ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకులకు ప్రత్యేకహోదా అనేది ఒక ఆటలో అరటిపండు లాగా తయారైంది. ఇతరత్రా అంశాలేవీ లేనప్పుడు.. రాజకీయంగా, రాష్ట్రం కోసం తమ చిత్తశుద్ధి ప్రశ్నార్థం అవుతోందని భయం కలిగినప్పుడు.. అటు పాలక- ఇటు విపక్ష పార్టీలు.. ‘ప్రత్యేక హోదా’ అనే అస్త్రాన్ని బయటకు తీస్తున్నాయి.
ఢిల్లీ వెళ్లాలి.. మంత్రులతో మాట్లాడాలి.. అమిత్ షా అపాయింట్మెంట్ కావాలి.. టక్కున సమయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకహోదా గుర్తుకువస్తుంది. దానికోసం కేంద్ర హోంమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి ఢిల్లీ వెళ్లాం అంటారు. మొన్నటికి మొన్న తిరుపతిలో అమిత్ షా తో సమావేశం జరిగినప్పుడు కూడా.. ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రత్యేకహోదాను ప్రస్తావించారు.
తెలుగుదేశం పార్టీ ఏమీ తక్కువ తినలేదు. రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డాక తన తొలిసారి పాలనలో హోదాకోసం పోరాడాలనే ప్రజల్లోని స్ఫూర్తిని సర్వనాశనం చేసేసిన చంద్రబాబునాయుడు, తన పాలన అవసాన దశలో.. అదే హోదాకోసం ధర్మపోరాట దీక్షలు అంటూ కొత్త డ్రామా నడిపి అభాసు పాలయ్యారు. ప్రత్యేకహోదా గురించి ఆయన చిత్తశుద్ధిని ప్రజలు నమ్మలేదు.
కానీ చంద్రబాబు ఇప్పటికీ అదే మాటతో ప్రజల్ని బురిడీ కొట్టించాలని చూస్తుంటారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ప్రతిసారీ.. చంద్రబాబు ఎంపీలకు హోదాకోసం పోరాడాలనే ఉపదేశం చేస్తుంటారు.
ఆ వంచన పర్వాలకు ఇక తెరపడింది. తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో హోదా గురించి అడగడమూ.. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్.. ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో ప్రత్యేకహోదా అంశం ముగిసిపోయింది’ అని కుండబద్ధలు కొట్టినట్టు తేల్చేయడం జరిగిపోయాయి.
ఇప్పుడు ప్రజల ఆశ ఏంటంటే.. ఎటూ హోదా జరగదని కేంద్రం అంటోంది. రాష్టంలోని పాలక, విపక్షాలు.. తమ విధానం ఏంటో తేల్చుకోవాలి. కేవలం హోదా అనేమాట చుట్టూ ఇంకా కొన్నేళ్ల పాటు వాళ్లు డ్రామాలు నడిపిస్తూ ప్రజలను వంచన చేయదలచుకున్నారా? లేదా, పోరాడేంత సత్తా వారికి ఉందా అనేది ప్రధానం.
ఎంత పోరాడినా సరే.. హోదా వస్తుందనే నమ్మకం లేదు. కేంద్రం మెడలు వంచగల స్థాయి పోరాట పటిమ ఏపీలో ఎవ్వరికీ లేదు. కనీసం ఆ పేరుతో ప్రజలను మోసం చేయడం మానేస్తే బాగుంటుంది. ఇక హోదా అనే మాట ఎత్తకుండా ఇతరత్రా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఈ పార్టీలు ఆలోచిస్తే బాగుంటుంది. అలా కాకుండా .. హోదా నాటకాలు ఒక శాశ్వతమైన కవచంలాగా వాడుకోవాలని చూస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమే.
Discussion about this post