పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవాలని అనుకుంటే వాతలు మిగులుతాయే తప్ప.. ప్రయోజనం నెరవేరదు. గోవా తరహాలో.. ఏపీలోని తీరప్రాంతంలో ఉండే బీచ్ ప్రాంతాలు అన్నింటినీ మద్య ప్రవాహానికి అడ్డాలుగా మార్చేయాలని తద్వారా టూరిస్టులను బీభత్సంగా ఆకర్షించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న ఆలోచన సబబేనా? ఇది ఫలిస్తుందా? అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి.
దేశంలోనే అతిపెద్ద సముద్ర తీరప్రాంతం ఏపీకి ఉండవచ్చు గాక. కానీ.. బీచ్ టూరిజం అభివృద్ధి చేయడానికి ఇదంతా అనువైనదేనా.. అనే కోణం కూడా ముఖ్యం. వీటన్నింటినీ మించి.. బీచ్ లలో రాత్రి ఎనిమిదింటి వరకు మద్యం తాగడానికి అనుమతులు ఇచ్చేసిన తర్వాత.. ఆ పరిసరాల్లో క్రైమ్ రేట్ పెరిగితే దానికి జవాబుదారీతనం ప్రభుత్వం తీసుకునేట్లయితే మాత్రమే, బాధ్యత తమదేనని ఒప్పుకునేట్లయితే మాత్రమే ఆపని చేయాలి. లేకుంటే పునరాలోచించుకోవాలి.
రాష్ట్రంలో ఓ కొత్త విధానానికి ఎన్డీయే సర్కారు శ్రీకారం చుడుతోంది. మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గోవా తరహాలో బీచ్లలో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత ట్రయల్ రన్ లాగా సూర్యలంక, విశాఖ బీచ్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోవా తరహాలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేసి, ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు మద్యం సేవించేందుకు అనుమతిస్తారు. ఈ రెండు బీచ్ లలో వచ్చే స్పందనను బట్టి.. భవిష్యత్తులో అన్ని బీచ్లలో అమలు చేయాలని అనుకుంటున్నారు.
బీచ్ షాక్స్ ఏర్పాటుచేయడం, మద్యప్రియత్వాన్ని ప్రత్యేకించి బీచ్ ప్రాంతాలలో ప్రోత్సహించడం గమనిస్తే.. ప్రభుత్వం సరైన దిశలోనే ఆలోచన చేస్తున్నదా అనే అనుమానం మనకు కలుగుతుంది. కొన్ని అంశాలను ఖచ్చితంగా పరిగణించి తీరాలి.
=) సాధారణంగా మన దేశం ఉన్న స్థితిని బట్టి.. తూర్పున ఉన్న బంగాళాఖాతం బీచ్ లకు, పశ్చిమాన ఉన్న అరేబియా బీచ్ లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆయా ప్రాంతాల ఇసుకతో సహా మనం ఈ తేడాలను గమనించవచ్చు. కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు చెందిన బీచ్ లు ఎక్కువ పాపులర్ కావడానికి ఇది ఒక కారణం.
=) బీచ్ టూరిజం అనేది కేవలం ఆయా బీచ్ మద్యం తాగడానికి అనుమతించడం వల్ల మాత్రమే పెరుగుతుందనుకోవడం భ్రమ. స్థానికంగా అక్కడ ఉండే ఇతర వాతావరణ పరిస్థితులన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. అనేక ఇతర టూరిజం ఎట్రాక్షన్స్ కూడా ఆయా బీచ్ లలో ఉండాలి. వాటికి వాతావరణం అనుకూలిస్తుండాలి. అంతా కుదిరితేనే బీచ్ టూరిజం అవుతుంది. అంతే తప్ప బీచ్ బార్లు.. బీచ్ టూరిజం అనిపించుకోవు.
=) నిజంగానే టూరిజం అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అయితే గనుక.. కేవలం బీచ్ లలో మద్యం తాగించడం సరిపోదు. ఆ పరిసరాల్లో ఇతర టూరిస్టు ఎట్రాక్షన్స్ ప్రదేశాలు ఏమైనా ఉంటేనే.. దానికి అదనపు హంగుగా ఇది ఉపయోగపడుతుంది. ఆయా ఇతర టూరిజం ప్లేసెస్ అన్నింటికీ.. రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉండాలి. రోడ్లు బాగుండాలి. ఆయా ప్రాంతాల్లో కూడా ఆతిథ్య రంగం మెరుగ్గా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే.. బీచ్ లలో ఓరోజు తాగుతూ గడపడానికి టూరిస్టులు ఇష్టపడతారు. అంతే తప్ప.. కేవలం సముద్రం ఎదురుగా కూచుని తాగడానికి ఒకటిరెండు సార్లు ముచ్చటగా వస్తారేమో తప్ప.. కలకాలం అలా జరగదు. సుదీర్ఘకాలం ఇది సక్సెస్ కావాలంటే ప్లాన్ మార్చుకోవాలి.
=) ఇలా పగలంతా ఇతర ప్రాంతాల వారు వచ్చి తాగుతూ కూర్చునే సదుపాయం కల్పించిన తర్వాత.. ఆటోమేటిగ్గా ఆ ప్రాంతాల్లో క్రైం రేట్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. టూరిస్టులు చేసే క్రైమ్ మాత్రమే కాదు.. వారి పట్ల జరిగే క్రైం కూడా పెరుగుతుంది. అలాంటి పెరిగే క్రైమ్ కు ప్రభుత్వం జవాబుదారీ తనం వహిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
=) బీచ్ షాక్స్ ల వల్ల అదనంగా రాగల లాభాలు- క్రైమ్ రేట్ పెరగకుండా తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలకు కాగల వ్యయం, క్రైమ్ పెరిగితే జరిగే నష్టం ఇవన్నీ సమతూకంతో బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేస్తే బాగుంటుంది.
..ఇలాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని బీచ్ టూరిజంను, బీచ్ సాక్స్ ను ఏపీ సర్కారు మొదలు పెడితే బాగుంటుంది. గోవా తరహాలో చేయాలని సరదా పడి.. అత్యుత్సాహంతో ప్రారంభించి.. కొన్నాళ్ల తర్వాత మూతపడితే ప్రభుత్వానికి పరువు పోతుంది.
..కృష్ణమోహన్ దాసరి
సీనియర్ పాత్రికేయుడు, డల్లాస్

.
Discussion about this post