మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇప్పుడు రాద్ధాంతంగా మారుతోంది. కోర్టునుంచి సమన్లు అందినప్పటికీ.. ఆ వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచకపోవడం అనేది ఆమె తప్పిదంగా పరిగణించి నామినేషన్ ను తిరస్కరించారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరఱ అనేది కుట్రపూరితంగా జరిగిందనేది కాంగ్రెస్ ఆరోపణ. ఈ మేరకు వారు ఈసీ మీద ఆరోపణలు చేస్తున్నారు.
మీనాక్షి నటరాజన్ మీద అసలు ఎఫ్ఐఆర్ నమోదు కానేలేదని.. కేవలం కోర్టు సమన్లు మాత్రమే అందాయని, అలాంటప్పుడు దానిని కేసుగా పరిగణించడం కరెక్టు కాదనేది కాంగ్రెస్ వాదన. టెక్నికల్ గా చూసినప్పుడు వారి వాదన కూడా కరక్టే అనిపిస్తోంది.
హైదరాబాదుకు చెందిన తెలంగాణ హైకోర్టు న్యాయవాది కరుణ సాగర్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత కీలకమైనవి. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలనుకునే ప్రతి అభ్యర్థి తన అఫిడవిట్లో పూర్తి మరియు వాస్తవ సమాచారాన్ని వెల్లడించడం చట్టబద్ధమైన బాధ్యత అనేది ఆయన వాదన. ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని సెక్షన్ 36(2)(b) ప్రకారం, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ఉన్న ప్రాముఖ్యత మరోసారి స్పష్టమైందంటున్నారు. . అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, హైదరాబాద్ కోర్టులో పెండింగ్లో ఉన్న వ్యవహారాన్ని అఫిడవిట్లో వెల్లడించలేదని రీటర్నింగ్ అధికారి నిర్ధారించి ఈ నిర్ణయం తీసుకున్నారే తప్ప అందులో కుట్ర కోణం లేదని అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల అఫిడవిట్లు కేవలం ఒక ప్రక్రియ కాదు; అవి ఓటర్లకు నిజమైన సమాచారాన్ని అందించే ముఖ్యమైన సాధనం. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే పూర్తి సమాచార వెల్లడించడం తప్పనిసరి అని న్యాయవాది కరుణకుమార్ అంటున్నారు.
సాంకేతికంగా చూసినప్పుడు.. సమన్లు అందిన వివరాల్ని అఫిడవిట్ లో పేర్కొనకపోవడం నామినేషన్ తిరస్కరణకు దారితీసి ఉండవచ్చు. కానీ పత్రికలలో వస్తున్న వార్తలను బట్టి.. మీనాక్షి నటరాజన్ మీద పెట్టిన కేసే సరైనది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు తనను మోసం చేసినట్టుగా శ్రీలత కేసు పెట్టారు. అతని మీద కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదుచేసినా కూడా పట్టించుకోలేదని, చర్య తీసుకోలేదని పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మీద కూడా కేసు పెట్టారు. ఇది ఏరకంగా తర్కబద్ధం అనే చర్చ తెరపైకి వస్తోంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మీద పోలీసు కేసు పెడతారు, లేదా కోర్టులో పిటిషన్ వేసి ఆరోపణలు చేస్తారు. అతడి మీద చర్యలు తీసుకోలేదు గనుక.. పోలీసు అధికారుల మీద న్యాయమూర్తి మీద కూడా కేసు పెట్టడం సాధ్యమవుతుందా? అలా కేసు పెడితే వారికి కూడా సమన్లు ఇస్తారా? అనే చర్చ తెరపైకి వస్తోంది.
తప్పు ఎవరిదైనప్పటికీ.. గాంధేయవాదిగా పేరున్న మీనాక్షి నటరాజన్.. ఉద్దేశపూర్వకంగా దాచి ఉండకపోవచ్చు గానీ.. నామినేషన్ వేసేప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఈ సమన్లను సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల నామినేషన్ తిరస్కరణ అయినట్టుగా కనిపిస్తోంది.
.
Discussion about this post