‘ఓం నమ:శివాయ’.. ‘హర హర మహదేవా శంభోశంకర’… అంటూ శివనామ స్మరణలతో చతుర్మాడ వీధులు మార్మోగాయి. ‘జైజై మాతా.. జగన్మాతా’ అంటూ జ్ఞాన ప్రసూనాంబను భక్తులు స్తుతించారు. చతుర్మాడ వీధుల్లో ఏ నోట చూసినా ఉమామమేశ్వరుల నామస్మరణే. జయజయ ధ్వానాల మధ్య శివ, పార్వతుల రథాలు ముందుకు సాగాయి.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 7వ రోజైన బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవం తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.
ఉదయం 9గంటల నుంచే తేరువీధి, నెహ్రూవీధి, నగరివీధి, బజారువీధి భక్తులతో నిండిపోయాయి. సర్వాలంకార భూషితులైన గౌరీశంకరులు అలంకార మండపం నుంచి ఉదయం 10గంటలకే బయలుదేరి బిక్షాల గాలిగోపురం ముందు భాగాన ఉన్న రథాల వద్దకు చేరుకున్నారు. ఒకరథంపై గంగాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరుడు… మరో రథంపై శంకరుని దేవేరి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు రథాలను అధిరోహించారు.
రథాలపై ఆశీసులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉదయం 11గంటలకు స్వామివారి రథం బయలు దేరింది. స్వామివారి రథానికి ఉన్న మోకులను వందలాది మంది భక్తులు పట్టుకుని ముందుకు లాగారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆకాశాన్ని తాకే విధంగా ఉన్న స్వామి వారి రథం ముందుకు కదలుతుంటే భక్తులందరూ శివనామస్మరణ చేశారు. తేరువీధి. నెహ్రూవీధి. నగరివీధి గుండా స్వామి వారి రథాన్ని భేరివారి మండపం వరకు మొదట లాగారు. ఆ తరువాత అమ్మవారి రథాన్ని ముందుకు కదలించారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని కీర్తిస్తూ భక్తులు రథాన్ని ముందుకు లాగుతూ వచ్చారు.
అమ్మవారి రథం పెండ్లిమండపం వరకు తీసుకువచ్చి అక్కడ కొద్దిసేపు ఆపారు. ఆ తరువాత స్వామివారి రథాన్ని భేరివారి మండపం నుంచి బిక్షాల గాలిగోపురం వరకు తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారి రథాన్ని నగరివీధి గుండా బిక్షాల గాలిగోపురం వరకు జయజయ ధ్వానాల మధ్య తీసుకువచ్చారు. రథోత్సవం మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. ఇక రథోత్సవం సందర్భంగా ఉప్పు, మిరియాలు చల్లుతూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ మిరియాలను తింటే కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అదేవిధంగా రథాలు కదిలే మార్గంలో ఇసుక చల్లారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, పలువురు ప్రముఖులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ముక్కంటి క్షేత్రం భక్తజనసంద్రం
శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు రథోత్సవం పురస్కరించుకుని వేలాది మంది తరలి వచ్చారు. పట్టణ వాసులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు ఈ వేడుకలను తిలకించడానికి తరలి రావడంతో నాలుగు మాడవీధులు భక్తజన సంద్రంగా మారాయి. ఇక వందలాది మంది భక్తులు మాడవీధుల్లో మిద్దెల పైకి ఎక్కి రథోత్సవం తిలకించారు.
ఓ వైపు ఎండ మాడి పోతున్నా లెక్క చేయకుండా భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. కాగా రధోత్సవం సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచారు. భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చోరీలకు పాల్పడుతున్న పలువురిని అదుపులోక తీసుకున్నారు. రథోత్సవం సందర్భంగా తెలుగు సంస్కృతిని చాటి చెప్పే విధంగా ప్రదర్శించిన వివిధ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
Discussion about this post