రాజధాని ప్రాంతంలో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పోరేషన్ (ఏసీసీఎంసీ) ఏర్పాటుకు నాలుగు గ్రామాల్లో సభలు పెట్టి ప్రభాభిప్రాయం సేకరిస్తే… నాలుగు చోట్లా ఏకగ్రీవంగా తిప్పికొట్టారు. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ అన్నిచోట్ల వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది..?
జనం మాటకు విలువ ఇస్తుందా..? లేక తాము చేయదలచుకున్నదే చేస్తుందా..? అనే అంశంపై అమరావతి ప్రాంతం వారితో పాటు… రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోకుండా జగన్ ప్రభుత్వం ముందుకు వెళితే… భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఏర్పడే ప్రమాదముంది.
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పేరేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు రెండు రోజులుగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మొదటి రోజైన బుధవారం మంగళగిరి మండల పరిధిలోని కురుగల్లు, నీరుగొండ గ్రామాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. ఇక గురువారం లింగాయపాళెం, కృష్ణాయపాళెం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ నాలుగు గ్రామాల్లో ప్రజలందరూ ప్రభుత్వ ప్రతిపాదనను మూకుమ్మడిగా తిరస్కరించారు.
తుళ్లూరు మండలంలోని 16, మంగళగిరి మండలంలోని 3… మొత్తం 19 గ్రామ పంచాయతీలను కలిపి నగర పాలక సంస్థగా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రభుత్వ ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. సీఆర్ డీఏ చట్టంలో పేర్కొన్న విధంగా కార్పోరేషన్ లో మొత్తం 29 గ్రామాలను కలపాల్సిందేనని వారు పట్టు పడుతున్నారు. అమరావతి ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే ప్రభుత్వం తమను విడదీస్తోందని వారు అంటున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండు చేస్తూ… ఆ ప్రాంత రైతులు ఉద్యమానికి శ్రీకారం చుట్టి నేటికి 750 రోజులు అయింది. ఇంకా వారు దీక్షలు చేస్తూనే ఉన్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో అమరావతి రైతులు ఇటీవల చేసిన మహాపాదయాత్ర సైతం విజయవంతమైంది.
మహాపాదయాత్రకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారు మొక్కవోని దీక్షతో ముందుకే కదిలారు. మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభ కూడా ఊహించిన దానికన్నా విజయవంతమైంది. ఈ బహిరంగ సభకు అధికార పార్టీ వైసీపీ తప్ప అన్ని రాజకీయపార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. సాధారణ రైతులు రాజధాని కోసం రెండేళ్లకు పైగా విరామం లేకుండా నిత్యం ఉద్యమం చేస్తుండటంతో పాలకులకు మింగుడు పడటం లేదు.
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పోరేషన్. సీఆర్ డీఏ చట్టంలో 29 గ్రామాలు ఉండగా… వీటిని విభజించి కేవలం 19 గ్రామ పంచాయతీలనే నగర పాలక సంస్థగా ఏర్పాటు చేస్తుండటం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందనేది ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం. అందులో వాస్తవం కూడా ఉంది. జగన్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సీఆర్ డీఏ పరిధిలోని 29 గ్రామ పంచాయతీలను నగర పాలక సంస్థలోకలపాలి. అలా కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజధాని ప్రజలను విడదీస్తోంది.
అయితే పోరాటంలో రాటుదేలిన అమరావతి ప్రజలు మాత్రం ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పి కొడుతున్నారు. వారంతా ఐకమత్యంగా ఉంటూ… ప్రభుత్వ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నారు. రెండు రోజుల్లో నాలుగు గ్రామాల్లో అధికారులు ప్రజాభిప్రాయ సభలు నిర్వహించగా… నాలుగు చోట్ల అధికారులకు చుక్కెదురు అయింది. ప్రభుత్వ ప్రతిపాదన ప్రజలు తిరస్కరిస్తున్నట్లు నివేదిక అందచేస్తామని అధికారులు కూడా ప్రకటించారు. ఇక మిగిలిన 15 గ్రామాల్లో కూడా అధికారులకు ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అయితే జగన్ ప్రభుత్వం మాత్రం తమ ప్రతిపాదనలకు అనుగుణంగానే ముందుకు వెళ్లడానికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు గత అనుభవాలే మనకు సాక్ష్యాలు. మూడు రాజధానులు బిల్లు ఉప సంహరించుకుంటున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది. అయితే తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని… మళ్లీ మెరుగైన బిల్లు తెస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇదే తరహాలో ఏసీసీఎంసీ విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది.
ఎందుకంటే జగన్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తాము అనుకున్నదే చేసుకుంటూ ముందుకు పోతోంది. ఇలా చేయడం వలన న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదు. ఈ అనుభవాల దృష్ట్యా ఏసీసీఎంసీ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇదే జరిగితే అమరావతి ప్రాంతంలో రైతుల ఉద్యమం మరింత బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూద్దాం.
.

Discussion about this post