- తెలివైన న్యాయవాదులు తిమ్మిని బమ్మిని చేసి అతణ్ని బైటకు రప్పించవచ్చు. తాత్కాలికంగా కుక్కినపేను లాగా లో ప్రొఫైల్ లో ఉండి అయన వచ్చే ఎన్నికల్లో ఎవడ్నో పట్టుకుని- భారీగానే సమర్పించుకుని- తనకే పార్టీ టికెట్ తెచ్చుకోవచ్చు. తను పంచేవి తీసుకుని పాలిటిక్స్ లో ఇవి మామూలేనని జనం భారీగా ఓట్లు వేయవచ్చు. చివరకు కొత్తగూడెం ఎంఎల్ఏగా తను ఘన విజయం సాధించవచ్చు. మంత్రి అయినా కావచ్చు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఇవి ఏవైనా ఈ కాలమాన పరిస్థితుల్లో సాధ్యమే. ఆ అధికారం ఇచ్చిన దన్నుతో.. ఎం ఎల్ ఏ రాఘవ గారు ఇంకొన్ని కుటుంబాల మహిళలను భయపెట్టి హైదరాబాద్ రప్పించుకోవచ్చు. ‘అధికార మదాంధుల, అక్రమార్కుల, అవినీతిపరుల, ధన బకాసురుల, కామ పిశాచుల’ ప్రతినిధులను మొగ్గలోనే తుంచకపోతే ప్రతి చోటా ఇలాంటి అవాంఛిత పరిస్థితి తలెత్తవచ్చు. వ్యవస్థలు చిత్తశుద్ధితో, జనాలు నిజాయితీతో మంచి సమాజం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రవర్తించకపోతే- రాఘవ ఆర్డర్ వేసినట్లు భార్యను హైదరాబాద్ పంపి ఇంట్లో వెక్కివెక్కి ఏడవాల్సిన దుస్థితి దాపురిస్తుంది.
.. డాక్టర్ ఎస్. రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు
Discussion about this post