జాతీయ పార్టీ అనే హోదాతో కొన్ని రాజకీయ పార్టీలు తమ అస్తిత్వం దేశవ్యాప్తంగా ఉన్నదని చెప్పుకోవడానికి తపిస్తూ ఉంటాయి. కొన్ని పార్టీలు తమది జాతీయ పార్టీ అని చెప్పుకోకపోవచ్చు గానీ.. వ్యవహారంలో మాత్రం ఆ విషయాన్ని నిరూపిస్తాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నడుపుతున్న జనసేన పార్టీ అలాంటిదే.
సాధారణంగా నాయకులు.. తమ రాష్ట్రంలోని ప్రముఖుల జయంతి, వర్ధంతి రోజుల్లో నివాళులు అర్పించే ప్రకటనలు విడుదల చేస్తుంటారు. కానీ.. పవన్ కల్యాణ్ వైవిధ్యం ఎలాగంటే.. ఆయన తమిళ కవి సుబ్రమణ్య భారతి శత వర్ధంతి సందర్భంగా పవన్ కల్యాణ్ కూడా అంజలి ఘటించారు. నివాళి అర్పించారు.
కేవలం ఇంతమాత్రమే అని అనుకోవడానికి వీల్లేదు. సుబ్రమణ్య భారతి చేసిన సామాజిక, సాహిత్యాత్మక కృషిని గుర్తు చేసుకుంటూ తయారైన పత్రికా ప్రకటనను పవన్ కల్యాణ్ తమిళ భాషలో కూడా విడుదల చేశారు. పవన్ కల్యాణ్ కు తమిళనాట కూడా పెద్దస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగా వారిని మరింతగా అలరించేలా.. తమిళంలో కూడా ప్రెస్ నోట్ విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పార్టీ.. తమిళంలో పత్రికా ప్రకటన విడుదల చేయడం అనేది అత్యంత అరుదు అని చెప్పాలి.
సాధారణంగా.. ఏ రాజకీయ పార్టీ అయినా.. జాతీయ స్థాయి అంశాల మీద ప్రకటన విడుదల చేస్తే.. స్థానిక భాషతో పాటు, ఇంగ్లిషులో ఒక ప్రకటన ఇచ్చి ఊరుకుంటారు. అయితే పవన్ కల్యాణ్ స్టయిల్ వేరు. ఆయన హిందీలో కూడా ప్రకటన విడుదల చేస్తుంటారు. గతంలో కర్ణాటక వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై ఆయన తెలుగు, ఇంగ్లిషు, హిందీలతో పాటు కన్నడ భాషలో కూడా ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భాలున్నాయి. అలాగే ఇప్పుడు సుబ్రమణ్య భారతి కి నివాళి అర్పించే ప్రెస్ నోట్ ను తమిళ భాషలో కూడా విడుదల చేయడం విశేషం.
జనసేన ప్రాంతీయ పార్టీనే కావచ్చు గాక.. కానీ.. ఇతర ప్రాంతాల, రాష్ట్రాల వారి సెంటిమెంట్లను గౌరవించడం, వారి భాషను, వారి సంస్కృతిని గౌరవించే విషయంలో జాతీయ పార్టీలా వ్యవహరిస్తున్నదనే చెప్పాలి.
సుబ్రమణ్య భారతికి నివాళిగా పవన్ పత్రికా ప్రకటన ఇదీ..
జాతీయ సమగ్రతను స్వప్నించిన మహాకవి
శ్రీ సుబ్రమణ్య భారతీయార్
అక్షరాన్నీ… అలజడినీ సమంగా ప్రేమించిన తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతీయార్. అక్షరాలను శక్తిమంతంగా సంధించి సామాజికంగా నెలకొన్న అలజడిని రూపుమాపి.. ప్రజా చైతన్యాన్ని తెచ్చిన గొప్ప జాతీయవాది. బ్రిటిషర్లను వెళ్లగొట్టాలంటే ముందుగా మనకు మనంగా కట్టుకొన్న కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లాంటి అడ్డుగోడలను చేధించాలనే సత్సంకల్పంతో శ్రీ సుబ్రమణ్య భారతీయార్ రచనలు చేశారు. సమాజానికి ఆ మహాకవి అందించిన రచనలు నేటికీ మన విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేస్తాయి. జాతీయ సమగ్రతను స్వప్నించిన ఆ మహాకవి శత వర్థంతి సంవత్సరం ఇది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం శ్రీ సుబ్రమణ్య భారతీయార్ ను స్మరించుకోవాలి. ఆ మహాకవికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను.
నేను చెన్నైలో ఉన్న రోజుల్లో నా తమిళ మిత్రులు పలు సందర్భాల్లో శ్రీ సుబ్రమణ్య భారతీయార్ కవితలు గానం చేసేవారు. ఆ కవితలు చైతన్యపరస్తూ మానవ సంబంధాల గొప్పదనాన్ని చెప్పేవి. ఇందులో నాకు అమితంగా ఇష్టమైనది ‘చిన్నంజిరు కిళియే కన్నమ్మా… సెల్వ కలంజియమే’. ఆ కవితలో ఆడ బిడ్డల గురించి మహాకవి చెప్పిన మాటలు మనసును హత్తుకొన్నాయి. కన్నమ్మా.. అనే మకుటంతో అమ్మకీ, నేలకీ మకుటం పెట్టిన మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతీయార్. మన నాలుకపై ఆయన కవిత ఉన్నంత కాలం ఆయన చిరంజీవే.
‘సింధునదియిన్ మిశైనిలవినిలే’ కవితలో శ్రీ సుబ్రమణ్య భారతీయార్ జాతీయవాదాన్ని పలికించారు. ఈ కవితలోనే ’సుందర తెలుంగినిళ్ పాట్టిశైతు…’ అని తెలుగు భాష ఎంత సుందరమైనదో చెప్పారు. నిప్పు కణికల్లాంటి అక్షరాలతో… చైతన్యపరచే పద సంపదతో శ్రీ సుబ్రమణ్య భారతీయార్ అందించిన రచనలు మనకు, భావి తరాలకు తరగని ఆస్తి. ఈ మహాకవి స్వస్థలం ఎట్టయపురంలో నివసించిన ఇంటినీ, చెన్నై ట్రిప్లికేన్లో జీవించిన ఇంటిని పుదుచ్చేరిలో నివసించిన ఇంటినీ స్మారకాలుగా నేటికీ సంరక్షించుకోవడం ముదావహం. సరస్వతి పుత్రుడికి తమిళ భాషాప్రియులైన పాలకులు ఇస్తున్న గౌరవం ఇది.
(పవన్ కల్యాణ్)
.

Discussion about this post